Bribery - Good lesson books and stories free download online pdf in Telugu

లంచం - గుణ పాఠం

లంచం - గుణపాఠం

ఒక ఊరిలో రంగారావు అనే రైతు ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. ఇంట్లో వాళ్ళ భార్య రంగమ్మ కొడుకు రాములు నివాసం ఉండేవారు. అతనికి రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ,జీవనం సాగిస్తూ ఉండేవాడు. కొన్ని రోజులు పని చేసినా కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఒక్కగానొక్క కొడుకును అల్లారుముద్దుగా చూసుకుంటూ, వారు తిన్న తినకున్నా అతనికి తిండి పెట్టే వారు. కొడుకు రాములు కూడా అన్ని విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు.కొడుకు రాములు కూడా ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకుని చిన్నప్పటినుండి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. రానురాను రాములును చదివించడం రంగారావు కష్టంగా మారింది.పదవ తరగతి పరీక్ష ఫీజు కట్టడానికి కూడా చిల్లిగవ్వ లేదు. అది గుర్తించిన రాములు బడి మానేసి పొలం పనులకు వెళ్లేవాడు. రంగారావు అదే ఊరిలో ఉండే ఒక వడ్డీ వ్యాపారి సోమయాజులు దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకొని, రాముల్ని మళ్లీ బడికి పంపాడు. రాములు పదవ తరగతి పరీక్ష ఫీజు కట్టి, ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసయ్యాడు. ప్రైవేటు కళాశాలలో ఎక్కువ ఫీజులు కట్టాల్సి ఉంటుంది,అందుకే ఒక గవర్నమెంట్ కళాశాలలో చదివి ఇంటర్ కూడా 969 మార్కులు తెచ్చుకొని పూర్తి చేశాడు.

కొద్ది రోజులకి రంగారావు ఆరోగ్యం క్షీణించసాగింది. పొలం పనులు చేయడం, కూలికి వెళ్లడం కష్టంగా మారింది. ఇంట్లో తిండి లేక అందరూ పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తండ్రి అనారోగ్యానికి వైద్యం చేయించడానికి డబ్బులు లేవు. కొడుకు రాములు ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఏదైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని గట్టిగా అనుకున్నాడు. అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం VRO నోటిఫికేషన్ ని విడుదల చేసింది. అదే అదునుగా భావించిన రాములు ఎలాగైనా విఆర్వో జాబ్ సంపాదించాలి, అమ్మ నాన్నలను బాగా చూసుకోవాలి అని అనుకున్నాడు. కానీ జాబ్ అప్లై చేయడానికి కూడా డబ్బు లేదు.స్నేహితుల వద్ద, ఇరుగుపొరుగు వారి వద్ద డబ్బులు అప్పుగా అడిగాడు, ఎవరు కూడా సాయం చేయలేదు. విఆర్వో జాబ్ కోచింగ్ తీసుకోవడానికి కూడా డబ్బు లేకపోవడంతో, స్నేహితుల వద్ద గ్రూప్స్ పుస్తకాలు తీసుకొని రాత్రుల్లో ప్రిపేర్ అయ్యేవాడు, పొద్దున అంతా పొలం పనులకు వెళ్లి, కూలి పని చేసి, డబ్బు సంపాదించే వాడు. అలా వచ్చిన డబ్బుతో నాన్న అనారోగ్యాన్ని బాగుచేసి, వీఆర్వో పరీక్ష ఫీజు కట్టి పరీక్ష రాశాడు. కొద్ది రోజుల్లో పరీక్ష ఫలితాలు వచ్చాయి. విఆర్వో జాబ్ సెలెక్ట్ లిస్టులో రాములు పేరు వచ్చింది. తర్వాత కొద్ది రోజులకు ఒక ప్రభుత్వ అధికారి అతని వద్దకు వచ్చి, తనకు విఆర్ఓ ఉద్యోగం వచ్చిందని శుభాకాంక్షలు తెలిపాడు, కానీ ఆ జాబ్ నీ సొంతం అవ్వాలంటే రెండు లక్షలు లంచం ఇవ్వాలి అని అన్నాడు.ఒక వేళ కాదు అంటే నీ తర్వాత వ్యక్తి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు డబ్బులు ఇవ్వడానికి, ఆలోచించుకో నువ్వే, ఒకవేళ కాదు కూడదు కంప్లైంట్ చేస్తాను అంటే అధికారులంతా మావాళ్లే, నువ్వు ఒకడివి ఏమి చేయలేవు అని నవ్వి అతని చేతిలో విస్టింగ్ కార్డు పెట్టి, అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా రాములు గుండె ఆగినంత పని అయింది. విఆర్వో జాబ్ వచ్చింది అన్న సంతోషం అరక్షణంలో ఆవిరైపోయింది.ఇప్పుడు ఏం చేయాలి ?ఏం దిక్కుతోచడం లేదు ? నా పరిస్థితి ఎవరికి చెప్పాలి? తన బాధను తనలో దాచుకుని , కూలబడి పోయి,అక్కడే కాసేపు తల పట్టుకున్నాడు. ఆఫీస్ డ్యూటీ అయిపోయింది ,అందరు ప్రభుత్వ అధికారులు వెళ్లిపోయారు, తను ఒక్కడే మిగిలాడు కాసేపటికి తేరుకుని చూశాక సమయం ఆరు అయిందని గమనించాడు. మొత్తం ఆలోచించిన తర్వాత తనకు ఏ ఉద్యోగం కూడా రాదు, ఎక్కడైనా డబ్బు కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ నాకు ఏమీ వద్దు, చావడం ఒకటే దిక్కు, ఇదే అన్నింటికీ పరిష్కారం అని భావిస్తాడు. కానీ వెంటనే తనని కని పెంచిన తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు, తను చని పోతే తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అనాధలై పోతారు, వాళ్ల ఆలనా పాలనా చూసుకునేది నేనే కదా, నేను లేకపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు, తల్లిదండ్రులు ఏమవుతారు అని ఆలోచించి వెంటనే రాములు అక్కడి నుండి బయలుదేరుతాడు. కొడుకు రాములు రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో తండ్రి రంగారావు గాబరాపడుతుంటాడు. వెంటనే కొడుకు రాకతోటి మనసు కుదుటపడి, ఎందుకు ఆలస్యం అయింది అని అడక్కుండా వెంటనే వెళ్లి స్నానం చేసిరా భోజనం చేద్దువు అని అంటాడు. మెల్లగా రాములు అన్నం తిన్న తర్వాత తండ్రి రంగారావు తనకు వచ్చిన విఆర్ఓ ఉద్యోగం ఏమైంది అని అడుగుతాడు. రాములు తడబడుతూ ఆ వచ్చేసినట్టే, కానీ కొంత సమయం పడుతుంది, ఇంకొంత ప్రాసెస్ అనేది ఉంది అని చెప్తాడు. ఎక్కడ నాన్నకు చెబితే నాన్న గుండె ఆగిపోతుందొ అని భయంతో తనలోనే బాధను దాచుకుంటాడు రాములు. కానీ తండ్రి రంగారావు రాములు యొక్క ప్రవర్తన లో మార్పును గమనిస్తాడు, ఏదో జరగరానిది జరిగింది అని భావిస్తాడు.


కొన్ని రోజులు గడిచాయి. రంగారావు రాములు యొక్క స్నేహితుల దగ్గర జరిగిన మొత్తం విషయం తెలుసుకుంటాడు. ఎలాగైనా తన కొడుకు కళ్ళలో సంతోషం చూడాలని అనుకోని, ఆ ప్రభుత్వ అధికారిని దగ్గరికి వెళ్ళి, అతని కాళ్ళమీద పడి తన కొడుక్కి ఉద్యోగం ఇప్పించవలసింది గా బ్రతిమిలాడతాడు. కానీ కనికరంలేని ఆ ప్రభుత్వ ఉద్యోగి అతన్ని కాలితో తన్ని పంపిస్తాడు. రెండు లక్షలు లంచం తీసుకుని వస్తేనే ఉద్యోగం ఉంటుంది అని ఖరాఖండిగా చెప్తాడు. రంగయ్య తన కొడుకుకి ఉద్యోగం రావడానికి రెండు లక్షలు లంచం ఇవ్వడానికి సిద్దపడతాడు, దానికోసం తన తోటి రైతులు మిత్రుల దగ్గర వెళ్తాడు, ఎవరు డబ్బులు ఇవ్వకపోగా, అతని నానా మాటలు అంటారు, అవమానిస్తారు, ఆ మాటలకు కృంగి కృశించి పోయిన రంగారావు ఏం చేయాలో తెలియక, తన పొలం గట్టు మీద చెట్టు కింద కూర్చొని
ఆలోచిస్తు చింతిస్తాడు. తనకు ఒక ఆలోచన వచ్చింది.తను చనిపోతే తన ఇన్సూరెన్స్ డబ్బులు రెండు లక్షలు వస్తాయి ఆ డబ్బుతో కొడుకుకి ఉద్యోగం వస్తుందని భావిస్తాడు, మేము ఎలాగో కొద్దిరోజులకు చనిపోయే వాళ్ళం, ఎలాగో మంచిగా బతకలేక పోయాం. తన కొడుకు మాల కాకుండా, భవిష్యత్తులో పిల్లాపాపలతో, సుఖసంతోషాలతో బతకాలని అనుకుని, పక్కనే ఉన్న పురుగుమందుల డబ్బా తీసుకుని తాగి అక్కడె చనిపోతాడు. సాయంత్రమైనా తన తండ్రి రంగారావు ఇంటికి రాకపోవడంతో కొడుకు రాములు తండ్రిని గాలిస్తూ బయటికి వెళ్తాడు, ఊర్లో అందర్ని అడుగుతూ,పొలం పొలిమేరలకు చేరుకుంటాడు. తాటికల్లు నరసయ్య దగ్గర వచ్చి తండ్రిని చూసావా అని అడుగుతాడు. ఆ తాటికల్లు నరసయ్య మీ నాన్నను పొలంగట్టు దగ్గర చూశాను అని చెప్తాడు. వెంటనే కొడుకు రాములు, పొలం గట్టు దగ్గర వెళ్లేసరికి,తండ్రి జీవచ్ఛవంలా పడి ఉండటాన్ని గమనిస్తాడు. వెంటనే తండ్రిని లేపుతాడు, ఎంత పిలిచిన ఉలుకు లేదు పలుకు లేదు, తండ్రి మరణించాడని నిర్ధారించి బోరున విలపిస్తాడు. పక్కనే తన తండ్రి రాసిన ఉత్తరం కనబడుతుంది. ఆ ఉత్తరం మొత్తం చదివి తండ్రి త్యాగానికి కన్నీటి పర్యంతం అవుతాడు. కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి చేసిన ప్రాణత్యాగం అక్కడ ఉన్న వారందరినీ ఏడిపించింది ,
ఊరు మొత్తం కదిలి వచ్చింది అక్కడికి. తన తండ్రికి దహనసంస్కారాలు గావించిన తర్వాత, అక్కడ ఉన్న ప్రజలందరూ ఏకమై ,లంచం అడిగిన ఆ ప్రభుత్వ అధికారిని పట్టుకొని ,నడిరోడ్డులో దేహశుద్ధి చేస్తారు. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి జరిగిన సంఘటన పూర్తిగా తెలుసుకొని, సాక్ష్యాలతో సహా ఆ ప్రభుత్వ ఉద్యోగిని అరెస్టు చేసి ,కోర్టులో హాజరుపరుస్తారు. ఒక గౌరవమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండికుడా అవినీతికి పాల్పడిన ఆ ప్రభుత్వ ఉద్యోగిని, ఉద్యోగం నుండి తొలగించి, ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.కష్టపడి విఆర్వో జాబ్ సంపాదించిన రాములుకు, ప్రభుత్వం దిగివచ్చి ,ఉద్యోగం ఇచ్చి సత్కరించింది. తన తండ్రి మరణానికి సంతాపం తెలియజేస్తూ, ఆర్థిక సహాయంగా ఐదు లక్షలు ఇచ్చి ఆదుకుంది. మరి ఎప్పుడు కూడా, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ,అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు కఠిన చర్యలు, నిబంధనలను జారీ చేస్తూ ఒక చట్టం రూపొందించింది. ప్రభుత్వం సమస్యను గుర్తించి పరిష్కరించినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.మనం ఏదైనా తప్పు పని చేస్తే దానికి తప్పక కర్మ ఫలితం అనుభవించాల్సి ఉంటుంది, అతను మనిషైనా దేవుడైనా, ఇతరులకు మేలు చేయకున్నా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకండి దాని వల్ల మనమే నష్ట పోవాల్సి వస్తుంది.లంచం కోసం ఆశపడిన ప్రభుత్వ ఉద్యోగి జైలులో ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చింది.చిన్నప్పటి నుండే కష్టాలను గమనించి, కష్టపడి చదివి విఆర్వో జాబ్ సంపాదించిన వ్యక్తికి, ప్రభుత్వం అతడికి ఉద్యోగం తో పాటు, ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది.

ప్రస్తుత కాలంలో బయట చాలా మంది యువకులకు, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి కూడా, ప్రభుత్వ అధికారులు చేసే అవినీతి వల్ల, అడిగే లంచాలు ఇవ్వలేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. చాలా మంది యువకులు ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు. రంగారావు లాంటి చాలా మంది తండ్రి హోదాలో ఉండి,కొడుకు భవిష్యత్తు కోసం బాధపడి, చనిపోయిన సంఘటనలు కోకొల్లలు. ఈలాంటి సంఘటనలు ప్రతిరోజు వార్తాపత్రికల్లో చదువుతూనే ఉన్నాం. ప్రభుత్వం ముందుచూపుతో నిరుద్యోగ యువకులను ఆదుకోవాలి, యువతతోనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి.కాబట్టి ప్రభుత్వాలు ఈ అవినీతిని గుర్తించి, పేదలకు అండగా నిలవాలి.

మోర్లే.మురళీ
ఆసిఫాబాద్ జిల్లా,తెలంగాణ
6301476776,8374885700
కలం:-మురళీ గీతం...!!!