Aprasyulu - 7 books and stories free download online pdf in Telugu

అప్రాశ్యులు - 7

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

7

ఒక పదిహేను రోజులు గడిచిపోయినాయి. ఈ రోజు సాయంకాలం రామం రజని యింటికి బయయి దేరి వెళ్ళాడు. రజని యింటికి తాళం వేసి వుంది. ఎంతో సేపు ఎదురు చూసాడు. విసిగి విసిగి కాళ్ళుపీకి అక్కడే కూలబడిపోయాడు. చీకటి పడి చాలాసేపయింది. రజని జాడ లేదు. చివరకు ఒక విధమైన మగత నిద్రలో పడ్డాడు, హఠాత్తు రాంబాబు అనే పిలుపు వినిత్రుల్లి పడిలేచాడు. స్త్రీ కంఠస్వరం, “రజనీ” అని లేచాడు.

ఆ కంఠస్వరం కిలకిలా నవ్వి “కాదు రాంబాబు చంద్రికని ఇదేం అన్యాయం చెప్పండి. యిక్కడ నిద్రపోతున్నారు? అంది.

“అందరూ నాకు అన్యాయం చేసే వారే చంద్రకా? చివరకునువ్వు కూడా అంతే. తీయని కలలు కంటూ నిద్రపోతున్న నన్ను లేపావు” అన్నాడు.

చంద్రిక “కలలతోను, కథలతోనుతృప్తి పడవలసిన అవసరం మీకెందుకు? అయితే మా పిన్ని యింట్లో లేదా? అంది.

“ఉంటే బయట తాళం వేసి లోపల నిద్ర పోతుందేమో! అయినా అది ఒక మంచి ఆలోచనే, రజనీ నిజంగా ఆలాగు చేసినా చెయ్యవచ్చు. అందుకు తగినదే. అని ప్రక్కనున్న కిటికి లోంచిలోనికి తొంగిచూచి నిస్పృహతో “అబ్బే లేదు” విశాలా, యీవిడఎక్కడోపచార్లు చేస్తున్నారు” అన్నాడు.

చంద్రిక: “అయితే పదండి రాంబాబు- మా యింటికి రండి, ఇక్కడ ఎంత సేవు ఇలా పడికాపులు పడ్డారు? “అంది.

“సరే పద చంద్రికా, చాలా అలసిపోయాను, తిన్నగా ఆఫీసు నుంచే ఇక్కడకు వచ్చాను. ఆకలి కూడా వేస్తోంది. అన్నాడు.

“అయితే యీ రోజు నా చేతి భోజనం చేద్దురు గాని రండి” అంది.

ఇద్దరు టాక్సీలో బయలు దేరారు. దారిలో రామం హఠాత్తుగా “చంద్రికా, నువ్వింకా పసిపిల్లవు. ప్రపంచంలో నీకింకా ఏమి అనుభవం లేదు. కాస్త జాగ్రత్తగా వుండాలి. ఇలా ఎన్నాళ్ళు వుంటావు? నీ భవిష్యత్తు గురించి నీవేమైనా ఆలోచించావా?” అన్నాడు.

“నా భవిష్యత్తు మామయ్య చేతిలో వుంది రాంబాబు. వారే నన్ను బాల్యంలో వీధుల వెంట ముష్టి ఎత్తుకుంటూ వుంటేచేరదీసి యింత దానిని చేసారు. వారి మాటకు ఎదురాడను” అంది.

“అయితే నువ్వువీధులలో వుండినట్లయితేనే భవిష్యతులో బహుశా సుఖపడేదానివి చంద్రికా? ప్రసాద్ నిన్ను చేరదీయటమనేది ఎంతో విషాదకరమైన సంఘటన అని నాకనిపిస్తోంది” అన్నాడు.

చంద్రిక “అలాంటి మాటలని నన్ను బాధ పెట్టకండి రాంబాబు, అన్యాయమయిన మాటలవి. మామయ్య వంటి కరుణామయలను ఉత్తములను ఇంకెవ్వరిని నేను చూడలేదు” అంది.

రామం “నన్నపార్ధంచేసుకోకు చంద్రికా, ప్రసాద్ నుంచి నీకేవిధమైన అన్యాయము, అపాయము జరగవని నాకు తెలుసు, కాని అతని మనసత్వం, ఆలోచనలు ఆశయాలు ఎంతో విచిత్రమైనవి. అవే మనలని కలుషితం చేస్తాయని నా ఆవేదన” అన్నాడు.

“ఇదంతా మీ ఊహా కల్పితం రాంబాబు, మీరనేది సత్యమయినా, అసత్యమయినా మామయ్య మాటను నేను జవదాటను” అంది.

“వివాహం మీద నీకు కూడా నమ్మకం లేదా చంద్రికా” అన్నాడు.

“నమ్మకం లేదు. అపనమ్మకం లేదు. నాకు మిగతా వన్నీ అనుకూలంగా వుండి వివాహపు రూపంలో జరిగే తతంగమే నా ఆనందానికి లోటయితే, అది కూడా పూర్తి చేయడానికి నేను వెనుదీయను. అదే విధంగా వివాహం చేసుకోవాలని మొదట నిశ్చయించుకొని తరువాత, వరులను ఏ వీధుల వెంట వెదకను. ముందర వ్యక్తి లభించాలి. తరువాతే వివాహపు సమస్య ఎదురవుతుంది” అంది.

చంద్రిక అంత చిన్న వయసులోనే ఆవిధంగా సిగ్గు, సంకోచము లేకుండా మాట్లాడగలిగిందంటే అది రజని ప్రభావమేనని గ్రహించాడు. కాని రజనీ అభిప్రాయాలకీ, యీ మే అభిప్రాయాలకీ చాలా వ్యత్యాసముంది.

“ఐతే అలాంటి వ్యక్తి ఎవరు దొరకలేదా చంద్రికా!?” అన్నాడు.

“వెదకినప్పుడే దొరుకుతారు. నేను వెదకటం లేదు, వారు తటస్థపడటం లేదు'' అంది.

“తటస్థపడతారు చంద్రికా! కాని యీ లోపున నువ్వు నిస్పృహ చెంది తొందరపాటుపడకు.”

రామం ప్రదర్శించే అవాంఛనీయమైన ఆతృత చంద్రికను ఆశ్చర్యపరచింది.

“మనం దేనినైనా కాంక్షించి నిరాశ చెందినప్పుడే నిస్పృహ చెందుతాము రాంబాబు” అంది.

టాక్సీవచ్చి ప్రసాద్ ఇంటిముందు ఆగింది. చంద్రిక క్రిందకు దిగి “దిగిరండి రాంబాబు టాక్సీవానికి మీరే డబ్బులివ్వాలి. నా వద్ద దమ్మిడీ కూడ లేదు” అంది.

“ఇక్కడకు తీసుకు వచ్చావేమిటి చంద్రికా! ఇది ప్రసాద్ ఇల్లుకదా!” అన్నాడు

“అవును ప్రస్తుతం ఇదే నా యిల్లు రండి లోపలికి” అంది.

“ప్రసాద్ ఇంట్లో వున్నాడా?” అన్నాడు.

“లేరు. దగ్గర్లోనే వున్న గ్రామంలో అగ్నిప్రమాదంలో చాలామంది చనిపోయారు. అక్కడకు వెళ్ళేరు. వారం రోజులపట్టి ఇంటికి రావడం లేదు” అంది చంద్రిక.

రామానికి చటుక్కున రజని జ్ఞప్తికి వచ్చింది, ఒక సారి యీ విధంగానే ప్రసాద్ లేనప్పుడు రజని వెంట రాత్రి యీ ఇంటికివచ్చి విందారగించాడు. ఈనాడు ఈగృహంలో రజని లేదు. చంద్రిక వుంది. ఈ ఇంటిలోనే తన తప్పుమూలంగా రజని కాలు మీద వేడిపాలు పడ్డాయి. ఇప్పడు చంద్రిక చేతి వంట తినటముంటే అతని కెందుకో ఒక విధమైన అయిష్టత ఏర్పడింది.

“లేదు చంద్రికా! ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు చాలా పనివుందని” సమాధానంకు ఎదురుచూడకుండాడ్రైవర్ కి కారు స్టార్ట్ చెయ్యమని వెళ్ళి పోయాడు.

ఆ మరునాడు సాయంకాలం రామం మళ్ళీ రజనివద్దకే బయలుదేరాడు. అదృష్టం ఆరోజు వరించింది. ఆమె ఇంటి వద్ద వుంది. రామాన్ని చూచి నవ్వుతూ “నిన్న వచ్చి వెళ్ళారని విన్నాను. కోపంతో ఈరోజు రారు చల్లబడింతర్వాత రేపు వస్తారు అనుకుంటున్నాను” అంది.

“నేను వచ్చేనని నీ కెలా తెలుసు రజనీ?” అన్నాడు.

“మా పక్కింటావిడ చెప్పింది. ఎవరో ఒకాయన చామన ఛాయ- పొడుగరి- ఉంగరాలజుట్టు- విశాల నేత్రాలు వచ్చి ఇక్కడే ఎంతో సేపు నిద్రపోయి చివరకు ఎవరో ఒక దారిన పోయే స్త్రీతో కలసి వెళ్లి పోయారని చెప్పింది. ఆమె వర్ణనకు, రూపానికీ సరిగ్గా సరిపడలేదు. ఐనా మీరు తప్ప ఇంకెవరయినా అంతసేపు ఎదురు చూడరని గ్రహించాను, ఇక ఆ స్త్రీ ఎవరా? అని అలోచించాను చంద్రిక లేక కమల అనే ప్రశ్న కమల ఒంటరిగా వచ్చివుండదు. ఇక చంద్రిక అని గుర్తుపట్టాను”.

“ఆమె విశాల కాకూడదా? విశాలే అది” అన్నాడు.

“నేనప్పుడు ఆమెవద్ద వున్నాను. ఆమె ఢిల్లీకి ఆరు మైళ్ళ దూరంలో వున్న కుష్టురోగుల కాలనీలో జేరింది” అంది.

పిడుగులాంటి ఆవార్త రామాన్ని క్షణ కాలం చేతనారహితుని చేసింది “ఏమిటి నువ్వంటున్నావు రజనీ!?” అన్నాడు.

“పరిహారం కాదు రాంబాబు విశాల ఢిల్లీకి రావడానికి కారణం కూడా ఇదే పేపర్లో కుష్టు రోగులకు సేవ చేయడానికి సరియైన వారెవరు దొరకటం లేదని, దొరికినా కొద్దిరోజుల తరువాత వెళ్లిపోతున్నారని, అందువలన రోగులు చాలా కష్ట పడుతున్నారని సరళ స్వభావంగల స్వార్థత్యాగులెవరయినా కావాలని వ్రాసేరు. అది చూచే ఈమె ఇక్కడకు వచ్చింది. ఆమె వెళ్ళి పోయి సరిగ్గా పదిహేనురోజులయింది. ఆమెను కలుసుకోడానికి నేను నిన్నవెళ్ళాను'' అంది.

ఇదంతా ఎంతో విచిత్రంగా వుంది రజనీ! ఈ విషయం. నాకు చూచాయగానయినా చెప్పలేదే” అన్నాడు.

“చెప్పక పోవడమే మంచిదయింది.. లేకపోతే లేని అధికారం చెలాయించే వారీమో? అంది.

రజనిమాటల్లోని వ్యంగ్యాన్ని వినీ విననట్లు వూరుకున్నాడు.

“ఎందుకు వెళ్ళనిచ్చేరు రజనీ!'' అన్నారు,

“ఎందుకు వెళ్ళనివ్వకూడదు! ఆమె చేయదలుచుకున్న ఉత్తమ కార్యానికి ఇదా మనం చూపించవలసిన సహాయం ఐనా ఆమేమీ చిన్న పిల్లమీ కాదు. ఆమె నిశ్చయాన్ని విశాల ప్రపంచంలో మార్చగల వారెవ్వరు లేరు. రజని లాగా కన్నీటికి, క్రోధానికి కరిగిపోదు' అంది.”

రామం ఈసారి కూడా ఎత్తిపొడుపు వాక్యాలను పట్టించుకోలేదు. రజనికి! ఎంత ఆశ్చర్యం వేసింది. అతనినిప్రేరేపించాలని చేసిన ఆమె పన్నుగడ సాగలేదు.

“సరే పోనీ రజని! కనీసం నన్ను అక్కడకు తీసుకువెళ్ళు” అన్నాడు.

“భలే వారు! ఇదా సమయము చెప్పండి? ఎల్లుండి ఆదివారం వెళదాం రండి.”

కమలా, కమలాకరం, రజని, రామం, విశాల వద్దకు బయలు దేరారు. రజనీ విశాలకు ఇవ్వబడిన చిన్న ఇంటికి వచ్చి గట్టిగా “విశాలా” అని పిలిచింది. లోపల నుంచి సమాధానం రాలేదు. రజని తలుపుతోసుకుని లోనికి వెళ్ళింది. అంతా ఎంతో నిరాడంబరంగా, శూన్యంగా వుంది కమల అది చూచి “విశాలవంటి స్త్రీలుండవలసిన యిల్లుకాదిది రజనీ?” అంది.

“ఇందులో ఏముంది కమలా? చూడవలసింది చాలా వుంది. తొందరపడి అభిప్రాయం వెల్లడి చేసావు” అంది రజని.

అందరిని వెంట వేసుకుని రజని ఆ కాలనీ వెదకసాగింది. దగ్గరలోనే వున్న ఓక పెద్ద మర్రి చెట్టు కింద విశాల ఒక యాభై మంది పిల్లలకు పాఠాలు చెబుతోంది. పిల్లల వయస్సు ఆయిదు నుంచి పది హేనువరకు వుంటాయి. చెట్టు మానుకి ఆనుకొని వున్న బ్లాక్ బోర్డు మీద ఏవో లెక్కలు వ్రాసివున్నాయి.

వీరినందరిని చూచి విశాల క్షణం సేపు ఆశ్చరపోయింది. రజని దగ్గరకు వెళ్ళి “ఇదంతా ఏమీటి విశాలా బడిపంతులు కూడా అయ్యావని నాకు తెలియదు. వీరంతా ఎవరు? అంది.

విశాల పిల్లలతో “ఇవ్వాల్టికి ఇక చాలు. వెళ్ళిపోండి” అంది. పిల్లలంతా పరుగెత్తుకుని పోయారు.

“ఇక్కడవున్న రోగుల పిల్లలు. చూచే దాత లేక చదువు సంధ్యా లేక పాడయిపోతున్నారు. వీరందరికి రోజు చదువు చెప్పే బాధ్యతకూడా నేనే వహించేను” అంది.

“తల్లిదండ్రులతో కలిసివుంటే వీరికి కూడా యీ వ్యాధి సోకదా?''అంది కమల.

“అది కొంతవరకు నిజం. కుష్టు వ్యాధి మనము అనుకునేటంత సులభంగా సోకదు. అయినా మేము వీరిని తల్లిదండ్రులనుంచి పూర్తిగా వేరుగానే వుంచుతాము.వీరికి వారి తల్లిదండ్రులెవరో తెలియదు. పుట్టుకతోనే వేరు చేస్తారు. మనం అసహ్యించుకొనే, అనేక రోగాలకన్న ఇదే ఎంతో నయం. ఎట్లో శరీర రూపాన్ని వీకృతం చేస్తుంది. అందుకనే అసహ్యించుకుంటాము కాని నిజంగా అలాంటి వాళ్ళే నాన్ ఇన్‌ఫెక్షస్ టైపు.మనకు బయటకు ఏమికనబడకుండా వునఇన్‌ఫెక్షస్టైపు. ఇలాంటి వాళ్ళని మనము కలుపుకుంటాను” అంది.

కమల, “ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు విశాలా? వచ్చి పదిహేను రోజులు కూడా అయింది” అంది.

“డాక్టరు సనల్ చటర్జీ గారివద్ద శిష్యరికం చేస్తున్నాను. వారే నాకన్నీ నేర్పుతున్నారు. వ్యర్థమవుకున్న నా జీవితానికి ఒక తాత్పర్యంజుపించేరు” అంది.

కమల: “అయితే నివ్విక్కడే స్థిరపడిపోతావా విశాల? నీకీ పనిలో మనశ్శాంతి, తృప్తి లభిస్తున్నాయా?” అంది.

“పూర్తిగా లభిస్తున్నాయి కమలా, ప్రపంచమంతా ఏవగించుకునే ఈ దురదృష్టవంతుల సేవ నా కెంతో మానసిక శాంతిని తృప్తిని ఇస్తున్నాయి. జీవితంలో నేను ఇంత సుఖం ఎన్నడు అనుభవించలేదు అంది.

రజని డాక్టరుని ఆ కాలనీ గురించి, వ్యాధి గురించి, ఆయన అభిప్రాయం తెల్పమంది.

ఆయన “కుష్టు రోగుల యెడ మీరు ప్రదర్శించే అసహ్యానికి అర్థం లేదు. ఈ వ్యాధికి ఇతర వ్యాధులకు యే విధమైన భేదం లేదు. ఇప్పుడు మిగతా వాటికన్నా దీన్నే నయం చేయుటకు ఎక్కువ సులభం, మనం అంటూంటాము. మూడు సంవత్సరాల క్రితం నాకు టైపాయడ్ వచ్చింది. అది వదలగానే మూడు సంవత్సరాల క్రితం నాకు కుష్టు వ్యాధి వచ్చింది. అది మనం అనగలిగే పరిస్థితికి తీసుకురావలనేదే నా ఆశయం. అసలు వీరికోసం ప్రత్యేకంగా కాలనీ వుంచటం మంచిది కాదు. అన్ని రోగాలతోపాటు దీనిని కూడా మామూలు ఆస్పతులలో ట్రీట్ చెయ్యాలి. లేకపోతే వారేదో అంటరాని వారని అనే భావం రోగులలో కలుగుతుంది. అది ఎంతమాత్రం మంచిది కాదు” అన్నాడు.

కమల: “అయితే మీరు దీనిని ఎందుకు స్థాపించలేదు'' అంది.

“ఇది నేను దిక్కులేని వారి కోసం పెట్టాను. వ్యాధి బాగుచేసే వారు లేక వీరు రోడ్ల వెంట తిరుగుతూ రోగాన్ని వీరు జీవనోపాధిగా చేసుకొని జీవిస్తూ వుంటారు. ఇంకొక కారణం కూడా వుంది. కుష్ఠు రోగి చాలా కాలం ఇంకొకరితో కలిసివుంటేనే వ్యాధి పాకుతుంది. భార్యాభర్తలని తల్లి పిల్లలను వేరుచేయరు, పుట్టుకతోనే ఈ వ్యాధి రాదు. కాని పుట్టిన తర్వాత ఎక్కువకాలం ఒకే ఇంటిలో జీవిస్తేనే యిది సోకుతుంది. అలా జరగకుండా వుండడానికే అలాంటి రోగులను వేరు చేసి యిక్కడకు తీసుకువస్తాము. ఇక్కడకు వచ్చిన తర్వాత తల్లిదండ్రలను పిల్లలనీ వేరు చేస్తాము. పేర్లు మారుస్తాము. కొద్ది కాలంపోయిన తర్వాత ఒకరి నొకరు గుర్తుకూడా పట్టలేరు. కాని మా వద్ద జాబితా వుంది, వ్యాధి పూర్తిగా నయమయి వెళ్ళే సమయంలో ఎవరి పిల్లలను వారికి అప్పగిస్తాము” అన్నాడు.

రజని: “విశాల మీకు నచ్చిందా డాక్టర్. ఆమె మనసత్వం యీ లాంటి పనికి సరిపోతుందా” అంది.

విశాల కాస్త చిన్న బుచ్చుకొని “నా ఎదుట అలాంటి ప్రశ్న వేస్తే ఆయన ఏం చేస్తారు రజనీ. నా శక్తి వంచన లేకుండా నేను కృషిచేస్తున్నాను. అయినా నేర్చుకోవలసింది, చెయ్యవలసింది చాలా వుంది” అంది.

డాక్టర్ సనల్ : “విశాల వచ్చిన తర్వాత ఈ కాలనీ రూపమే మారిపోయింది. అంతకి ముందరంతా, అనుచిత అశుభ, అల్లకల్లోలం వుండేది. పిల్లలంతా చిందరవందరగా తిరుగుతూ వుండేవారు. ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడు రోగులకుఆమె వద్ద అలవాటు యెక్కువ అయింది. మానవమాత్రురాలుకాదని వారిని వుద్ధరించడానికి వచ్చిన దేవత అని వారి నమ్మకం. ఆమె ముట్టుకుంటే బాధ ఉపశమనం అవుతుందనే భావం కూడా కుదిరింది” అన్నాడు.

“ ఫ్లారెన్స్నైటింగేల్ లాగ” అంది రజనీ.

కమలాకరం అక్కడకు వచ్చిన తరువాత నుంచి ఒక్కమాటకూడా మాట్లాడలేదు. డాక్టరు చెప్పినదంతా ఎంతో శ్రద్ధగా వింటున్నాడు.

“సాధారణంగా ఈ వ్యాధి కుదరటానికి ఎంత కాలం పడుతుంది డాక్టర్?” అన్నాడు.

“అదేవ్యాధి లేతవయస్సులో వున్నప్పుడయితే ఒక ఆరు నెలలలో పూర్తిగా నయమవుతుంది. వ్యాధి సోకిన వెంటనే అయితే ఒకటి రెండు నెలలలోనే నయమవుతుంది. కుష్టు రోగులలో రెండు తరగతులున్నారు. “లె ఫమింటిన్ , న్యూరలన్. మొదటితరగతిదే అంటు వ్యాధి. రెండవది కాదు'' అన్నాడు.

''మీ మాటలు విన్న తర్వాత మేము ఎంత అజ్ఞానంలో పడివున్నామో ఇప్పుడు అర్ధమయింది డాక్టర్. కుష్టు రోగమంటేనే శరీరం గగుర్పాటు వస్తుంది” అన్నాడు కమలాకరం.

డాక్టర్ సనల్ వీరందరిని రోగులవద్దకు తీసుకెళ్లాడు. కొంత మంది ఎంతో ఆరోగ్యంగా, అతి సాధారణంగా వున్నారు. రోగులని గుర్తుకూడా పట్టలేము. కాని అవన్నీ న్యూరల్ టిప్ తరగతివని అంటూ చెప్పేడు. కొంతమందికి వంటిమిద మచ్చలు తప్ప ఇంకేవిధమైన అంగవైకల్యం లేకుండా వున్నారు. వ్యాధి ఎంతో లేతవయస్సులో వుందని తప్పక నయమవుతాయని డాక్టర్ చెప్పాడు. కొంతమందికి చేతినిండా కురుపులు, దెబ్బలు కాల్పులు వున్నాయి. కారణమడుగుతే డాక్టర్ కుష్టురోగులకి కొంత కాలంపోయిన తరువాత స్పర్శాజ్ఞానం నశించిపోతుంది. వారికి నొప్పి, బాధ అనేవే తెలియవు, ఎంత మోటు పనైనా చేస్తారు. కత్తితో కోసి వేసినా వారికి బాధ తెలియదు. వీరంతా అలాంటి వారే. శక్తి సామర్థ్యాలకుమించి పనులు చేస్తూ ఇలాగయి పోతుంటారు” అన్నాడు.

“అయితే కుష్టురోగికి ఏవిధమైన బాధా వుండదా డాక్టర్?” అన్నాడు రామం.

“అదే ఎంతో దురదృష్టమయినది. మిగతా వ్యాథులన్నింటికి బాధ నొప్పి వుంటాయి. బాధ భరించలేక రోగులు త్వరగా డాక్టరు వద్దకు వస్తారు. దీనికి బాధవుండదు, అందుకని అందరు అశ్రద్ధ చేస్తారు అంగ వైకల్యము ప్రారంభమైనప్పుడే అందరు భయపడతారు. రహస్యంగా డాక్టరువద్దకు వస్తారు. కాని అప్పటికే చాలామట్టుకు మించిపోతుంది. ఐనా ఇంకా కొంతమంది సంఘానికి వెరచి డాక్టరువద్దకు రారు. ఒకాయన నాకు తెలుసు. చదువుకున్నాడు. సంస్కారి.దురదృష్టవశాత్తు వ్యాధిసోకింది. మొదలు గుర్తించలేదు. కొన్ని నెలలకు చేతుల వేళ్లు పోనారంభించాయి. అప్పుడు భయంతో చేతులకు గ్లవ్స్తొడుగుకొని తిరగటం ప్రారంభించాడు కాని నేను ఇతర గుర్తులను పసిగట్టి ఒక రోజున అడిగాను. నా ప్రశ్న విని భయంతో వణికిపోయి బయటకు పారిపోయి తిన్నగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి కుష్టు రోగం వచ్చినదనే విషయం సంఘానికి తెలుస్తుందేమోననే భయమే ఆ విచార పరిణామానికి దారితీసింది. ఇది ఏమి భయంకరమైనది కాదు. అనేక రోగాలలో ఇదోకటి మాత్రమే ఐనా సంఘం గుర్తించినప్పుడే ఆలాంటి వారికి ముక్తి వుందన్నాడు. ఆమెరికాలో 'లెప్పర్' అనే పేరు మార్చి వేసారు. పాన్ డన్స్ డిసీజంటారు” అన్నాడు.

రోగులంతా విశాలను, డాక్టరును చూచి సంతోషముతో వుప్పొంగిపోయారు. ఆమె అందరిని ఆప్యాయంగా పలకరించడం, కొంతదూరం పోయింతర్వాత రజని కూడా ఆమె ననుకరించి అందరిని పలకరించి వారి వారి వృత్తాంతాలను తెలుసుకొంది. కొద్ది కాలంలోనే వారితో స్నేహం చేసుకుంది. అది గ్రహించి డాక్టర్ సనల్ “మీరు రోగుల మనస్తత్వాలను బాగా అర్థం చేసుకున్నారు. విశాలలాగే మీరు కూడా ఈ పనికి పూనుకుంటే కృతార్థులవుతారు” అన్నాడు.

“అవునని నాకు నమ్మకంగా వుంది డాక్టర్ నాకు అనుమతి ఇవ్వండి. నేను ఇక్కడకు వచ్చినప్పుడల్లా నాకు చేతనయినది నేను చెయ్యవచ్చునని” అంది.

“అంతకంటే మాకు కావలసిందింకేమి లేదు” అన్నాడు డాక్టర్

రజని మాటలు విని రామం ఆమె కేసి తీక్షణంగా చూచాడు. ఆమె నవ్వుతూ “కాని ఒక షరతువుంది డాక్టర్, మీరు ఆయన అనుమతి తీసుకోవాలి” అంది.

“వారి అనుమతి తీసుకోవలసింది మీరు నేను కాదు. అయినా మీకు వివాహం కాలేదని విశాల చెప్పింది'' అన్నాడు.

మందహాసం చేస్తూ “ఇప్పుడయిందని ఎవరన్నారు. చెప్పండి ఇదంతా కలికాలం. అపరిచితులుకూడా అధికారం చెలాయిస్తూంటారు. అబలలము. తలవొగ్గాలి” అంది.

రజనీ పరిహసిస్తోందని డాక్టర్ గ్రహించి “మీరు చాలా విచిత్రవ్యక్తులు. అసమాన్యులు“ అన్నాడు.

రజని తెలుగులో విశాలనుద్దేశించి “డాక్టరుకి వివాహమయిందా?” అంది.

“లేదు. వారిని పరిహసించకు రజనీ. వారు స్వార్థత్యాగులు, సంఘసంస్కర్తలు. పరులకష్టాలని తన కష్టాలుగా భావించే వుదారస్వభావులు” అంది.

“మాట్లాడేది నువ్వు కాదువిశాలా! నీలోని బలహీనత ” అంది రజని.

“ఇదన్యాయం నా యెదుట నాకు తెలియని భాషలో మాట్లాడడం” అన్నాడు డాక్టరు.

“అన్యాయమేమీ లేదు డాక్టర్. మీరు స్వార్థత్యాగులంటోంది విశాల నేను కాదన్నాను” అది రజని.

“మీరన్నదే నిజం ఇందులో స్వార్థత్యాగమేమి లేదు. నాకు ఎంతో మనశ్శాంతి, సుఖం ఆనందం యీపని లభింపజేసింది. నా కోసమేనేనీ పని చేస్తున్నాను. పూర్తిగా స్వీయసుఖం కోసం చేస్తున్నదే ఇదంతా” అన్నాడు డాక్టరు.

“స్వీయసుఖమే అయినా అది పరుల సుఖానికి దోహదమౌతుంది. అదెంతమాత్రం, స్వార్థపరత్వం కాదండి” విశాల.

“స్వార్థపరత్వమని నేననలేదు. మానవుడు తను చేసే ప్రతీ పనికి సుఖాన్ని కాంక్షిస్తాడు. ఒక్కొక్కప్పుడు శారీరకంగాను, ప్రాపంచికంగాను యితరులకోసమని మనల్ని మనం కష్ట పెట్టుకుంటాము. మనమేదో “త్యాగం చేస్తున్నామని భ్రమపడతాము నిజానికి నేను ఇతరుల కోసం ఈపని చేశానని మానసికతృప్తి కలుగుతుంది దానిని ఆశించే మనం ఆలా జేస్తాము” అంది రజని.

కమల; “మాటల్లో పడి మనష్యున్ని మరచిపోకు రజనీ తీరికగా మాట్లాడుకోండి-ఇప్పుడు కాస్తా యిదంతా చూద్దాం” అంది.

అంతా తిరిగి అలసి డాక్టరు పనిమిద వీరిని వదలి అవతలికి వెళ్ళిపోయాడు. అంతా కలిసి విశాల గదిలోకి వెళ్ళి కూర్చున్నారు.

రెండు మూడు నిమిషాల వరకు ఎవరు మాట్లాడలేదు. హఠాత్తుగా రామం “విశాలా! నీకు దైవంమీద నమ్మకముందా” అన్నాడు.

ప్రశ్న విని అందరు త్రుళ్ళిపడ్డారు. అంత ఆ సందర్భముగా ఉపోద్ఘాతం లేకుండా అలాంటి ప్రశ్న వేస్తాడని ఎవరు ఊహించలేదు. విశాలా క్షణం మౌనం వహించి “ఈ ప్రశ్నకు సమాధానం రజని చేప్తే ఎంతో సమంజసంగా వుంటుందేమో” అంది.

రజని“సమంజసమో, అసమంజసమో నాకు తెలియదు, విశాలా!కాని ఇది సమయం కాదు” అంది.

రామం కోపంతో “ఈ ప్రశ్న వేసింది. నిన్ను విశాలా? సమాధానం చెప్పవలసింది నీ కర్తవ్యం” అన్నాడు.

విశాల“చాలా కష్టమైన ప్రశ్న వేసారు మీరు. యీ ప్రశ్న మీరు ఎందుకు వేసారో నాకు తెలియదు.” చిన్నతనం నుంచి నా మనస్సులో ఒక కోరిక నిలిచిపోయింది. మానవ హృదయాలలో ఎంతో దుఃఖం కరడుగట్టి వుంది, ఎంతో బాధ, వేదన ప్రతిమానవుడు జీవితంలో అనుభవిస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో పరుల కన్నీటిని తుడువ ప్రయత్నించటంకన్న ఇక వేరే కర్తవ్యమేముంది! అంతకుమించిన దైవం సృష్టిలో లేదు. వున్న వారితో నాకు పని లేదు. దైవమనే పేరుతో మట్టి బొమ్మల్ని రాత్రింబగళ్ళు పూజిస్తూ తోటిమానవున్ని అసహ్యించుకొని, వారి ఆక్రందాన్ని పెడచెవిని పెట్టువారికి అన్యాయం చేసేవారు ఆత్మవంచకులు అధమాధములు.మానవ సేవే మాధవ సేవఅనేదే పరమ సత్యం. మనము నిత్యము పారాయణ చేయవలసింది భగవద్గీత కాదు. ఈ చిన్న సూత్రమే” అంది.

మాట్లాడుతూ, మాట్లాడుతూ విశాల కాస్త ఉద్రేకపడింది. అది చూచి రామం ఆశ్చర్యపోయాడు. విశాల స్వభావానికి, నాస్తికత్వానికి అతనికేమి పోలికలు కనబడలేదు.

“అయితే దైవాన్ని విశ్వసించే వారంతా మూఢ విశ్వాసలేనా? వారిని అసహ్యించుకోవలసిందేనా” అన్నాడు బాధపడుతూ.

“లోపాలు లేని మానవులు లేరు రామం బాబు” బలహీనతకు బలాడ్యులు లేరు. కాని మనం ఇంకోరికన్నా గొప్పవారము,నైతికంగా ఉత్తములు అని విర్రవీగేవారిని మనం మనస్సులో వేరు చెయ్యాలి.

“కాని దైవాన్ని విశ్వసించే వారంతా నైతికంగా అధములు అనుకునే వారు కూడా అలాంటి వారేగా!” అంది కమల.

కమల ప్రశ్న విశాలకు చటుక్కుమని తగిలింది. క్షణకాలం మౌనం వహించి “నీఆభియోగానికి నేను కొంత వరకు తలవొగ్గాలి కమలా! కాని నేను నిశ్చయంగా చెప్పుతున్నాను. నా హృదయంలో అలాంటి భావానికి తావు లేదు, ఏమంటావు రజని” అంది.

రజని ఈ సంభాషణ అంతా ఎంతో కుతూహలంగా వింటూంది. రెండు మూడు సార్లు జోక్యం కలిగించుకుందామని ప్రయత్నించింది. కానీ ఎందుకో ఏమనాలో తోచలేదు. సృష్టిలోని ప్రతి విషయం గురించి ఆమె ఎంతో నిర్భయంగా,నిస్సంకోచంగా మాట్లాడుతుంది. కాని దైవం గురించి చర్చ వచ్చినప్పుడు ఆమె సాధారణంగా మౌనముద్ర వహిస్తుంది. కమల వేసిన ఆభియోగం, ఈమెకు కాస్త బాధ పెట్టింది. “నాకు దానితో ఏమి ప్రయోజనం లేదు విశాలా? నా బుద్ది కుశలత ననుసరించి నేను సమస్యలను ఎదుర్కొంటాను. నాకు ఇతరులతో సంబంధం లేదు. వారు దైవమయినాసరే; వరం కోసమని నేను యిహం వదలుకోను, దైవం కోసమని నాజీవితాన్ని నేను నాశనం చేసుకోను. క్షణక్షణము ఆనందంగా గడచిపోతుంటే అనంతమైన వాటిని గురించి మన మెందుకు అలోచించాలి” అంది.

రామం మెల్లగా “క్షణికంగా మనం చేసే పనులలో కొన్ని క్షంతవ్యం లేనివి వుంటాయనేదిరజనీ?”అన్నాడు.

రజనీ“క్షంతవ్యం కాదని నిరూపించే కొలత బద్ద” అంది.

రామం“దీనికి నమాధానం తెలియకే సతమతమవుతున్నాను రజనీ” అన్నాడు.

రజని“ఈ ప్రశ్నకు అనేకసార్లు మీకు నేను సమాధానం చెప్పేను. కాని మీమనస్సుని నమ్మించలేక పోయాను. కమలాకరం బుద్ధికుశలతలో మీకు నమ్మకముందని నాకు తెలుసు. ఈసారి వారికి సమాధానం చెప్పనీయండి” అంది.

కమలాకరం“ప్రశ్నను స్పష్టంగా వెయ్యి రజనీ ఆ తరువాత అందులోని గూడార్ధం తీస్తాను” అన్నాడు.

“జీవితంలో మానవుని కర్తవ్యం ఏమిటి? ఆత్మ ఎడ లేక ఆత్మీయుల ఎడ? ఒక వ్యక్తి మంచి చెడ్డలని నిర్ధారణ అధికారం ఇతరుల కెలా సంక్రమిస్తుంది! దానికి వెరచి మన మంతా ఎందుకు సంచరించాలి” అంది

“కర్తవ్యం ఆత్మీయుడే రజనీ! కాని యీఆత్మ ప్రబోధాన్ని అర్థం చేసుకోవడమే కష్టం ఆ శక్తి కరతలామల కమవుతే ఆ వ్యక్తి యితరుల గురించి ఆలోచించనక్కర లేదు” అన్నాడు.

కమలాకరం దృక్పధం ఎంతో నూతనంగా, సమంజసంగా అందరికి కనబడింది. కాని రజనీ అంగీకరించలేదు. “అవి ఆత్మవిశ్వాసం లేని వారనే మాటలు. నేనంగీకరించను, అప్పుడప్పుడు అస్పష్టంగా కనబడవచ్చు, కాని చెవివొగ్గి వింటేఅది స్పష్టంగానే వుంటుంది” అంది.

కమల“ఆలస్యమయింది. ఇక పోదాము. వ్యర్ధమైన యీ వివాదాలతో మనకయితే సరిపోతుంది. కాని విశాలకు చేతినిండా పనివుంది. వంట ప్రయత్నం కూడా ఏమి ప్రారంభించినట్లు లేదు” అంది.

విశాల“అది ఎంత సేపు కమలా.పది నిమిషాలలో అయిపోతుంది. మిమ్మల్నిందరిని భోజనానికి వుండమనే తాహతు నాకు లేదు. వుండమననుకూడాను” అంది

రజని“ఆ మిషతో మమ్మల్ని బయటకు పంపివేస్తున్నావు విశాలా? సరే; ఇదేమి ఆఖరుసారి కాదు” అంది.

అంతా కృత్రిమంగా ఒకసారి నవ్వారు. బయటకు వచ్చి వెళ్ళిపోయేముందు కమల; “ఇది నీ స్థిర నివాసమా, విశాలా? లేక అప్పుడప్పుడు ఢిల్లీ వస్తూంటావా” అంది.

“లేదు, కమలా, ఇక నాకు దానితో పని లేదు. వీలున్నప్పుడల్లా మీరే ఇక్కడకు రండి, కుష్టు రోగం సోకుతుందనే భయం లేకపోతే” అంది.

కమల“నీకు లేని భయం మాకెందుకు విశాలా! అలాగే వస్తాము అని ఒక మాట చెప్తాను, కేవలం ఆత్మ సంతృప్తితో ఇహం లభించదు” అంది.

విశాల“ఇది నేనెప్పుడూ కాదనలేదు. కమలా - అయినా సమయానికి స్ఫురణకు రాలేదేమోననే ఆతురతతో చెప్పావు దానికి కృతజ్ఞరాలిని” అంది.

******