Kshantavyulu - 12 books and stories free download online pdf in Telugu

క్షంతవ్యులు - 12

క్షంతవ్యులు – Part 12

చాప్టర్ 29

ప్రయాణ బడలిక తీర్థయాత్రలు విసుగూ ఇంకా తీరక ఆమరునాటి మధ్యాహ్నం నేను నిద్ర పోతుంటే. యశో గదిలోకి ‘‘బాదల్ బా బూ. బాదల్ బాబూ’’ అంటూ అరచినట్లుగా వచ్చింది.

‘‘ఏమిటి సుందరీ, ఏమైంది ?’’ అన్నాను నిద్రమత్తు ఇంకా వదలలేదు.

‘‘ఇంకెప్పుడూ అలాగా అలా పిలవకండి,‘‘అంది తను చెవులు మూసుకుని.

నేను ఆశ్చర్యపోయాను. సుందరీ అనే పేరు తనకు నచ్చిందని ఆమే ఒక సారి చెప్పింది. పరిహాసమేమో అనుకున్నాను. ముఖం చూస్తే వెలవెల పోయింది . తన చేతిలో ఉత్తరం నా నా పక్క మీద పెట్టి తిరిగిచూడకుండా వెళ్ళిపోయింది కన్నీళ్లు తుడుచుకుంటూ . తీరా చూస్తే అది సరళ రాసింది. వణికే చేతులతో దాన్ని చదవటం ప్రారంభించాను.

‘‘ప్రియమైన యశోకి,

నా సంగతి తర్వాత చెప్తాను. మొదట లఖియా విషయం చెప్పనీ, ఎలాచెప్పేది? ఆ విషయం తలచుకుంటూంటే హృద‌యం పగిలిపోతూంది. ఆమె కథ విని, నువ్వు ఒకసారి అన్నావు, ‘కష్టాలు ఓరిమితో సహించే వాళ్లనే సమాజం, చివరకు దైవం కష్టపెడతాడని’. అది ఎంత యదార్థమైందో యిప్పుడు అర్ధమయింది నాకు , అసలు సంగతి చెప్పకుండా నిన్నీ ఉపోద్ఘాతం తో వేధిస్తున్నా ననుకుంటాను.

“నేను తరచుగా లఖియాని కలుస్తూవుంటాను. నువ్వు ఆమెకు రాసిన ఉత్తరాలు నాకు ఎప్పటికప్పుడు చూపిస్తుంది. (ఎక్కడున్నా ఉత్తరం రాస్తావని చెప్పావు కానీ ఎప్పుడూ రాయలేదు. నీ పక్షపాత వైఖరిని తర్వాత ఓ పట్టుపడటాలే)

కాని మొన్న నీ పూర్వాశ్రమానికెళితే అక్కడ నాకు మతి భ్రమించినంత పని అయ్యింది.

అప్పటికి వారం రోజుల క్రితం లఖియా గురువుగారిని తీవ్రంగా గాయపరచిందన్న అభియోగంమీద ఆమెని పోలీసులు రిమాండ్ లోకి తీసుగున్నారు. ఆ ఘోర సంఘటన లఖియా కుటీరంలో జరిగిందట. తలమీద ఆయన్ని ఒక ఇనుప దండెంతో కొట్టిందట. తల పగిలి ఆయన ఇంకా స్పహలేకుండా ఆస్పత్రిలోనే వున్నాడట. ఆ గాయానికి కారకురాలు తనే అని చెప్పి,, తను ఆ నేరాన్ని ఒప్పుకుందిట. పోలీసుల కారణమడుగుతే ‘నా వైధవ్యాన్ని కాపాడుకునేందుకు ఆ పని చేయాల్సి వచ్చింది’ అని చెప్పిందట. ఇంకెన్ని ప్రశ్నలడిగినా జవాబు చెప్పలేదట. లఖియా ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి పని చేసిందో మనం సులభంగానే గ్రహించ గలం. అయినా నాకు మొదటి నుంచీ మీ గుగ్గురువు మీద అనుమానంగానే ఉండేది, అయినా లఖియా కి నీకు చెప్పడానికి సంకోచించాను. ఇంతకీ ఇక్కడ గమనించదగ్గ విషమేమిటంటే, రణధీర్ ఆరాత్రే ఆశ్రమం వదిలి వెళ్లిపోయాడుట.

వెంటన్ రాజేంద్ర నేను తన్ని డెహ్రాడూన్ జైలులో కలిశాము. వివరాలు చెప్పమని ఎంతో వేడుకున్నాను. దుఃఖము పట్టలేక తలను గోడకేసి కొట్టుకున్నాను. ‘‘సరళా. ఆ వివరాలు తెలుసుకుని నీవు చేసేదేముంది? ఆ నేరం చేసింది నేనే. దానికి శిక్ష అనుభవించాల్సిందే, నాకు ఏమి శిక్ష వేసినా చింతలేదు. దీనిని సులభంగానే దాటివేస్తాను. ఆ తర్వాత భగవంతుని ముందు నిలబడి నేనేమి చెప్పుకోగలను? ఆ విషయమే నన్ను బాధపెడుతూంది’’ అంది కాని ఇంకేమీ చెప్పలేదు.

మేము లాయర్ని కుదురుస్తామంటే ససేమిరా అంటోంది లాఖియా. అయినా ఈ ఊరిలోని ఒక మంచి లాయరుతోటి మాట్లాడేడు రాజేంద్ర. ఆత్మసంరక్షణ కోసం చేసిన నేరం గనుక శిక్షపడకుండా ప్రయత్నించవచ్చు నన్నాడతను. ఇదే విషయం నేను లఖియాకు చెపితే నామీద మండి పడింది. నేనీ ప్రయత్నం మానుకోకపోతే లాయర్ ముఖమే కాదు, నాముఖం కూడా చూడనని నిక్కచ్చిగా చెప్పింది. నా అనుమానమేమిటంటే, తన్ని కాపాడ్డానికి రణధీరే ఆ అఘాయిత్యం చేసి ఉంటాడు. అప్పుడు క్రుతజ్ఞతాభావంతో ఆ నేరం తనమీద మోపుకుంది కానీ ఇప్పుడు లాయర్ కచేరీలో డొంక కదిలిస్తే రణధీర్ బటపడతాడని తను భయపడుతోందనుకుంటున్నాను. మనకు తెలుసు ఇది కేవలం మూర్ఖత్వం అని, కానీ తనకి ఆ విషయం చెప్పేదెవరు? బహుశా రామంబాబు. ఈ ఉత్తరం చూసిన మరుక్షణమే మీరిద్దరూ బయలుదేరి వస్తారని నాకు తెలుసు. మీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము.

ఇదంతా చెప్పిన తర్వాత నా గురించి ఏమీ చెప్పబుద్ది వెయ్యటంలేదు. నా కొడుకుక్కి మొన్ననే ఏడాది నిండింది. పేరు ‘రామం బాబూ’, ఆయనకు నామాట గా చెప్పు, ‘బాదల్ బాబూ కంగారుపడక గుర్తు తెచ్చుకో, మా బాబుకి గాడ్ ఫాథర్ అవుతానని ఒక సారి మాట ఇచ్చావు’. ఏమిటో, జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. లఖియా సంగతి విని మీరు చాలా దు.ఖపడతారు ఆమెకి ఎవరిని చూడాలనీ లేదంటుంది. అయినా మిమ్మల్ని చూస్తే కాస్త మనశ్శాంతి లభిస్తుందామెకు. ఎప్పుడు వచ్చేది వైర్ చేయండి.’’

ఆ ఉత్తరం ఎలా చదివానో నాకే తెలియదు. అది పట్టుకుని అలాగే కూర్చుండిపోయాను. పిడుగులాంటి ఆ వార్త విని స్తంభించిపోయాను.

లఖియామీద దైవానికి ఎందుకింత కక్ష? అడుగడుగునా అందరూ ఈమెని ఎందుకిలా వెంటాడుతున్నారు? మొదట కట్టుకున్న భర్త, తర్వాత మామయ్య, ఆ తర్వాత గురువు, వీరందరినీ ఎందుకు పురిగొల్పాడు ఆ దేవుడు.

లఖియాని నేను ఒకసారి క్షమా భిక్ష యాచించాను. ‘‘మానవుడు నీకు చేయాల్సిన సహాయమేమైనా వుంటే నువ్వు అడుగాల్సిన మొదటి వ్యక్తిని నేనే’’ అని, అలాంటి అవకాశం లభించినప్పుడు నేనే ఏమీ చేయలేకపోయాను. ఆమె పిలుపుకి అందని చోట్ల ప్రేయసి వెంట తిరుగుతున్నాను. ప్రపంచంలో నా అనే వాళ్లు లేని ఈ అసహాయ స్త్రీ మీద సానుభూతితో నా హృద‌యం పెల్లుబికింది. సరళ మొదటి నుంచీ లఖియాకు ఎంతో సహాయం చేసింది. ఈసారి కూడా ఆమే చేయగలిగింది. సరళలో ఎన్ని దోషాలున్నా వాటినన్నింటినీ ఇది కడిగివేస్తుంది. అప్పటి నుంచి సరళ మీద నా అభిప్రాయం మార్చుగున్నాను. మూలుగా మనం చూసే స్త్రీలలా కోరికలనీ, అభిప్రాయాలనీ అణగదొక్కి బయటకి నవ్వుతూ ఆమె ప్రవర్తించదు. ఎవరన్నా భయం లేదు ఆమెకి. తన అభిప్రాయాలని నిష్కర్షగా చెప్పుతుంది. అగ్నిలాంటి హృద‌య మామెది. లోపాల్ని కప్పిపుచ్చదు. అన్యాయాన్ని సహించదు ఇలాంటి వ్యక్తి కనుకే లఖియాకి ఆమె సహాయం చేయ పూనుకుంది.

ఈ సంఘటన నుంచీ లఖియా ఆలోచనలు ఏ విధంగా సాగుతున్నాయి? పూర్వపు చిరునవ్వు అంతర్గతంలోని వెలుగు మాయ మయ్యాయా? ఆమెచేత దెబ్బ కొట్టించింది ఆ భగవంతుడే అందుకు సందేహం లేదు, తనను రక్షించుకోవటానికి చేతికందిన దానితో కొట్టి వుంటుంది. ఆ దెబ్బ తలమీదే తగలాలా? ఇలా ఆలోచిస్తూంటే హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. అసలు ఆ దెబ్బ లఖియా కొట్టలేదేమో. రణధీర్ ఆరాత్రే ఆశ్రమం వదలిపెట్టాడని సరళ రాసింది. ఆమెను రక్షించటానికి అతను కొట్టాడేమో? రణధీర్ని రక్షించటానికి లఖియా బతిమాలో ,ఆత్మహత్యచేసుకుంటానని భయపెట్టో అతన్ని పంపించి వేసిందేమో? అందరి తప్పులూ, దోషాలూ తననెత్తిన వేసుకోవడం లఖియాకి వాడుకే గాదా!

అయినా, పురుషుల దుష్ప్రవర్తన మీద అంత అవగాహన ఉన్న లఖియా ఆ దొంగ సన్యాసి నైజం గ్రహించడంలో ఎలా విఫలమయింది? ఆమాటకొస్తే అంత గడుగ్గాయి అయికూడా యశో ఎందుకు తెలుసుకొని లేకపోయింది! యశో చెవులు మూసుకుని తనను ‘సుందరీ’ అని ఎందుకు పిలవద్దందో నాకు అప్పుడు అర్థమైంది. యశో నాకు రాసిన ఉత్తరంలో ఆశ్రమంలోని సన్యాసుల సౌంధర్యారాధన నిష్కల్మషమైనదనీ, ఇతరులకు హాని చెయ్యదని రాసింది. అదే దృష్టితో గురువుగారి నోటినుండి ‘సుందరి’ అన్న పిలుపు సహించింది. ఎందుకో మొదటి నుంచీ అతడిమీద ఆమెకు భక్తి, భయమూ ఏర్పడ్డాయి. అతగాడి మాట విని నన్ను కూడా వదలుకోవటానికి సిద్ధపడింది. లఖియాయే వుండిపోయింది. చివరకు ఇలా జరిగింది. ఈ వార్త యశోకు ఎంత క్షోభ కలిగించిందో నేను గ్రహించాను.

అప్పుడు నాకు యశోని ఓదార్చాలనే భావం కలిగి తన పక్కకు చేరి నెమ్మదిగా ‘యశో’ అని తన తల నావైపు తిప్పుకున్నాను. ఆప్యాయతగా నేను తన బుగ్గల మీద తన కన్నీటిని తుడుస్తుంటే, నా చెయ్యి తీసుగున ఆప్యాయంగా నోక్కింది.

‘‘టెలిగ్రాం ఇచ్చిరండి. ఈ రాత్రే బయల్దేరుదాం,’’ అంది యశో ఆవేదనతో.

చాప్టర్ 30

ఆ మరునాడు డూన్ చేరుకునే టప్పటికి మధ్యాహ్నం మూడు గంటలయింది. స్టేషనుకు రాజేంద్ర సరళ వచ్చారు. దాయి వాళ్ల బాబుని ఎత్తుకుని వచ్చింది. పిల్లవాడు చాలా ఆరోగ్యంగా వున్నాడు. తల్లి పోలికలే వచ్చాయి వాడికి ముఖ్యంగా ఆ కళ్లు ముమ్మూర్తులా సరళవే. నేను ఎత్తుకునేటప్పటికీ ఏడుపు లంకించుకున్నాడు.

‘‘మీకు పిల్లల్ని ఎత్తుకోవటం బొత్తిగా చేతకాదు, అన్నింటితో పాటు,’’ అని యశో, బుల్లి రామంబాబుని నాచేతుల్లోంచి తీసుకుంది.

యశో వద్ద కూడా ఊరుకోలేదు వాడు. తల్లికేసిఉర్ర్ల్ చాచగా కొడుకుని తనదగ్గరకు తీసుకుంది సరళ.

‘‘నీక్కూడా పిల్లల్ని లాలించటం చేతకాదు యశో. అయినా పిల్లలు ఇంట్లోలేందే ఎలా చేతనవుతుంది. అందుచేత ....’’ అవి సరళ నవ్వుతూ ఆగిపోయింది.

‘‘ఎందుకులేరు సరళా? వీరులేరా, పది మంది పిల్లల పెట్టు,.’’ అంది యశో కూడా నవ్వుతూ.

నాకు కాస్త కోపం వచ్చింది. నా మనస్సంతా లఖియా మీద లగ్నమైంది. అలాంటి సమయంలో ఈ పరాచకాలేమిటి?

‘‘అయితే ఇక పదండి ఆలస్యమవుతుంది. ఇంటికి వెళ్లి సామాను పడేసి వెళ్దామా లేక తిన్నగా లఖియా వద్దకు వెళ్దామా చెప్పండి రామంబాబూ,’’అన్నాడు రాజేంద్ర నా భావాల్ని గ్రహించినట్లు.

‘‘తిన్నగానే వెళ్దాం రాజేంద్రబాబూ. మళ్లీ ఇంటికి వెళ్లి తిరిగి రావటం ఎందుకు?’’ అన్నాను.

మేమందరం, బుల్లి బాబు, దాయిలతో సహా, రాజేంద్ర కారులో బయలుదేరాము. దారిలో చాలాసేపటి వరకు మౌనంగానే ఉన్నాము. కాసేపటికి యశో సరళ ఏదో రహస్యాలు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు నా గురించి చెప్పటానికి ఎవరూ దొరకలేదు. ఎంతో కాలం పోయిన తర్వాత ఈ సరళ లభించింది. తీర్థయాత్ర విశేషాలు చెబుతూందని గ్రహించాను.

మేము డూన్ జైలు చేరేక సరళ తన కొడుకుని దాయితో వదలి, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిన పిదప మమల్ని లోపలికి తీసుకెళ్లింది.

అదే ఖైదీలను కలుసుకోనిచ్చే గది.. అప్పుడా గదిలో ఇద్దరున్నారు - ఒక స్త్రీ ఒక పురు షుడు. ఆ స్త్రీ ఒక కుర్చీమీద కూర్చునివుంది. పురుషుడు ఆమె కాళ్లమీద పడి వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. ఆమె శిలా ప్రతిమలా వుంది. చేతనారహితంగా కళ్లలోంచి నీరు కారటంలేదు. తిన్నగా గోడకేసి రెప్పవాల్చకుండా చూస్తూంది. ఇంతలో లోపలినుంచి పోలీసు వచ్చి లాఠీతో తలుపుమీద మూడు దెబ్బలు కొట్టాడు. ఆ స్త్రీ హఠాత్తుగా లేచినించుంది. ఆమె లేచినా పురుషుడు అలాగే కింద కూర్చున్నాడు ఏడుస్తూ. ఒక్కమాటైనా మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయింది ఆ స్త్రీ. కాసేపు పోయినతర్వాత అతను కూడా వెళ్లిపోయాడు. అలాగే ఏడుస్తూ...

ఇదంతా మేము గుమ్మంవద్ద నుంచి చూస్తున్నాము. వీరిద్దరి మధ్యవున్న నిగూఢ రహస్యం ఏమిటి? నేరం చేసింది స్త్రీ అని స్పష్టంగా తెలుస్తూంది. అయితే అతను ఎందుకు అలా ఏడుస్తున్నాడు? ఆమె హృద‌యంలో దయా, దాక్షిణ్యం, కరుణ, కన్నీరు ఇవన్నీ ఎగిరి పోయాయా? ఇంకొక విషయం ఏమిటంటే స్త్రీ ఇంకా ప్రౌఢ వయస్సులోనే వున్నట్టుంది. చూడటానికి ఇప్పుడు ఏమంత బాగులేదు కాని ఒకప్పుడు అందంగా వుండివుండాలి. పురుషుడు యవ్వనం వదిలి చాలా కాలం అయినట్లు కనబడుతూంది. వీరిద్దరి మధ్యా సంబంధమేమై వుంటుంది. భార్యభర్తలా? అన్నా చెల్లెలా? తండ్రి కూతురులా? మూడవది అయివుండదు. మొదటి రెండిటిలో ఏదైనా కావచ్చు. లేకపోతే యే అన్యాయం చేసిన పరదేశీయో ఈ పురుషుడు. తప్పు తెలుసుకున్నాక క్షమాభిక్ష వేడుకుంటున్నాడేమో, అయితే ఈమెలో క్షమాగుణం కూడా అడుగంటి పోయిందా?

మేము లోపలికి వచ్చి అక్కడ ఒక బల్లమీద కూర్చున్నాను. లఖియా చాలా లోపలి నుంచీ రావాలి. అందుకు కాస్త ఆలస్యమవుతుందని చెప్పింది సరళ. ఆ కాస్తసేపు కొన్ని యుగాల్లా గడిచాయి. నేను పరధ్యానంగా కిటికీలోంచి బయటకు చూస్తూన్నాను. ఎవరో వస్తున్న చప్పుడైనట్లు వినబడి నా ద్రుష్టి గుమ్మంవైపు మరల్చేటప్పటికి అక్కడ లఖియా నిలబడివుంది, మాసిన తెల్లటి చీరలో పాత దుప్పటి కప్పుకుని తలమీదకు లాక్కుని. ముఖంలో ఆ అందం అలాగేవుంది. కాని కళ్లలోంచి ఏదో మాయమైనట్టనిపించింది నాకు. నాకప్పుడదేమిటో సరిగ్గా తట్టలేదు. బహుశా నిశ్చలతయేమో.

యశోని నన్ను చూసి లఖియా క్షణకాలం ఆశ్చర్యపోయింది. తన శక్తినంతా వినియోగించి ఒక చిరునవ్వు నవ్వింది. ఆ మందహాసానికి నేను తట్టుకోలేకపోయాను. ఒకసారి ఆమె కాళ్లమీదపడి ఇందాకా ఆ పురుషుడు ఏడ్చినట్టు ఏడవాలనిపించింది. ఏకాంతంగా వుంటే బహుశా అలాగే చేసేవాడినేమో. అలా అయితేనా హృద‌యంలోని భారం తీరును. వీరందరి ఎదుటా నేనలా చేయలేను.

‘‘ఎప్పుడు వచ్చారు మీరు యశో, చాలాకాలమైంది. మిమ్మల్ని చూసి’’ అంది లఖియా.

మరుక్షణంలో యశో లఖియా పాదాల మీద పడిపోయింది. లఖియా ఆమెను పట్టుకుని హృద‌యానికి హత్తుకుంది. కొన్ని క్షణాలు అలాగే గడిచాయి.

‘ఇప్పుడే వచ్చాం, సరళ ద్వారా నిన్ననే తెలుసుకున్నాం,’ అంది యశో నెమ్మదిగా లఖియాని వదలి.

‘‘రామంబాబూ, మళ్లీ కలుసుకోమేమోనని భయపడ్డారుకదూ చూడండి ఎంత త్వరలో కలుసుకున్నామో,’’ అంది లఖియా నాకేసి చూసి నవ్వుతూ.

కాసేపు నేనేమీ సమాధానం చెప్పలేదు. ఆ సమయంలో ఏమనాలో తెలియడంలేదు.

‘‘రెండు సంవత్సరాలు లఖియా,’’ అప్రయత్నంగా అని, ‘‘ఈలోపున చనిపోయినా బాగుండేది,’’ అన్నాను హృద‌యంలోని ఆవేదన భరించలేక

లఖియా ముఖం క్షణకాలం మేఘావ్రుతమైంది.

‘‘అలాంటి మాటలు ఎప్పుడూ అనకండి రామంబాబూ. యశోకు ఎంత బాధ కలుగుతుందో గ్రహించలేరా? నాకూ కష్టంగా వుంటుంది,’’ అంది.

అవును నిజమే, ఆవేశాలను అణచుకోవాలి. లఖియాని చూడటానికి వచ్చింది ఆమెకు కాస్త సంతోషం చేకూరుద్దామని ఆమెని కష్టపెట్టడానికి కాదు.

‘‘ఏనాడూ నీ కష్టకాలంలో ఆదుకోలేకపోయాను, ఈనాడైనా నాకా అవకాశమియ్యి లఖియా,’’ అన్నాను.

‘‘మీకు నేనిచ్చిన మాట మరచిపోలేదు రామంబాబూ. కాని ఇందులో ఇతరుల సహాయం వల్ల జరిగేదేమీ లేదు. ఎవరి చేష్టల ఫలితం వారనుభవించాల్సిందే,”

“అదంతా సరే, నాదొక కోరిక తీరుస్తావా?’’ అన్నాను.

‘‘చెప్పండి, నేనే చేయగలదవుతే చేస్తాను. కానీ వాగ్దానం చేయలేను,’’ అంది.

‘‘నిన్ను ఇక్కడ నుంచి విడిపించి మాతో తీసుకుపోతాము. శేషజీవితమంతానువ్వు మాతోనే గడపాలి,’’ అన్నాను.

మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికది. అంతకుముందు దీనిని గురించి ఆలోచించలేదు, అలాంటి ఆలోచన తట్టినందుకు నాకు ఎంతో ఆనందం కలిగింది.

‘‘ఈ కోరికను తోసిపుచ్చకు లఖియా అంతకంటె వారినీ, నన్నూ సంతోషపరిచేదింకేమీ లేదు. నా కోసం కాకపోయినా, వారికోసమైనా, అవుననూ లఖియా,’’ అంది యశో కూడా వెంటనే.

లఖియా ఇంకా ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా వెళ్లి కూర్చీలో కూర్చుంది.

‘‘ఆనాటి నీ జీవితంలో దుఃఖపునాదులు అంతరించిపోయాయి లఖియా జీవితంలో పూర్తిగా కష్టాలే అనుభవించావు నీవు. ఈనాటితో వాటికి స్వస్తి చెప్పాలి. నిన్ను మా కులదైవంగా చూసుకుంటాము,’’ అన్నాను ఆమె మనస్సు మారిపోతుందేమోనన్న భయంతో.

లఖియా ఎంతో బలవంతాన కన్నీరు ఆపుకుంటూంది. క్షణకాలం క్రింది పెదిమ వణికింది.

‘‘అలాంటి మాటలనకండి రామంబాబూ. మీరూ, యశో, సరళా ఈ దీనురాలిమీద చూపుతున్న దయకూ ఎప్పుడూ అంతులేదు. ఇప్పుడు రాజేంద్ర బాబు నాపట్ల చూపుతున్నఆదరణకు నేనెంతో ఋణపడున్నాను. మీరందరిని భగవంతుడు కాపాడుతాడు, తన నుంచి నేను కోరుకునే అంతిమ కోరిక ఇదే. మీకు కష్టాన్ని కలిగించటం నాకు ఇష్టం కాదు. అయినా మీరన్నది చాలా అసమంజసము. జీవితంలో మనకు అనేక మంది తటస్థపడుతూంటారు. వారిలో కొంత మంది సన్నిహితులవుతారు; కొంత మందిని ప్రేమిస్తాము; చివరికి ఎక్కడో అక్కడ ఎవరి దారిని వారు పోవాలి. ఇది భగవత్ నిర్ణీతమైంది. దీనికి మీరూ, నేనూ ఏమీ చేయలేము,’’ అంది లఖియా.

ఈ మాటలంటూంటే సరళ నా కళ్లల్లోకి చూసింది. ఇదే మాటలు నేనొకసారి ఆమెకు చెప్పాను. మమ్మల్ని వదిలిపెట్టలేక మమతతో బాధ పడుతూంటే ఆమెకు సహన శక్తి ఇవ్వటానికి చేసిన ప్రయత్నం మది, ఈనాడు భగవంతుడు పగబట్టి ఈ అనాధ స్త్రీని రక్షించుకోవటానికి ప్రయత్నిస్తూంటే అవే మాటలు లఖియా వెంట వచ్చాయి.

‘‘అలాంటి మాటలన్నావంటే మళ్లీ ఎప్పుడూ ఇక్కడికి రాము లఖియా,’’ అంది సరళక కోపంగా.

‘‘అన్నీ మన ఇష్టప్రకారమే జరగవు సరళా? కారాగారవాసం కోరుకుంటే వస్తుందా? అయినా ఇదేమంత చెడు ప్రదేశం కాదు. శ్రీ కృష్ణుని జన్మస్థానం ఇదే,’’ అంది లఖియా నీరసంగా నవ్వుతూ.

లఖియా తన దుఃఖాన్ని దిగ మింగడమే కాక ఇతరుల ఇబ్బందులను పసిగడుతుంది

‘‘నన్ను మీరు క్షమించాలి రాజేంద్రబాబూ; రామంబాబూ, యశో మాటలలోపడి మిమ్మల్ని కించపరిచాను’’ అంది లఖియా అప్పుడు అతనితో

‘‘అలా అనుకోకు లఖియా,’’ అన్నాడు రాజేంద్ర.

అప్పుడే లోపల్నుంచి పోలీసు వచ్చి తలుపు మీద లాఠీ కొట్టాడు, ఇరవై నిమిషాలు గడువైపోయింది. లఖియా ఇంక తిరిగి పనిలోకి వెళ్లిపోవాలి.

‘‘నువ్వు ఏకాకివికావని గుర్తుంచుకో. నీ ఆలోచనా పర్యవసానం గ్రహించుకో. మళ్ళీ వచ్చికలుస్తా,’’ అంది యశో.

‘‘నేనే అఘాయిత్యం చేయనులే యశో, అయినా నా గురించి ఆలోచించి, ఆలోచించి మీ మనస్సు పాడుచేకోకండి. ముఖ్యంగా మీరు రామంబాబూ. నా గురించి మీరేమీ చింతించకండి.,’’ అంది లఖియా.

పోలీసువాడు మళ్లీ తలుపుమీద కొట్టాడు. లఖియా లేచి నించుని గుమ్మంవైపు నడిచిపోతూ అంది, ‘‘సరళా. బాబు కులాసాగా వున్నాడా?’’

జవాబు కోసం క్షణకాలం గుమ్మం వద్ద ఆగింది లఖియా.

సరళ గబగబా ఆమె వద్దకు వెళ్లి బుగ్గమీద నెమ్మదిగా ముద్దుపెట్టుకుంది.

‘కులాసాగానే వున్నాడు లఖియా, మళ్లీసారి తీసుకొస్తా,” అంది సరళ.

లఖియా గుమ్మం వద్ద ఆగినఒక్కక్షణం కూడా వృధా చెయ్యబుద్ధి కాలేదు.

లఖియా గుమ్మం దాటింది. లోపలికి వెళ్లేదారి ఒక పొడుగాటి బాట. పొడుగైన వరండాలోంచి పోవాలి. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడిచిపోతూంది. ఆమె పక్కన భుజానికి తుపాకీ తగిలించుకుని పోలీసువాడు నడుస్తున్నాడు. ఆ దృశ్యం నా హృద‌యంలో హత్తుకు పోయింది. లఖియా పారిపోకుండా చూడటానికి వాడు ఆమె ఛాయలా ఫాలో అవుతున్నాడు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే నా రక్తం వుడికింది. మానవత్వానికే ఒక మాయని మచ్చ. భూకంపం వచ్చి ఆ జైలంతా పడిపోయినా, అక్కడి వారంతా చనిపోయినా ఆమె అక్కడ నుంచి కదలదు. సీతా దేవిలాగ భూదేవి ఈమెను కూడా తన ఆలింగనంతో ఇమడ్చుకోవాలి. ఆమె అంతుకి అంతకంటే మార్గం లేదు.

అంతా రెప్పవాల్చకుండా నడచిపోతూన్న ఖైదీని చూస్తున్నాం. కొంత దూరం నడచి మలుపు తిరిగి మాయమైంది. ఆమె అడుగుల్లో తొట్రుపాటులేదు. మా అందరి కళ్లెదుట ఆ ద్రుశ్యం అంతరించి పోయింది. ఒకసారైనా వెనుదిరిగి చూస్తుందేమోనని ఆశించాము. మలుపు దగ్గిర క్షణకాలం ఆగినట్టనిపించింది. కాని వెనుదిరక్కుండానే ముందుకు సాగిపోయింది. వెనుదిరగటమనేది ఆమె స్వభావానికే విరుద్దమని నేను ఆనాడు గ్రహించాను. కష్టాలు తండోపతండాలుగావచ్చి మీదపడినా ఈ ఆబల చెక్కుచెదరదు. కన్నీరు కార్చదు. ఇంత జరిగినా ఆమెకు భగవంతుని మీద విశ్వాసం అచంచలంగా వుంది. తన కష్టాలకు కారకుడైన అతగాడినే కొలుస్తూంది. లఖియానుంచి నేను నేర్చుకున్నది ఒక్కటేవుంది. అదేమిటంటే జీవితంలో ప్రతి మానవుడు దేనినో దానిని విశ్వసించాలి. అది ఏదైనా కావచ్చు. దైవమే అయివుండనక్కర్లేదు. తల్లిగర్భంలోంచి జన్మించినప్పటి నుంచీ చనిపోయేవరకూ నేనే నాస్తికుడిని అని చెప్పగలిగిన వారెంతమంది వున్నారు. సరళకు భగవంతునితో నిమిత్తం లేదు. అతగాడంటే భయంతో ఆమె ఏపనీ చెయ్యదు. తనకు తోచినట్లు తాను చేస్తుంది. అది అక్షరాలా నిజం. ఏదో ఒక సమయంలో ప్రతి మానవుడు దైవాన్ని ప్రార్థిస్తాడు. తను ప్రేమించిన వ్యక్తిని కోల్పోయే సమయంలో కన్నీరు కారుస్తూ చేతులు జోడిస్తాడు. తన ప్రార్థన మాత్రంతో వారిని తను రక్షించుకోలేదు. అయినా అలా చేస్తాడు.

బరువైన హృద‌యాలతో మేము వెనుదిరిగాము, బయటకు వస్తూంటే యశో ఒక చేత్తో నా చెయ్యి, ఇంకొక చేత్తో సరళ చెయి పట్టుకుంది. సరళ తన రెండో చెత్తో రాజేంద్ర చేయి పట్టుకుంది. నలుగురుమూ కారువైపు నడిచాము, దాయి వడిలో బాబు సుఖంగా నిద్ర పోతున్నాడు.