Aprasyulu - 4 books and stories free download online pdf in Telugu

అప్రాశ్యులు - 4

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

4

కమల మనస్సు ఎందుకో అశుభం సూచించింది. రజని మనస్సులో చాలా అశాంతి చేల రేగింది. మాటిమాటికి ఆమెకు పీడకల జ్ఞాపకానికి వచ్చింది. ప్రసాద్ రజని కారులోవెళ్తుండగా కారు యాక్సిడెంటు అయినట్లు కలవచ్చింది. కాని ఆమె అది ఎవరికి చెప్పలేదు. వ్యాకులపాటుతో మనస్సు సతమతమవుతున్నా ఆమె బయట కేమి వెల్లడించకుండా లోలోనే అణచుకుంది. అలాంటి పరిస్థితిలో అబలలు గుండెలవిసే కంటతడి పెట్టి బావురుమంటారు. అదే కమల అయితే భయంతో ఆతృతతో చేతనారహిత ఆవును కానీ, రజని నిండుకుండలాంటిది. మనస్సులోని పెనుగాలి మరగు పరచి పైకి మామూలుగానే వుంది రజని.

“నా అనుమానం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయార” ని అని మాత్రం అంది.

“మనల్నందరినీ ఇక్కడ వదలి ఎలా వెళ్తాడు! అయినా దానికి తగిన వాడే బొత్తిగా మేనర్స్ లేవు.” రామం మండిపడుతూ అన్నాడు.

కమల కూడా “ఆహ్వానించి యిక్కడకు తీసుకువచ్చి యిలా అవమానిస్తారని నేనూహించలేదు. ఇప్పుడేం చెయ్యటం” అంది.

రామం, కమలల మాటలు వెళ్ళి రజని హృదయంలో ములుల్లా గుచ్చుకున్నాయి. మెల్లిగా “అదేమి పెద్ద సమస్య కాదు. ఢిల్లీ దగ్గరలోనే వుంది. అనేక బస్సులున్నాయి. రైళ్ళున్నాయి. మనం క్షేమంగానే వున్నాము. దానికోసం ఆతురత పడలసిన అవసరమేమీ లేదు. విపత్తు యేమైనా వాటిల్లితే వారికే వాటిల్లి వుంటుంది. అయినా దానికి మీరేమి కంగారుపడవలసిన అవసరం లేదు. రామం బాబు! మీకొకసారి చెప్పాను. ఈసారి కూడా అదే చెప్పవలసిన అవసరం వచ్చింది. వారికి మీరాశించే మేనర్సు లేకపోవచ్చు, కానీ వారు మనందరి కన్నా శతవిధాల వుత్తములు” అంది.

రామానికి చెళ్ళుమని చెంపపెట్టు పెట్టినట్లయింది. ఇతరుల ఎదుట రజని ఆలా తనని అవమానిస్తుందని అతను వూహించలేదు. కోపంతో “అవును విశ్వాసమనేది కూడా వొకటుందనీ మరచి పోయాను - తప్పునాదే” అన్నాడు.

క్షణకాలం రజని ముఖంలో నెత్తురుచుక్క లేదు. కానీ వెంటనే “అవును బహుశా మీరనేది సత్యం కావచ్చు. ఇన్నాళ్లు వారి వుప్పుతిని వారి పంచను బతికాను. కనీసం యీ మాత్రమే కృతజ్ఞత చూపించవద్దా. విశ్వాసమనేది విచక్షణా జ్ఞానాన్ని మటుమాయం చేస్తుందని నేనొక సారన్నాను. కాని మీ దృష్టిలో యిది సమర్ధనీయమైనదో కాదో, దీనిని గుర్తించరనేగా మీరొకసారి నన్ను నిందించారు? యీనాడు నాలో అది పొడచూపిందని నామీద మీరిలా కోపగిస్తే ఎలా చెప్పండి” అంది.

రామం ముఖం సిగ్గుతో వెల వెల బోయింది. కమల మనస్సు చిన్న బుచ్చుకుంది. కమలాకరం వొక్కడే రజని మనస్సులోని మనోవేదన గ్రహించాడు. ప్రసాద్ కేమైన ప్రమాదం సంభవించిందేమోనని ఆలోచన అతనికి తట్టింది. రజని మనోనిబ్బరం, సరళస్వభావం, నిశ్చలత్వం ఆతనిని ముగ్ధుల్ని చేసాయి. ఆమె మీద వొక విధమైన గౌరవం ఏర్పడింది. రామం పలికిన ములుకులు లాంటి ఆ మాటలకు అతని హృదయం ఎంతో క్షోభించింది. రామం స్వభావం అతనికి తెలుసు. మనస్సు మంచిదయినా ముందు వెనుక చూచుకోకుండా మాట్లాడతాడు. దుడుకుతనం యింకా వదలలేదు.

“తెల్లవారే వరకూ యిక్కడ కూర్చోవటం ఎందుకు? టాక్సీ కట్టించుకుని యిప్పుడే వెళ్ళిపోదాం ఏమైనా ఇంక రెండు గంటలలో తెల్లవార వొస్తుంది” అన్నాడు కమలాకరం.

రజని మనస్సులో మెదలిన ఆలోచన అదే. కమల మొదట అంగీకరించలేదు. వారు వెళ్ళిపోతే మనం “కూడా ఎందుకు వెళ్ళిపోవాలి? మనం యిక్కడికి వచ్చింది హాయిగా యీ వెన్నెల రాత్రి యిక్కడ గడుపుదామని కాని, వారిని వీరిని వెదకటానికి కాదు” అంది. కాని ఈ కమలాకరం పట్టుదల వలన అందరు టాక్సీలో బయలుదేరారు.

రజని వూహించినదే నిజమయింది. ప్రసాద్ కారు. ఢిల్లీ దగ్గరలోనే యాక్సిడెంట్ అయింది. కారు అట్టేపాడవలేదు. ప్రసాద్ కి దెబ్బలు తగిలేయనీ, ఢిల్లీలో హాస్పటల్ లో చేర్చారని అక్కడ వున్న పోలీసువాడు చెప్పాడు. ఆ మాటలు విని రామం, కమల కృంగిపోయారు. రజని ముఖం కేసి చూడలేక ముఖం క్రిందకు దించి వేసుకున్నారు. కమలాకరం క్షణ కాలం రజని ముఖం కేసి చూచి ఆశ్చర్యపోయేడు. భయవిహృదయి అయి బావురుమంటుందేమోనని భయపడ్డాడు. కాని రజని మందహాసం చేస్తూ “కలలు నిజం కావని, అవి కలలుగానే నిలచిపోవాలని నేను అనుకొనేదాన్ని, కాని యీ రాత్రి నాకు వచ్చిన ఆ పాడు కల నిజమైంది. తరువాత ఏం జరుగునో కూడా కలలో కనిపించేది? కాని రామం బాబు అదంతా పాడు చేసి రజని అని గావు కేక వేసారు. లేకపోతే భవిష్యత్తు కూడా చెప్పగలిగి వుండేదానిని” అంది.

కమల అత్యంత వేదనతో “నీలో యింత నిశ్చలత, నిబ్బరం ఎక్కడిది రజని! నేను పలికిన మాటలకి నాకెంతో సిగ్గు వేస్తున్నది” అంది.

“సిగ్గుపడవలసినదేమి లేదిందులో కమలా! ఎవరి జీవితంతో యుద్దాన్ని వారే నడుపుకోవాలి. ఈ సత్యం మరచిపోయే మనమంతా యిలా బాధపడుతూ వుంటాము. మమత అనే మాయలో పడిపోయే మానవులంతా మధనపడుతూ వుంటారు. కాని రామంబాబు దీని కంగీకరించరు. సహజమైన దానిని మనం ఎందుకుసవాలు చెయ్యాలి అంటారు.” అంది రజని.

“ఆప్తులయిన వాళ్ళకు అపాయం సంభవిస్తే మనం ఆతురత పడటం అసహజమంటావా కమలా! నీ మనస్సు ఇప్పుడు క్షోభించటం లేదా?” అంది కమల.

“తోటి జీవులకేమైనా ప్రమాదం సంభవిస్తే దుఃఖిస్తారు .ఆప్తులయితే యింకా కొంచెం అధికంగా వుండదని నేననను . కాని ఏ వ్యక్తి లోటు భర్తీ కాకుండా నిలిచిపోదు కమలా?” అంది.

టాక్సీ జోరుగా వెళ్ళిపోతోంది. రజని మాటలు కమలాకరం చెవిలో మెల్లిగా మారుమోగేయి ఎందుకో అతని హృదయం బరువెక్కిపోయింది. కమలకేసి చూస్తూ “జీవితమంటే ఏవ్వక్తీ ఒంటరిగా గడపలేడు. రజని! మానవ సాంగత్యం లేకుండా ఎవరినైనా పూర్తిగా వేరు చేస్తే వారు జీవించవచ్చు. కాని వారు మానసికంగా మానవులు కారు. మీరు ఏవ్వక్తి లోటూ భర్తీ కాకుండా నిలచిపోదన్నారు. అది నిజమో కాదో నాకు తెలియదు. కాని ప్రేమ లేని జీవితంలోని లోటు భర్తీ కాకుండానే నిలిచిపోతుంది. వ్యక్తి అసంతృపితోనే మరణిస్తాడు. ఇదిమటుకు సత్యం రజని-కాని నువ్వు దీనిని కూడా ధిక్కరిస్తావేమోనని భయంగావుంది” అన్నాడు.

కమలాకరం మాటలు అందరినీ కాస్త వ్యాకులపరచినాయి, రజని క్షణకాలం నిశ్శబ్దంగా వుంది. తల పైకెత్తి శూన్యంలోకి చూస్తూ “అనురాగానికి హృదయం తహతహలాడాలనుట అసహజమని నేననను. సృష్టి నశించిపోకుండా వుండటానికి ప్రకృతి చేసిన యేర్పాటేయిది. మానవనిర్మితమైనదేమైనా, స్త్రీ పురుషులకు మధ్యనున్న ఆకర్షణ ఆహ్లాదకరంగా వుండే, మానవుడు దీనిని వదలి వేస్తాడు. దానితో సృష్టి స్తంభించిపోతుంది. అలాంటి ప్రమాదం ఎన్నడూ జరుగకుండా వుండటానికి జరిగినదే ఇది” అంది.

కారు ఢిల్లీ చేరుకునేసరికి తెల్లవారింది. అందరు తిన్నగా ఇర్విన్ హాస్పిటలు వద్దకు వెళ్ళారు.

కారు దిగుతున్న సమయంలో కమల “అందరు లోమలికి వెళ్ళవలసిన అవసరం ఏముంది! నేను కారులోనే వుంటాను, మీరు వెళ్ళిరండి” అంది కమల మాటలు కమలాకరానికి “కోపం తెప్పించాయి.“వ్యర్ధమైన “కోపాలకు యిప్పుడు తావు యివ్వకు కమలా? ప్రసాద్ ప్రమాదంలోపడి బాధపడుతూ వుంటే ఈవిధంగా ప్రవర్తించటం మూర్ఖత్వమే కాని మర్యాద కాదు” అన్నాడు.

కాని కమల లోనికి రాలేదు. మిగతా ముగ్గురు లోనికి వెళ్ళారు. అదృష్టవశాత్తు గట్టి దెబ్బలు తగలలేదు. తలకు మాత్రం గట్టిగాయం తగిలింది చెయ్యికి బాండేజీ కట్టివుంది. దాని ఫలితంగానే ప్రసాద్ భరించరాని తలపోటుతో బాధ పడుతున్నాడు. వీరందరినీ చూసి బలవంతాన బాధను నొక్కి వేసి చిరునవ్వుతో “హాస్పటల్ లో కొన్నాళ్ళు గడపాలనే కోరిక నేడు నెరవేరుతోంది. నీకు జ్ఞాపకముందా రజని! నేనొక సారి యీ కోరిక వెలిబుచ్చితే నువ్వన్నావు “ఆ దుర్ఘటన జరిగిన రోజుననేను నీ చెంతను వుండకూడదనే నా కోరిక” అని నాకు శుశ్రూష చేస్తే భారం నీపై పడుతుందని “అది నీకిప్పుడు ఎలాగైనా తప్పదు” అని రజని సమాధానం చెప్పేలోపలే ప్రసాద్ “కమల ఏదీ? రాలేదా!” అన్నాడు.

“బయట కారులో వుంది. హాస్పటల్ లో రోగులను చూడలేదట” అన్నాడు కమలాకరం.

ప్రసాద్ ఆ మాటల అర్థం సులభంగానే గ్రహించాడు, కమల తన యెడల ప్రదర్శిస్తున్న ఆ అసహ్యతకి అతని హృదయంలో బడబాగ్ని రేగింది. చివాలున లేచి “కమల ఇక్కడకు రాకపోతే నేనే అక్కడకు వెళ్తా” నన్నాడు.

కదలికకు, తలపోటు అధికమైంది. అయినా అతను లెక్క పెట్టలేదు. ఎవరు వారించినా వినలేదు. కమలాకరం భుజంపై ఒక చెయ్యి, రామం భుజం పై యింకొక చెయ్యి వేసి బయటకు వచ్చాడు. కారులోకివచ్చి బాధ భరించలేక కన్నీరు కార్చచొచ్చాడు. ఆ దృశ్యం చూచేసరికి కమల హృదయంలో చెయ్యి పెట్టి కలచినట్లయింది. జాలి, కరుణ వుప్పెనలా పొంగి ఆమెని ముంచి వేసాయి.

“ఈ కన్నీరు శారీరకమైన బాధను భరించలేక కారుస్తున్న కన్నీరు మాత్రమే కమలా? ఉద్రేకాలకు, ఆవేశాలకు లోనైనది కాదు” అన్నాడు బాధతో మూలుగుతూ.

“కమల సమాధానమేమి చెప్పలేదు. ఆ మాటల అర్ధం రజని మాత్రమే గ్రహించింది. తాజ్ మహల్ వద్ద వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనని చూచాయగా వూహించుకోగలిగింది.

“ఇందులో నువ్వు సంజాయిషీ యిచ్చుకోవలసిన అవసరమేమి లేదు ప్రసాద్. అయినా యిది తగిన సమయము కాదు” అంది. కమలాకరానికి ఈ అప్రస్తుత సంభాషణనచ్చలేదు. రోగి వద్ద మాట్లాడవలసిన మాటలు కావని, “ఇక నువ్వు లోపలికి వెళ్ళాలి ప్రసాద్. బయటవుండడం మంచిది కాదు.” అన్నాడు.

ప్రసాద్ ని లోనికి తీసుకు వెళ్ళారు. అప్పుడయినా కమల లోనికెళ్ళలేదు.

ప్రసాద్ ని వదలివస్తూ కమలాకరం “నీ కేమైన సహాయం చెయ్యవలసివస్తే కబురు చెయ్యి ప్రసాద్, సంతోషంతో మేము చేస్తాము. కాని రజని వుండగా నీకు యితరుల సహాయం అనవసరము” అన్నాడు.

రామం కమలాకరం బయటకు వెళ్ళబోతుంటే రజని “రామం బాబూ! మీరు కాస్త నాకోసం వేచివుండకూడదా? కొంచెం సేపు వుండి నన్ను యింటివద్ద విడిచి మీరు వెళ్ళవచ్చును” అంది.

రామం వెనక వుండిపోయాడు. తనకు తోడుకోసం వుండమనలేదని అతడు గ్రహించాడు. తాజ్ మహల్ వద్ద రజనిని అన్న మాటలకి అతను అభిమానంతోటి, అసహ్యం తోటి లోలోన కుమిలిపోతున్నాడు. ఆ క్షణంనుంచి యిప్పటివరకు ఎవరితోను అతను నొక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ విషయం రజని మాత్రమే గుర్తించింది.

అరగంట పోయింతర్వాత రజని, రామం హాస్పటల్ నుంచి బయటకు వచ్చారు. రామం యింకా వొక్క మాట కూడా మాట్లాడలేదు. టాక్సీలో కూర్చుని రజని “నాతో మాట్లాడకూడదని మీరేమైనా ప్రతిజ్ఞ పట్టారా చెప్పండి" అన్నది.

రామం “ఏ మొహం పెట్టుకొని మాట్లాడను రజని?” అన్నాడు. రజని రామంముఖం తనవైపు తిప్పుకొని నవ్వుతూ “తీర్చిదిద్దిన యీ ముఖానికి వచ్చిన లోటేమిటి?మీరు చెబితే వినాలని కుతూహలంగా వుంది. శ్యామ వర్ణం, సుందర వదనం, వుంగరాల జుట్టు” అంది. కోపంవచ్చినా ఏం చెయ్యగలను చెప్పండి? ముల్లు వెళ్ళి ఆకుమీదపడినా, ఆకు ముల్లు మీదపడినా ఆకుకేకదా నష్టం! అవమానాల్ని, నిందల్ని, అపవాదుల్ని భరించటం నాకు చిన్నతనం నుంచి అలవాటే . అందరూ నన్ను మా నాన్నగారి పేరూ, మా అమ్మగారి పేరూ అడిగి నన్ను ఎగతాళి చేసి చీదరించుకొనేవారు. చిన్నతనంలో చాలా బాధపడేదానిని. యవ్వనం వచ్చిన తర్వాత నా అందమే నన్ను కాపాడుతూ వచ్చింది. దీని మాయలో పడి అంతానా గతచరిత్ర మరిచిపోయేవారు. కాని కొంతమంది నిరాశ చెంది నిరాయుధయైన నా పై బ్రహ్మాస్త్రం ప్రయోగించి పారిపోయేవారు. కాని ఇదంతా అలవాటయిపోయింది” అంది.

రజని మాటలు రామం హృదయంలోకి వాడి సూదులులాగ గుచ్చుకున్నాయి. భరించరాని భారంతో, దుఃఖభరితమైన కంఠ స్వరంతో “నేనూ అలాటివాడినే అనుకున్నావా? రజని” అన్నాడు.

రజిని నవ్వుతూ “అలాంటివారు కారని చెప్పటానికి ఋజువేమిటి చెప్పండి" అంది.

“పరిహాసంకాదు రజనీ, నా హృదయంలోని ఈ వేదనని అర్థం చేసుకోలేకపోతున్నావు” అన్నాడు రామం.

రజని ఈసారి “కాదు, మీరలాంటివారు కారని నాకు తెలుసు. బహుశా మీకంటే నాకే ఎక్కువగా తెలుసనుకుంటాను కాని ఏమిలాభం? అయినా అలాంటి మాటలు బాధ పెడుతూనే వుంటాయి. దిగమ్రింగి దరహాసవదనాన్ని దివ్యంగా చూపిస్తూ వుంటాను”.

అనురాగంతో పొంగిపొర్లే హృదయపు భారాన్ని భరించలేక రామం ”నామీద నీ కెందుకింతటి అభిమానమూ, ఆదరమూనూ చెప్పు రజని” అన్నాడు.

రజని రెండు మూడు నిమిషాల వరకు మాట్లాడలేదు. ఆ తరువాత నెమ్మదిగా “నిజంగా మీ ప్రశ్నకు సమాధానం చెప్పమంటారా!” అంది.

“చెప్పు రజనీ” అన్నాడు.

“నేను యింతకుముందే చెప్పానుకదా, ఈ విషయంలో బుద్ధి విచక్షణకు తావు లేదని. అలాంటప్పుడు మీరు కారణమడిగితే ఎలా చెప్పటం” అంది.

“నేను నిన్ను ప్రేమించానని చెప్పితే నువ్వు నవ్వుతావని నాకు తెలుసు రజని, కాని నేను చెప్పబోయేది నువ్వేప్పుడూ మనస్సులోవుంచుకోవాలి. రామం జీవితంలో నువ్వు ప్రవేశించావు, శుభం కోసమో అశుభంకోసమో నేను చెప్పలేను. నా జీవితంలో నువ్వు నెరవేర్చవలసిన పాత్ర వొకటి ఎప్పుడూ వుంటుంది. కొన్ని బాధ్యతలు నీకు సంక్రమించాయి. వాటిని నువ్వు సక్రమంగా నెరవేరుస్తానని మాటియ్యి. లేకపోతే దారం తెగిన గాలిపటంలా నేనెక్కడో పడతానో, నేనేమైపోతానో నాకే తెలియదు. అలా జరిగితే నువ్వు నష్టపోతావని నేను చెప్పటం లేదు. అయినా నువ్వు సులభంగా త్రోసిపుచ్చవని నాకు తెలుసు” అన్నాడు.

టాక్సీవచ్చి రజని యింటిముందు ఆగింది. రజని టాక్సీలోంచి దిగి “మీరు మీ లాడ్జికి వెళ్ళి టాక్సీ పంపించి వెయ్యండి” అంది. రామం కూడ టాక్సీలోంచి క్రిందకు దిగి “అప్పుడే లాడ్జికి వెళ్ళాలని లేదు రజని, నీతో యింకాసేపు కలసివుండాలని కోరికగా వుంది. ఇవాళ ఎలాగో సెలవు పెట్టాను. అది వృధా చెయ్యటం ఇష్టం లేదు” అన్నాడు.

“అయితే సరే రండి. మీ వుద్దేశం చాలా సదుద్దేశమే, కాని నేనింకొక రెండుగంటలలో తిరిగి హాస్పటల్ కి వెళ్ళాలి. అంతవరకు మీరు నా వెంట వుండటానికి నాకేమి అభ్యంతరం లేదు” అంది రజని.

“ఆ తరువాత వెళ్ళిపోమంటావా రజనీ,” అన్నాడు.

“ముందర లోపలికి పదండి, వంట ప్రయత్నం చెయ్యాలి. మీరుకూడా ఇప్పటికి యిక్కడే భోజనం. నా చేతి వంట తినందే నేను వదిలిపెట్టను” అంది.

మొదట్లో రామం చాలా సంకోచించాడు. ఆది ప్రసాద్ గృహం. కాని రజనిది కాదనే భావం మాటి మాటికి జ్ఞప్తికివచ్చింది. రజని అదే తన స్వంతయిల్లు లాగే భావించటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. కాని అలాంటివి అడిగితే ప్రమాదం. రజని సమాధానం ఎలాగుంటుందో వూహించటం కూడా కష్టం. అందుకు మెదలకుండా వూరుకొన్నాడు.

డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని కాఫీ తాగుతూ రామం “వంట నువ్వే చేస్తావా? వంటవాడు లేడా!” అన్నాడు.

“వున్నాడు, కాని ప్రసాద్ కీ పరిస్థితిలో కావలసినవి సరిగా చెయ్యలేడు నేనే చేస్తాను” అంది.

రజనికి ప్రసాద్ పై వున్న శ్రద్ధాభక్తులు, గౌరవాభిమానాలు రామానికప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూనే వున్నాయి. వారిద్దరిమద్యవున్న సరియైన సంబంధమేమిటో అని పలువిధాల ఆలోచించేవాడు. ప్రసాద్ లోని లోపాలు, స్వేచ్చావిహారం తెలిసివుండి కూడ ఆమెలో చెక్కుచెదరని ఆ సహనం, నిశ్చలత అతని కెంతో దిగ్భ్రాంతి కలిగించింది. మనస్సులో వొక మూల వొకవిధమైన యీర్ష్యకూడ పొడసూపింది. ఆలోచనలోపడి అంతా మరచిపోయి మంత్రముగ్దుడిలా అలాగే వుండిపోయాడు, రజని నవ్వుతూ “ఏమిటంతదీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఈమెలోని యీ శ్రద్ధాభక్తులు అనురాగ చిహ్నాలా? లేక విశ్వాసపు చిహ్నాలా అని కదూ!” అంది.

రామం విస్మయంతో “నీకు పరకాయ ప్రవేశంకూడ చేతనవునా? రజనీ" అన్నాడు.

“దీనికి పరకాయ ప్రవేశం అక్కరలేదు. కాస్త పరీక్షించి మీ ముఖకవళికలు చూస్తేనే తెలుస్తూ వుంది. విస్మయమూ, ఈర్య వుట్టిపడుతున్నాయి” అంది.

రామం మాటలు తప్పించుదామని హఠాత్తుగా “అది సరేలే రజని! కాశిలో మా మామయ్య వొక్కరే వున్నారా? భార్యాపిల్లలెవరూ లేరా? అన్నాడు.

“మామయ్య ఉన్నారు. విశాల ఎవరితోనూ చెప్పకుండా రెండు నెలలకే గతించిపోయింది. మామామయ్య కూతురు నాకంటె రెండు సంవత్సరాలు చిన్నది.దురదృష్టవంతురాలు మూడు సంవత్సరాల క్రితం వివాహమయింది.పేపర్లో ప్రకటన చూసి మామయ్య మురిసిపోయి, విశాలనిచ్చి అతగాడికి పెళ్ళి చేసేడు. బొంబాయిలో పెద్ద వుద్యోగం. పెళ్ళి రేపనగా మామయ్య కొక జాబు వచ్చింది. పేరూ వూరూ లేని ఆకాశరామన్న ఉత్తరం అది. అందులో ప్రకాశరావు మంచివాడు కాడనీ, ఒక స్త్రీని వుంచుకొన్నాడనీ, త్రాగుబోతనీ, విశాలని ఈలాంటి వాడికి యివ్వటం మంచిది కాదనీ యింకా యెన్నో వ్రాసివున్నాయి. అది చూసి మామయ్య ఆవేదనకి అంతులేదు, ఆ ఉత్తరాన్ని విశ్వసించటమా లేక అయిష్టులు కల్పించిన అభూతకల్పనా! పెళ్ళి ఆపు చేసే తలవంపులు కాదా! ఇక తర్వాత వివాహం కావటం కష్టం. అయినా చివరకు మామయ్య వివాహం ఆపుచేద్దామనుకున్నాడు. కాని విశాల వొప్పుకోలేదు. ఇంత జరిగింతర్వాత ఆగిపోతే మామయ్య హృదయానికి గట్టి గాయం తగులుతుందని గ్రహించింది. అలాంటి ఉత్తరాలు నిజం గావని, నిజమే అయితే అది తన దురదృష్టమేననీ దాని బాధ్యత పూర్తిగా తనదేనని, తన నొసటన వ్రాసిన వ్రాత జరగక తప్పదనీ బలవంతం చేసి వివాహం చేసుకొంది. వివాహానికి ముందర నాకు ఉత్తరం రాస్తూ. “రజని! రాత్రింబవళ్లు నేను దీన్ని గురించే ఆలోచించాను. ఆయన ఫోటో దగ్గర పెట్టుకొని తదేకంగా చూచాను. వాటిలోతును కనుక్కుందామని, వ్యక్తి స్వభావం తెలుసుకుందామని ప్రయత్నించాను. నాకు వాటిల్లో కుత్సితం, క్రూరత్వం కనిపించలేదు మంచో చెడో నేను నిశ్చయానికి వచ్చాను. ఆయన్నే చేసుకుంటాను. ఆ తరువాత జరిగేదేదో జరుగుతుంది. నేనెప్పుడూ ఎవ్వరికీ “అన్యాయం చెయ్యలేదు రజని. నాకు యితరులు చేస్తారని భయంకూడా లేదు. నాకు తోటి మానవులలో విశ్వాసముంది. నమ్మినవానివి నట్టేటముంచరనే నా నమ్మకం, విశ్వాసంతోటే ఆయన్ను వివాహం చేసుకుంటాను” అని వ్రాసింది.

నా సలహా అడగకపోయినా నేను అలాంటి పని చేయవద్దని వ్రాసేను. కాని నామాట వినలేదు. విశాల ఎవరి మాట వినగా నేను ఎప్పుడూ చూడలేదు. పట్టుమని పది నెలలయినా “కాపురం చెయ్యలేదు. పది నెలలలోనూ ఆమె ఎలాంటి నరకం అనుభవించిందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఒక్క ఉత్తరంకూడా వ్రాయలేదు. బక్కచిక్కి కళ్ళల్లో ప్రాణం పెట్టుకోని ఒక రోజున హఠాత్తుగా “మామయ్య” ఇంటికి వచ్చి తలుపు తట్టింది. 'నాన్నా' ఒక్క కేకేసి స్పృహ తప్పి పడిపోయింది, ఏంజరిగిందో ఆమె యింతవరకూ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు, “వారు నన్ను తిరిగి రావద్దన్నారు, వారి వద్దకు నేను వెళ్ళను” అనిమాత్రం అంది. ఇప్పటికి రెండు సంవత్సరాలయింది. విశాలమామయ్య యింటిదగ్గరే వుంటోంది. ఆ తరువాత అతగాడు మారు పెళ్ళి చేసుకున్నాడని వినికిడి.

విశాలగాథ రామాన్ని పూర్తిగా కదలించి వేసింది. “మానవులు ఇంత అమానుషంగా ఎలా మారిపోతారు రజని!” అన్నాడు.

విశాలగాథ జ్ఞప్తికి వచ్చి రజని మనస్సుకూడా బాధపడింది. మెల్లగా “అమానుషంగా అంటేనే నొప్పుకోను రామం బాబూ! మానవులే యిలాంటి పనులు చేస్తారు, జంతువులలో క్రూరత్వం, కుత్సితం వుండవు. విశాల మానవుని మంచితనం మీద భారం పెట్టి మెడలో మంగళసూత్రం కట్టించుకొంది. నమ్మిన వాళ్ళని నట్టేట ముంచటం అతగాడికి చేతకాదనుకొంది. కాని చివరకు ఏమయింది!” అంది.

రామం మనస్సులో విశాలని చూడాలనీ, కలుసుకొని మాట్లాడాలని తీవ్రమైన కోరికగలిగింది. “రజని! విశాలని కలుసుకోవాలని నాకు కోరికగా వుంది. అది వీలుపడుతుందా?” అన్నాడు.

“ఎందుకు వీలుపడదు? కాశీకి వెళదాం రండి. నన్ను చాలాకాలంపట్టి రమ్మనమని విశాల వుత్తరాలు వ్రాస్తోంది. పదిరోజులు సెలవు పెట్టండి. ఇద్దరం వెళ్ళివద్దాము” అంది రజని.

“అలాగే చేద్దాము రజని, అంతవరకూ నాకు అసంతృప్తిలాగ వుంటుంది” అన్నాడు.

రజని లేచినిలబడి “ఇక నేను వెళ్ళి వంట ప్రయత్నం చెయ్యాలి. మీరిక్కడే కూర్చుంటారా? లేక మీలాడ్జికి వెళ్ళివస్తారా?” అంది.

“ఉహుఁ! లాడ్జికి వెళ్ళను. ఈరోజు నిన్ను విడిచి వెళ్ళ బుద్దివెయ్యటం లేదు “వంటింటిలోనే కూర్చుంటాను కాస్త సహాయం చేస్తాను” అన్నాడు రామం

“సహాయం చెయ్యక్కర లేదు. పాడు చెయ్యకుండా వుంటే పది వేలు” అంది నవ్వుతూ.

రజని వంట చేస్తున్నంత సేపూ రామం ఆమెను కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాడు. అనేక విధమైన ఆలోచనలు మనస్సులో మెదిలాయి. రజని ఎవరు? ఆమెకూ తనకూ సంబంధ మేమిటి? మొన్న మొన్నటివరకూ ఆమె తన జీవితంలో లేనే లేదు. ఇంత స్వల్ప కాలంలో యింత చనువు ఎలా ఏర్పడింది? ఇప్పుడు ఆమెను చూడాలనే ఈ దాహం పూర్తిగా లోలోన దహించి వేస్తోంది. ఇది మంచిదేనా? ఇది ధర్మమేనా? ప్రసాద్ కి నేనేమైన ద్రోహం తల పెట్టుతున్నానా? నేను మిత్ర ద్రోహినా? ఈ ఆలోచనల్లో పడిపోయి తనకు తానే మరచిపోయాడు. వేడిగా చుర్రుమని ఏదో చేతికి తగిలేటప్పటికి వులిక్కిపడి వూహా ప్రపంచంలో నుండి బయటపడ్డాడు. “ఏమిటిది రజనీ” అన్నాడు చెయ్యి మండుతూవుంటే.

“అట్లకాడ కొంచెం కాల్చి వాత పెట్టాను, మళ్ళీ ఎప్పుడూ వెర్రి ఆలోచనల్లో పడిపోకుండా! వళ్ళు మరచిపోకండి' అంది నవ్వుతూ.

చెయ్యిని తీరికగా చూచుకుంటూ “ఏ వెర్రి ఆలోచనలు రజని?” అన్నాడు.

“నాకు తెలుసును, మీ ముఖాన్ని బట్టి, మీ ఆలోచనల్ని వూహించటం కష్టం కాదు. అని చెప్పాను. సరిగా ఏమిటో నేను చెప్పలేను. కాని అవి నాగురించే మాత్రం అని నేను చెప్పగలను” అంది. “అది నువ్వు చెప్పనక్కర లేదు రజనీ, అది నాకూ తెలుసును” అన్నాడు.

ఆమాటలు విని రజని నవ్వాపుకోలేక పోయింది. సరిగ్గా అదేసమయానికి సగ్గుబియ్యం పరమాన్నం చేస్తోంది. గరిట పెట్టి కలుపుతూ అంతా తిరగతోసింది. అంతా క్రిందపడి కొంత కుడికాలిమీద పడింది. బాధతో గట్టిగా అరచింది రజని. అదృష్టవశాత్తు పాలుఅంత వేడిగా లేవు. అయినా మృదువైన చర్మం కాబట్టి బాగా పొంగింది. అది చూసి రామం కంగారుకి అంతు లేదు. “అయ్యో ! ఎంతపని జరిగింది అంది రజని? అంతా నాతప్పే, నా తప్పే” అని దుఃఖపడడం ప్రారంభించాడు.

రజని బాధతో కూడిన కంఠస్వరంతో “ముందర మా యింటి ప్రక్కవున్న డాక్టరుగారిని తీసుకొనిరండి. తరువాత తప్పెవరిదో పరిశీలిద్దాము” అంది.

డాక్టరువచ్చి చూచి కట్టుకట్టి “ప్రమాదమేమీ లేదు. నాలుగయిదురోజులలో తగ్గిపోతుంది. అదృష్టవంతులు” అన్నాడు.

డాక్టరుగారు వెళ్ళిపోయిన తర్వాత రజని మళ్ళి వంటింటిలోకి కుంటుకుంటూ వెళ్ళటం రామంచూచి “వద్దు రజనీ. నువ్వు ఈ పరిస్థితిలో వంట చెయ్యకూడదు. వంటవాడు చేస్తాడు'' అన్నాడు.

“నా పరిస్థితి యిప్పుడు మీ పరిస్థితికన్నా బాగానేవుంది రామం బాబూ! మీరనవసరంగా కంగారుపడకండి” అంది రజనీ,

ఆమె యిక చెప్పినమాట వినదని రామం మాట్లాడలేదు. జరిగిన ఈ దుర్ఘటనకుఅతనిమనస్సు ఎంతో దుఃఖంచింది. ఇక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళే సాహసం లేక బయట కూర్చుని బాధపడసాగాడు. అది గ్రహించి వంటగదిలోంచి “ఒక్కరూ ఏం చేస్తున్నారక్కడ? ఇక్కడకు రండి” అంది రజని!

రామం నెమ్మదిగా లోపలికి వెళ్ళి మెదలకుండా ఒక మూలకూర్చున్నాడు. తప్పు చేసిన పిల్లవాడిలా మౌనంవహించాడు. ఆమె కాలికేసి వేదనతో చూస్తూ “ఇదంతా నా దోషమే అమ్మా! మాటలతోనో, చేష్టలతోనో నేను మొదట నుంచీ బాధపెడుతూనే వున్నాను” అన్నాడు.

ఆమె నవ్వుతూ “వీటన్నింటికీ ఏదో ఒక రోజున పగ తీర్చుకోకుండా వుండను. మీరేమి అనుమాన పడకండి. ఆడవారి పగ తాచుపాము పగ కంటే భయంకరమైనదని మీకింకా తెలియదు” అంది.

‘‘పగ దేనిమీద తీర్చుంటావు రజని! తుచ్ఛమైన ఈ ప్రాణం ఒకటే వుంది” అన్నాడు రామం.

ఆమె నవ్వుతూ “బాబోయి , అది తుచ్ఛమైనదంటేనేను ఒప్పుకోను. మీలాంటి సత్పురుషుల ప్రాణాలు అతి పవిత్రమైనవి” అంది.

రామానికి ఆమెమాటలు కోపం తెప్పించాయి. “అంతా నీ కెప్పుడూ పరిహాసమే రజనీ! నీతో ఏదైనా సీరియస్ గా మాట్లాడడానికి వీలు లేదు'' అన్నాడు.

“పరిహాసం కాకపోతే ఇంకేమిటి చెప్పండి ఈ అసందర్భపు మాటలు, ఏదో ప్రమాదం సంభవించింది. దానికి ఇంత రసాభాస ఎందుకు?” అంది ఆమె.

“కట్టుకట్టివున్ననీ కాలిని చూస్తూంటే నా హృదయంలో కాగడా పెట్టి కలచినట్లవుతోంది అమ్మా” అన్నాడు.

రామం మాటలకన్న అతని కంఠస్వరంలోని ఆవేదన ఆమెను క్షణకాలం కలవర పెట్టింది. కలవరపాటును కట్టి పెట్టి కోమల కంఠ స్వరంతో “ఇది చాలా చిన్న విషయం రామం బాబూ! త్వరలోనేగాయం మాసిపోతుంది, శరీరానికి తటస్థించే ప్రమాదాలన్నీ చిరకాలం వుండవు. కాని హృదయానికి సంభవిస్తే అది జీవిని కబళించి వేయగల శక్తి వుంటుంది. ఆ ప్రమాదాన్నుంచే మీరు ఎప్పుడూ మిమ్మల్ని రక్షించుకోవాలి” అంది.

“కాని అది ఎలా రజని! మార్గంకూడా చూపించు” అన్నాడు.

“ఒక వ్యక్తికి అనుకూలమైన మార్గం యింకొకరికి కాకపోవచ్చు. ఎవరికి వారే వెదకి వేసారి చివరకు గమ్యస్థానం చేరుకోవాలి. ఇందులోను నిజంగా నిస్సహాయురాలిని, నా సహాయం మీకేమీ లభించదు” అంది.

ఆమె మాటలలోని సారం గ్రహించాడు. వాటిల్లోని కాఠిన్యత, తిరుగు లేనినిశ్చయం అతన్ని చాలా బాధించాయి, తనను జాగ్రత్తపడమని ముందరే హెచ్చరించిందనుకున్నాడు.

రజని వంట ప్రయత్నం పూర్తి చేసేసరికి తలనొప్పి కూడా ప్రారంభమయింది తిన్నగా తన గదిలోనికి వెళ్ళిపోయింది. రామానికి ఏమి చెయ్యాలో తోచక డ్రాయింగు రూములో కెళ్ళి కూర్చున్నాడు. అతనికి కొంచెం కోపంకూడ వచ్చింది. అతిధిని మర్యాద చెయ్యటంకూడ తెలియదు. నన్ను చులకన చేస్తోంది అనుకున్నాడు. బయటకు వెళ్ళిపోదామనుకున్నాడు. కాని కాళ్లు కదలలేదు. కొంత సేపటికి వంటవాడు వచ్చి “బాబూ! భోజనం తయారుగా వుంది. అమ్మగారు రమ్మనమంటున్నారు” అన్నాడు.

వంటవాడి చేత కబురు పంపించటం వల్ల రజనిమీద వున్న కోపం హెచ్చింది. కాని చేసేదేమీ లేక లోపలికి వెళ్ళాడు. రజని వొక కంచంనిండా భోజన పదార్థాలన్నీ పెట్టి వుంచింది. తన ముందర నొక చిన్న కంచంలో చాల అల్పంగా పదార్థాలు పెట్టుకుంది.

లోపలికి వెళ్ళిన వెంటనే “రండి! కూర్చోండి. నేను వంట చేశాను. కనుక నయినా కడుపు నిండా భోజనం అయినా చెయ్యండి” అంది.

రజనిమీద లోలోన రగులుతున్న కోపం ఈ మాటలతో విజృంభించింది. “కడుపునిండా భోజనం లేక నేనిక్కడకు వచ్చానా రజని? నేనసలు భోజనమే చేయను” అని కోపంతో కంచం ముందరకు తోసివేశాడు. క్షణకాలం రజనీముఖం వెలవెల బోయింది, కాని నెమ్మదిగా “మీరు భోజనం చెయ్యనంతమాత్రాన నాకేమైనా నష్టం కలుగుతుందనుకోవడం చాలా అవివేకం రామం బాబూ! మీరు యిలా అకారణంగా, అసభ్యంగా అలిగినంతమాత్రాన నేను మిమ్మల్ని బుజ్జగించి, బ్రతిమలాడి అన్నం తినిపిస్తాననుకోవడం చాలా హాస్యాస్పదమైన విషయం. ఇక చివరకు మిగిలేది నేను కొంచెం బాధపడటమే! అది మీరు మొదటి నుంచీ చేస్తూనే వున్నారు. ఇందులో కొత్త ఏమి లేదు” అంది.

శాంత గంభీరస్వరంతో పలికిన ఆ వాక్యాలు రామంలోని అహాన్ని సమూలంగా పెరికి వేసాయి. చింతాక్రాంత వదనంతో, వేదనాపూరిత స్వరంతో ఈరోజు ఎందుకో నా మనస్సులో నీమీద కోపంగా వుంది రజని. కారణం ఎంత వెదికినా కనబడ్డం లేదు. కాని ఒక విషయం మటుకు నీకు నేను చెప్పకుండ వుండలేను. ఈ యిల్లే నీ స్వగృహంగా నువ్వు భావించటం నేనెందుకో భరించలేకుండా వున్నాను” అన్నాడు.

రజని మందహాసం చేస్తూ స్త్రీలకు స్వగృహం లేనప్పుడు పరుల గృహాలనే స్వగృహాలుగా భావించుకోవాలి రామం బాబూ! ఇది మొదట్లోనే కాస్త నొప్పి కలిగిస్తుంది. తరువాత మాకిది అలవాటై పోతుంది. వివాహమయిన క్రొత్తలో స్త్రీలు భర్త యింటిలో పరులయింటిలో సంచరించినట్లు సంచరిస్తారు. పుట్టింటికోసం బెంగ పెట్టుకొని బాధపడతారు. కాని కొద్దికాలంలోనే పరిస్థితి పూర్తిగా మరిచిపోతుంది. పుట్టిల్లే పరాయి యిల్లయిపోతుంది. అక్కడ చాలా కాలం వుంటే ఆత్మగౌరవానికి ప్రమాదం సంభవించినట్లు భావిస్తారు.సంఘం కూడా వారిని చులకనగా చూస్తుంది” అంది.

రజని చెప్పిన ఆ ఉదాహరణ రామానికి నచ్చలేదు. “ప్రపంచంలో నీకు ఆత్మీయులు లేరంటే నే వొప్పుకోను, వాటి నన్నిటిని మీంచి యిది ఎందుకుప్రేమపాత్రమైంది” అన్నాడు.

“మీకు నేను మొదటే చెప్పాను. స్వగృహం లేనప్పుడు అద్దె ఇచ్చి మనం ఒక యింటిలో చేరుతాము. ఇంటిలో చేరే ముందు అనేక విషయాలు ఆలోచిస్తాము. ఈ యింటిలోకి ఎందుకు చేరాము, యిది ఎందుకుప్రేమ పాత్రమైంది యని అడిగితే మనం చెప్పడం కష్టం, అద్దె ఎక్కువ చేసినా ఆద్దె యిచ్చుకోలేక పోయినా, యివ్వడం యిష్టం లేక పోయినా యింటి వారు బయటకు వెళ్ళిపొమ్మన్నా యిల్లు వదలి పెట్టక తప్పదు. తరువాత వచ్చిన యింకొక యిల్లు దొరికితే సరేసరి లేకపోతే ఏ చెట్టునీడనో, ఏ రైల్వే ప్లాటుఫారంమీదనో తల దాచుకోక తప్పదు” అంది.

రజని మాటలు మళ్ళీ రామం కోపం రెచ్చగొట్టాయి. “నువ్వు ఆద్దె ఎంత యిస్తున్నావు రజని” అని అడిగాడు.

ప్రశ్న విని రజని క్షణకాలం స్తంభించిపోయింది, కమలని ఆ ప్రశ్న ఎవరయినా అడిగినట్లయిన క్రోధంతో మండిపడి చెంపదెబ్బ పెట్టి “మూర్ఖుడా సభ్యత, అసభ్యత తెలియని నీవంటి మొరటువానితో మాట్లాడమే భరించలేని అవమానం” అనేది. రజని కూడ సిగ్గుతో లోలోపల సిగ్గుతో దహించుకుపోయింది. ఆత్మనిగ్రహమనేది వుగ్గుపాలతో అలవడిన విద్య ఆమెకి. బలవంతాన మందహాసం చేస్తూ “ఈ రోజు నామీద మీకు నిజంగా కోపంగా వుంది, నేను చేసిన అపరాధ మేమిటో తెలియదు. అయినా ఈ ప్రశ్న మీలాంటి వారు వేయవలసినది కాదు. రామం బాబూ! సమాధానం చెప్పగలను, కాని వింటే బాధపడతారు, ఇంకొక సారి అడ గండి. ఇపుడు మీరు సరిగ్గా భోజనము, చెయ్యరు. కాలు భగ భగ మండుతున్నా, తలనొప్పిగా వున్నా నిజంగా మీకోసమే ఆప్యాయంగా వంట చేసాను . మీరు కడుపునిండా తినకపోతే నేను చాలా బాధపడతాను” అంది.

రామానికి అనుకోకుండా ఆ ప్రయత్నంగా నోరు జారిన ప్రశ్న అది. సిగ్గుతోటి, అవమాన తోటి, అసహ్యంతోటి లోలోన కుమిలిపోయాడు. రజని మందహాసం, శాంతస్వరం, మాటల్లోని ఆప్యాయతా గాయంమీద కారంజల్లి నట్లయింది. దుఃఖభరిత కంఠ స్వరంలో, వ్యాకుల వదనంతో నన్ను నేనేమి చేసుకోవాలో నాకే అర్థం కావటం లేదు రజని! నా నోటినుంచి ఆ మాటలు ఎలా వచ్చాయో అర్థం కావటం లేదు. నీ ఔదార్యము, కనికరము రంపపు కోత పెడుతున్నాయి రజని! నేను నీ కోపానికి కూడ అర్హుడను కానా!”.

రామం మాటలు వెళ్ళి తిన్నగా రజని హృదయంలో నాటుకుపోయాయి, తన శక్తి నంతా వినియోగించి వాటిని కూడబెరుకుతూ రజని అంది. “ఈ రోజు మీ మనస్సుబావు లేదు రామం బాబూ! ఆత్మనిండా, అశాంతి దీనిలో నిండి వున్నాయి.కడుపునిండా భోజనం చెయ్యండి. లేకపోతే నా మనస్సు చాలా బాధపడుతుంది

భోజనాలయింతర్వాత రజని ప్రసాద్ కి కావలసిన పదార్థాలు కారియర్ లో పెట్టుకొని బయలుదేరింది. రామం తనను కూడా ఆమెతో రమ్మంటుందేమోనని ఆశించాడు కాని రజని అలా అనలేదు. టాక్సీలో ఎక్కి వెళ్ళిపోతుంటే రామం మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడం రజనీ! స్పప్నంలోఅని ఈసారి పారిపోతానంటే నేనూరుకోను. పరిహాసమాడకుండా సరియైన సమాధానం చెప్పి వెళ్ళాలి” అన్నాడు.

రజని “మీకెప్పుడు అలాంటి కోరిక కలిగితే అప్పుడు రండి. దానికి కూడ ఒక నిర్ణీత సమయం ఎందుకు చెప్పండి ? కాని ప్రసాద్ కి స్వస్థతచిక్కేవరకు ఎక్కువ కాలం నేను హాస్పటల్ లోనే వుంటాను” అంది.

రామం “వెళ్ళేముందు ఈ మాట విని వెళ్ళు రజని నా గురించి ఆలోచించే సమయంలో నా లోపాలను పరిగణించి నా కన్యాయం చెయ్యనని నాకు మాటయియ్యి.”

రజని “పరిగణించనని మాటియ్యను. కాని అన్యాయం చెయ్యనని మాట యిస్తాను యిక వెళ్ళండి అలస్యమవుతోంది” అంది.

*****