OM SARAVANA BHAVA - 3 books and stories free download online pdf in Telugu

ఓం శరవణ భవ - 3

మహా పరివర్తనమునకు  సమయం సమీపించింది .   ఓంకార స్వరూపుడైన కుమారుడు ప్రభవించే శుభ తరుణం అతి చేరువలోనే ఉంది . 

సమున్నత హిమాలయ గిరి శృంగములు ,  మానస సరోవర ప్రాంతం ,. ప్రశాంత ప్రకృతి  లో , పరమ రమణీయ ప్రదేశము లో .....  హిమవంతుడు , మేనక   …. 

హిమవంతుడు అచంచల తపోదీక్షలో  ఉన్నాడు . ఆయన సంకల్పం మహోత్కృష్టం . శుభకరం. విశ్వ కల్యాణ కారకం . పరాత్పరుని పుత్రికగా పొందాలన్నది హిమవంతుని అభిమతం . అందులకే సాగుచున్నది నిశ్చల తపం . 

హిమవంతుని ధర్మపత్ని మేనక  తపో దీక్షలో సర్వం మరచిన పతికి శుశ్రూషలు చేస్తూ సతిగా  తన కర్తవ్యం  నిర్వహిస్తూంది .  

తరుణమాసన్నమైంది . వినీల ‘ప్రభలు’ వెదజల్లే ఓ ‘దివ్య జ్యోతి’  సాకారమయ్యే క్షణం రానే వచ్చింది . అందుకు సంకేతంగా ప్రకృతి లో  ఆణువణువూ  పులకించి పోయింది .  నిలువునా కదిలి పోయింది . 

హిమవంతునికి అభిముఖం గా,  ముకుళితమైన నీలోత్పలం మెల్లమెల్లగా  వికశించింది .  అందులో పరాత్పరి , శుద్ధ చైతన్య రూపిణి  ,  విశుద్ధ జ్ఞానదాయిని  అయిన ‘అంబ’  పసిపాపలా దర్శనమిచ్చింది . హిమవంతుడు పరమానందభరితుడయ్యాడు ,    ఆ పసిపాపను మేనకకు అందించాడు .  ఆ దివ్య స్పర్శ తో మేనక  నిలువెల్ల పులకించి పోయింది .   మాతృ భావన తో ఆమె మనసు  కది లి పోయింది .   ఆమె వక్షోజములు పొంగి  క్షీరధారలు   స్రవించినవి .  పరాత్పరికే పాలిడిన  పుణ్య భాగిని  మేనక . 


   పార్వతి  బాల్యం  ఓ కమ్మని కలలా  సాగింది .  హిమవంతుని , మేనక   ప్రేమాభిమానాలు  ఆ పసిపాపపై అమృత వృష్టిలా  కురిసినవి . 


            పార్వతి లో పిల్లలకుండే  సహజ  బాల్య  చాపల్యం  చాలా తక్కువ .  అరవిందములవంటి  ఆమె స్లోగ కన్నులు  ఏ పూర్వజన్మ అనుభూతి నో  , అనుభవాన్నో  ప్రతిఫలిస్తూంటాయి .  నిజ మందిరము లో  ఏ మూల శివ రూపం  కనిపించినా  అలాగే చిత్తరువులా నిలిచి పోయేది . నటరాజమూర్తిని అనుకరిస్తూ   ఆ భంగిమ లోనే చాల సేపు గడిపేది .   ఆమె పరాకు , తదేక ధ్యానం  గమనించిన  తండ్రి  ఆమెను ‘ ఉమ’  అని హెచ్చరించే వాడు . 

 

            ఐదేళ్లు నిండిన పార్వతి  తపమాచరించి తండ్రి అనుమతి కోరుతుంది .   బాల్య క్రీడలలో మునిగి 

తేవలసిన  పసి బాల  ప్రాజ్ఞురాలివలె  శివధ్యానం చేస్తాననడం  తల్లిని అయోమయం లో పడవేస్తుంది .   ఆమెను వారింప శతవిధాలా ప్రయత్నిస్తుంది .  కానీ, ఆమె సంకల్పం వజ్ర సదృశం .


              ఉపయుక్త ప్రదేశం లో  పార్వతి తపసు ప్రారంభమయింది .  తండ్రి హిమవంతుడు  ఆమెకు తపో భంగం కలుగ కుండా  అన్ని ఏర్పాట్లు చేస్తాడు .  జయ, విజయ, అనే ఇరువురు  చెలికత్తెలు ‘ఉమ ‘ కు తోడయ్యారు .  కాలం యధావిధి గా  ముందుకు సాగుతూంది .   కౌమార దశ ముగిసి  యవ్వన ప్రాంగణం లోకి  అడుగిడింది  పార్వతి .  కానీ,  తపో దీక్షలో  ఇసుమంతైనా మార్పు లేదు . 


               లేత యవ్వనం మొగ్గ తొడిగిన  సుందర సుమధుర  ఆకృతి  . అర్థ నిమీలితములైన నేత్రములు  అరవిందాల వలె   సోగదేలి   కాంతులీనుతున్నాయి .  పల్లవ సదృశములైన  పెదవులపై  పంచాక్షరి   అవిరామంగా , లయబద్దం గా  నర్తిస్తూంది . 


                   ఒకనాడు మేనకా సమేతుడైన  హిమవంతుడు , వెంట రాగా  నారద మహర్షి  ఆ దివ్య తపోభూమిని  పావనం చేస్తాడు .  ‘ అభీష్ట ఫల సిద్ధి రస్తు  ‘ అని పార్వతి ని సందర్భోచితంగా  ఆశీర్వదిస్తాడు .   ఆమె దీక్ష  లోకోత్తరమని , ఆమె కళ్యాణం లోకకల్యాణ కారకమని  సూచన ప్రాయం గా  తెలియజేస్తాడు .   దేవర్షి  ఆగమనం  హైమావతి కి  కొండంత బలం చేకూర్చుతుంది . . 

  వర బల  సంపన్నుడై , వెయ్యిన్ని ఎనిమిది అండ ములకు ప్రభువై  వెలిగి పోతున్న  శూర పద్ముని , అతడి సోదర ద్వయాన్ని  తల్లి మాయాదేవి  దీవించి , కలిసి మెలజీవించమని , దేవతలకే ఆదర్శం గా మెలగమని  హితవు చెప్పి  అంతర్ధానమవుతుంది . కానీ జన్మ వైరులైన దేవతలను  ఉపేక్షించుట క్షేమకరం కాదని  శూర పద్ముని   ఆలోచన. 

                    

                                                                           XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX


                                                                                                     కొనసాగించండి  4 లో