Om Saravana Bhava - 1 books and stories free download online pdf in Telugu

ఓం శరవణ భవ - 1

కార్తికేయ చరితము
కుమార గాధా లహరి
తొలి పలుకులు
కార్తికేయుడని, షణ్ముఖుడని ఉత్తరాపథం లోను, సుబ్రహ్మణ్యుడు, మురుగన్, ఆర్ముగం అని
దక్షిణ దేశం లోను కొలువబడుచున్న శివ" కుమారుడు అశేష జనావళికి జ్ఞాన ముక్తి ప్రదాత.
వ్యాస ప్రోక్తమై, అష్టాదశ పురాణాల లో ఒకటైన" శ్రీ స్కాంద పురాణం " ప్రామాణికంగా సుబ్రహ్మణ్యుని చరితము ను వివరిస్తుంది. అంతేగాక, శివ, అగ్ని పురాణాలలో కూడా సందర్భోచితంగా కుమార గాధను ప్రస్తావించారు. ఇక కుమార సంభవం" షణ్ముఖుని కమనీయ గాధను కావ్యాత్మకంగా ప్రబోధించింది.
దక్షిణ భారతంలో కాశ్యప శివాచార్యుని ( కచ్చియప్ప. అన్నీ నామంతో తమిళులు వ్యవహరిస్తారు. ) 'కంద పురాణం '
దేశీయత, విచిత్ర కధా సంవిధానం తో పండిత, పామర జనరంజకమైంది.

పై గ్రంధాలన్నింటి సారమైన " శ్రీ స్కాంద పురాణ సారామృతం " నేటి కథా సంగ్రహమునకు మూలం.
సంస్కృత దేశీయ భాషల్లోని ముఖ్య గ్రంధములను అవలోకించి, సారాన్ని గ్రహించి, శ్రీ నటరాజన్ , ,నా స్నేహితుడు గ్రంథ రూపంలో తమిళం లో రచన చేశారు. ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా అన్ని వివరాలు క్లుప్తంగా, సుబోధకంగా, నేటి కాలానికి అనువుగా ఈ చిన్ని గ్రంథం లో పొందు పరిచారు. కథ, కథనం, శైలి, త్రివేణి సంగమం లా సాగిన కారణంగా ఈ గ్రంథం లో సాహిత్య పు విలువలు మంచి గంధం లా గుబాళించాయి.
ధ్వన్యాత్మకం గా, జ్ఞాన ప్రేరకంగా సాగిన ఈ రచన సుబ్రహ్మణ్యుని శివ-శక్తి సమాగమం తో అవతరించిన విరాట్ స్వరూపుడిగా. ఆవిష్కరించింది. నిరాకార విలక్షణ మూర్తిని సప్రమాణంగా సాకార మొనరించింది.
( ఈ గ్రంథం తిరుమల తిరుపతి దేవస్థానము వారి ఆర్థిక సహాయం తో వెలుగు లోకి వచ్చింది. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి " జగద్గురు శ్రీ శంకరాచార్య స్వామి వారి" శ్రీముఖం " తో ఆశీస్సులతో తన ఉనికిని దశదిశలా చాటుకుంది. " కుమార తత్త్వం " అన్న శీర్షికతో ప్రొఫెసర్ హెచ్, యస్, బ్రహ్మానందం గారు వ్యక్త పరచిన అభిప్రాయాలు ఈ గ్రంథం ప్రామాణికతను తేటతెల్లం చేశాయి)
ఇలా భారత వాజ్మయం లో విశిష్ట స్థానాన్ని అలంకరించిన
కుమార గాథ పండిత లోకంలో చిరపరిచితమైనా సామాన్య జనవాహినిలో అంత ప్రాచుర్యం పొందలేదనే చెప్పాలి.
సుబ్రహ్మణ్యుడు శివ కుమారుడి గా , శూర పద్మాది రాక్షస సంహారి గా తమిళ నాట ఇలవేల్పు గా , పిలిస్తే పలికే దైవం గా ప్రసిద్ధి పొందిన విషయం. నిర్వివాదాంశం.

అందుకే పురాణాలలో, అనేక కావ్యాలలో కార్తికేయుని నామ, రూప, గుణ, విశేషాలు చదువు తుంటే మనం పొందే దివ్యానుభూతి. అనిర్వచనీయం.

అందుకే ( దివంగతుడైన) నా స్నేహితుని కోరిక మేరకు ఆ తమిళ
గ్రంథ విశేషాలను జనరంజకం చేయాలని , " ధారావాహిక" రూపంలో తెలుగు లో సరళం గా, సంక్షిప్తంగా మలచాలని శ్రీకారం చుట్టడ మైంది.
ఈ గాధను దృశ్యాత్మకం చేసి, షణ్ముఖుని శివ-శక్తి సమిష్టి రూపంగా, పరదైవంగా ప్రతిపాదించాలన్నది జీవితాశయం.ఆ పై ఆ కార్తికేయుని ఇచ్ఛ.. ఆశీర్వాదం.


వాక్కు ద్వారా కలిగే జ్ఞానాన్ని
' బ్రహ్మ ' మన్నారు. అట్టి వాక్ స్వరూపుడైన మనిషిని 'బ్రహ్మణ్యుడన్నారు ' .
వారిలో పరమ శ్రేష్ఠ అవతార రూపమే' సుబ్రహ్మణ్యుడు' . శివుని ఆరు ముఖముుల నుండి ఉద్భవించిన మహాశక్తుల అపూర్వ సంగమమే ' షణ్ముఖుడు '.
పార్వతీదేవి జ్ఞాన. క్షీరాన్ని గ్రోలిన షణ్ముఖుడు ఆ సారమంతా తనలో ఇముడ్చుకున్న కారణంగా " స్కందుడని' ఖ్యాతి పొందాడు.
లోక కంటకులైన శూరపద్మాది రాక్షసులు
శివానుగ్రహంతో మహాబల సంపన్నుల , తామస గుణ ప్రేరితులై , సర్వ లోకాలలో విలయం సృష్టించగా, వారి సంహారం కొరకు, ఉద్భవించిన. శివ తేజమే. " సుబ్రహ్మణ్యుడు".
దేవ సేనలకు నాయకుడై శూరపద్మాదులతో, భీకర సంగ్రామం సాగించి, వారిని తుదముట్టించిన అపార బల సంపన్నుడు ఈ షణ్ముఖుడు. ఈ ధీర గంభీర మూర్తి వల్లీ దేశసేనలను వివాహ మాడి ,. మధుర మనోజ్ఞ శృంగార మూర్తి కూడా అయినాడు.
వినూత్నమై, విచిత్రమై, విలక్షణమై సాగే " కార్తికేయ చరితము " అంతర్ముఖులైన భక్తులకు, జిజ్నాసువులకు, అనంత జ్ఞాన ప్రదాయిని, ముక్తి దాయిని. శివకుమారుని లీలా విశేషములు, అందుగల అంతరార్థము లు అవలోకించి, ఆకళింపు చేసుకుంటే సామాన్యుడు కూడా, స్థిత ప్రజ్ఞుడై బ్రహ్మానందం పొందగలడు.
*************†************************

కథా సంగ్రహం
ఈ అనంత సృష్టికి మూలం మాతృ రూపమైన కామేశ్వరి. ఆమె సంకల్పం సాకారమై విశ్వం
దృశ్యాత్మమైనది. సృష్టి, స్థితి లయలు విశ్వరచనకు మూల తత్వములు. ఆ తత్వములకు అధిదేవతలు త్రిమూర్తులు. వారి ఆవిర్భావముతో విశ్వ రచనకు. కామేశ్వరి శ్రీకారం చుట్టింది.
ప్రకృతి - పురుషుల పరస్పరాకర్షణ,అన్యోన్యత సృష్టికి బీజం. ఈ భావం తోనే బ్రహ్మ విష్ణువు లను సృష్టి రచనలో
తనతో సహకరించమంటుంది కామేశ్వరి. మాతృభావం మది నిండిన కారణంగా అందుకు వారిరువురు వివరంగానే తమ అశక్తతను వెల్లడి చేస్తారు. తన సంకల్పమునకు అవరోధం కల్పించు వారిరువురిిినీన బ్రహ్మాండ నాయకి భస్మం చేస్తుంది.
మహేశ్వరుడు వీరిరువురికీ భిన్నంగా సమయస్ఫూర్తి తో మెలిగి కామేశ్వరి మూడవ నేత్రమును. గ్రహించగలుగుతాడు. ముక్కంటి యై మహేశ్వరినే భస్మావశిష్టం చేయగలుగుతాడు.
శివుని చొరవకు , చెలిమికి, శుభ సంకల్పమునకు ప్రసన్నురాలైన కామేశ్వరి బ్రహ్మ -విష్ణువులను పునరుజ్జీవులను చేసి , శక్తి త్రయమును సృజించి , త్రిమూర్తులకు, వారి దేవేరులకు సముచిత స్థానములు. కల్పిస్తుంది. ఓంకార స్వరూపుడైన గణపతి - షణ్ముఖుల ఆవిర్భావమును సూచనప్రాయంగా తెలియజేస్తుంది.
నిరాకారం సాకారానికి మూలం. అక్షరమైన నిరాకారం సత్య స్వరూపం. అట్టి సత్యస్వరూపమును త్రిగుణాత్మకంగా వ్యక్త పరచునది సత్య లోకం. "
సత్యలోకమునకు అధిదేవత బ్రహ్మ, చతుర్ముఖుడు. సృష్టికి కారకుడు. ఆయన నాల్క పై నిలిచిన శారదాదేవి అవ్యక్తమును వ్యక్తము చేసే సృష్టి రచనలో తన వంతు పాత్ర నిర్వహిస్తుంది.
పరమేష్టి ధ్యాన మగ్నుడవుతాడు. ఆయన సంకల్పం సాకారమయ్యే సమయమాసన్నమయింది.
బ్రహ్మ అంగుష్ఠములనుండి స్త్రీ పురుషులు ఇరువురు ఉద్భవించారు. వారిని కళ్యాణ బంధముతో కలిపి కారణజన్ములుగా బ్రహ్మ దీవించారు.
స్త్రీ ....ధరణీదేవి. పురుషుడు..... దక్ష ప్రజాపతి. వారికి సతీదేవి పెద్ద కుమార్తె. అశ్విని, భరణి కృత్తిక, రోహిణి ఆదిగా గల పేర్లతో అలరారే కన్యారత్నములు ఆమె చెల్లెళ్ళు.
సతీదేవి సదాశివుని ఇల్లాలయింది. ఆమె చెల్లెళ్ళు చంద్రునికి భార్యలైనారు. ఇలా సర్వలోకాలలో ప్రజాపతి ఖ్యాతి పారిజాత పరిమళంలా గుబాళించింది. ఈ పరిణామం ఆయనలో అహంకారానికి కారణమైంది. సతీదేవిని సదాశివునికి అర్పించి దక్షుడు పరాత్పరుడికే " మామగారు" అయినాడు. అశ్విని భరణి కృత్తిక రోహిణి మొదలగు వారు చంద్రునికి భార్యలైనందువలన, వారి తండ్రి గా ప్రజాపతి విశ్వ సృష్టి రచనలో కీలకపాత్ర వహించాడు. ఈ రెండు విశేషాలు ఆయన ప్రతిష్టను పెంచగా అహం మీరి గర్వాతిశయంతో విర్రవీగి పోయాడు. అనుకూలవతి, అనురాగం నిధి, సతి అయిన ధరణీదేవి భర్త లోని ఈ విపరీత పరిణామానికి విస్తుబోయింది.
విశ్వ హితముకై పరమేశ్వరుడు తలపెట్టిన ఒక మహా యజ్ఞం లో దక్షుడు కన్నుమిన్నుు కానుగ, కానరాని అహంకారం తో శివదూషణ చేస్తాడు.
తన పెద్దరికాన్ని పరమశివుడు గుర్తించలేదన్న వెర్రి ఆవేశంతో శివుని ఎదిరించి నానా దుర్భాష లాడి ' నిరీశ్వర యాగం' చేయాలని ఉద్యమిస్తాడు. ఆ యాగానికి దేవతలందరూ
తప్పని సరిగా రావాలని ఆంక్ష విధిస్తాడు.
నిరీశ్వర యాగం' పరాత్పరి కామేశ్వరి సంకల్పమునకే విరుద్ధం. దక్షుని అహంకారానికి, అజ్ఞానానికి మచ్చుతునక. త్రిమూర్తుల ఉనికినే సవాలు చేసిన ఆ యజ్నం సృష్టి కే విపరీతమని పరమేష్టి, పరంధాముడు దక్షుని ఆహ్వానాన్ని మన్నించడు. దక్షుని ప్రాభవానికి తలవొగ్గి దేవతలు నిరీశ్వర యాగమును సందర్శిస్తారు.
ఆహ్వానం లేకపోయినా పుట్టింటి పై మమకారం తో , స్త్రీ సహజమైన చాపల్యంతో
సతీదేవి దక్షయజ్ఞ వాటికను సందర్శిస్తుంది. . అక్కడ ఆమెకు అడుగడుగునా అవమానమే ఎదురవుతుంది. . తండ్రి అహంభావంతో శివుని ఉనికినే సవాలు చేస్తాడు. మరోసారి శివనిందకు
తలపడి సతీదేవి మనసును గాయ పరుస్తాడు.
భర్త ను కాదని ఆ సాధ్వి దక్ష యజ్న వాటికలో అడుగు పెట్టింది. కాని తండ్రి మాయా మోహితుడై ,. కేవలం లౌకిక దృష్టితో ఆమె మనసు గాయపరిచాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆమెకు ఏమిటి దారి ? ఎటూ వెళ్ళలేని డోలాయమాన స్థితి ఆమెది .
అభిమాన వతి. యైన సతీదేవి , తన ఉనికే తనకు భారం కాగా , యోగాగ్ని జ్వాలలు ప్రభవింప జేసి అందులో సజీవంగా , సశరీరంగా ఆహుతి అయిపోతుంది. ఈ హఠాత్పరిణామం యజ్నవాటికలో అందరినీ నిశ్చేష్టులను చేస్తుంది. కూతురి వియోగం భరింపలేని ధరణీదేవి. విగతజీవురాలవుతుంది .
అర్థాంగి దూరమైన అర్థనారీశ్వరుడు, అభయంకరుడు కళ తప్పి, కన్నులు మూసుకొని, నిశ్చల యోగ సమాధిలో మునిగి పోతాడు. సతీదేవి లేక కైలాసం చిన్నబోతుంది. సదాశివుడు భీష్మించుకు కూర్చుని కైలాసవాసులను, ప్రమథ గణాలను. ఉపేక్షిస్తాడు.
యోగ సమాధిలో నిశ్చలంగా ఉన్న ఆ నిటలాక్షునికి యోగాగ్ని జ్వాలలో. ఆహుతి అవుతున్న సతీదేవి గోచరిస్తుంది. మది
మెదిలిన విషాద వీచిక ప్రచండమై, ప్రభంజనమై శివుని కుదిపేస్తుంది. ఎగిసిన అగ్ని శిలలా లేచిన
రుద్రుడు ప్రళయ నృత్య మొనరించాడు. క్రమక్రమంగా విశ్వ వ్యాప్త మైనాడు. ఆయన ధాటికి నిలువలేక సమస్త విశ్వము లు అల్లల్లాడినవి. గ్రహములు, నక్షత్రములు గతులు తప్పాయి. సత్యలోకము, వైకుంఠము కంపించిపోయాయి. భూలోకము ఆ ప్రచండ పవనానికి లక్ష్య హీనంగా ఎగిరిపోయే ఎండుటాకు అయింది.
అలా ప్రళయ నృత్య మొనరించిన శివుడు , ఆవేశపు పొంగు చల్లారాక, శాంతించి కైలాసం చేరాడు. ప్రమథ గణాలను సమీకరించి , తన జట నుండి వీరభద్రుని సృజించి దక్షుని పై దండ యాత్రకు
పంపుతాడు.
దక్ష వాటిక చేరిన వీరభద్రుడు శివ ప్రేరితుడై సమరోత్సాహముతో
విజృంభిస్తాడు. ప్రమథ గణాలు క్షణాలలో యజ్న వాటికను ఛిన్నాభిన్నం చేస్తాయి. వీరభద్రుడు పాశుపతం వలె చెలరేగి, దేవతలను అంగవిహీనులను, వికృతరూపులను చేస్తాడు. దక్షుని శిరమును ఖండించి హోమకుండములో వేసి అగ్ని కి ఆహుతి చేస్తాడు
సర్వము సాక్షి రూపులై వీక్షిస్తున్న
బ్రహ్మ, విష్ణువు లు తమ వంతు బాధ్యత నిర్వహించుటకు కైలాసమును చేరి కపర్థిని ప్రార్థిస్తారు. పరాత్పరుడు ప్రసన్నుడై, వారి అభీష్టం మేరకు దేవతల అంగవిహీనతను పోగొట్టి దక్షునికి ప్రాణదానం చేస్తాడు. ఆనాటి నుండి దక్షుడు " అజముఖు"(మేక తల) డవుతాడు. అజముఖుడు తన తప్పు తెలుసుకుని శంకరుని శరణు వేడుతాడు.
శాంతి పడిన శివుడు ప్రకృతి స్వరూపిణి పరాత్పరి చెంతలేని కారణాన రజోగుణం లుప్తమై పోగా సత్త్వ గుణ ప్రేరితుడై
, జ్ఞాన రూపుడై ' దక్షిణామూర్తి' అవుతాడు.
విశుద్ధ జ్ఞానానికి, పరబ్రహ్మ తత్త్వము నకు ఆద్యుడు దక్షిణామూర్తి. , సాకార నిరాకార సమన్వయ రూపుడు.
చిన్ముద్ర ను దాల్చి, మర్రి చెట్టు నీడలో తపస్సమాధిలో ఉన్న దక్షిణామూర్తి ని సనకసనందాదులు. ఆశ్రయించి జ్ఞాన భిక్ష పొందుతారు. కేవలం ' మౌన వ్యాఖ్య ' ద్వారా
సమస్త జ్ఞాన మును వారికి ఆ శుద్ధ చైతన్య మూర్తి తత్త్వ రూపేణ బోధిస్తాడు.

*************
2 లో చూద్దాం.
.