The shadow is true - 7 books and stories free download online pdf in Telugu

నీడ నిజం - 7

అ గ్రామం లో గాలి దుమారం లా పరుగులు తీసి ఊరికి మరో చివరికి వచ్చింది. అక్కడ రాజమహల్ లా కనిపించే ఒక భవనాన్ని చూసి కదిలిపోయింది. బాధ, భయం, ఉద్వేగం, ఉద్రేకం- ఒక్కసారి కలగలిసి సాగర్ర కెరటాల్లా ఆమె ను చుట్టూ ముట్టాయి.

ఆ తాకిడికి తట్టు కోలేక స్పృహ తప్పింది. సుదర్శనం డాక్టర్ గా ఆమె రక్షణ బాధ్యత తీసుకున్నాడు.

వెంటనే అందరూ తిరుగు ప్రయాణ మయ్యారు. దారిలో ఎవరూ మాట్లాడుకోలేదు. ఎవరి ధ్యాసలో , ఆలోచన లో వారుండి పోయారు.

విద్యాధరి రాక, ప్రతి కదలిక గ్రామ వాసుల్లో కలకలం, కలవరం రేపాయి. ఆమె ఏనాడో గతించిన "కోమలా దేవి" అన్న నిజం వారికీ అసలు మింగుడు పడలేదు. ఈ అద్భుతం వారికి దైవ ఘటనగా తోచింది. ఆమె దైవాంశ సంభూ తురాలు అన్న భావన వారి మనస్సులో బలం గా నాటుకుంది. ఎవరికీ తో చిన విధం గా వారు ఆమె గురించి కధలు కధలు గా చెప్పుకోసాగారు.

విద్యాధరి గ్రామం లో వృద్ధుడి తో మాట్లాడినప్పుడు భరత్ రామ్ కొంతవరకు ఫాలో కాగలిగాడు. ఓ మనస్తత్వ నిపుణుడిగా ఆమె కమోషన్స్, ఎమోషన్స్ ఊహించగలిగాడు. వృద్ధుడి తో సంభాషణ ముగిశాక విద్యాధరి వాలకం లో , వైఖరి లో ఊహించని మార్పు కనిపించింది. ఆమె పూర్తిగా ఆనాటి కోమలా దేవి గా మారిపోయింది. తను విద్యనన్న స్పృహ ఆమె లో అణు మాత్రం మిగల లేదు. ముఖం లో ఓ వింత కాంతి, కళ్ళల్లో ఎర్ర జీరలు, ప్రతి మాటలో , కదలిక లో సమూలమైన మార్పు పూర్తిగా గ్రామీణ స్త్రీ లా వ్యవహరించటం -ఆమె చుట్టూ చేరిన వారికీ ఈ వింత లక్షణాలు మతులు పోగొట్టాయి. భరత్ రామ్ ఓ డాక్టర్ గా ఆమె కేసు స్టడీ చేస్తున్నా , ఓ సామాన్యమైన వ్యక్తిగా సంభ్రమానికి లో నయ్యాడు. మనసు గల మనిషిగా అయన హృదయం కదిలింది. అతీత శక్తి పై విశ్వాసం పెరిగింది. సుదర్శనం ఇలాంటి అసాధారణ విషయాలు అంత తేలిగ్గా నమ్మడు. కానీ తన కంటి ముందు జరిగిన ఈ అద్భుతం తో ఆయన నివ్వెర పోయాడు. సుదర్శనం ను చూసి భరత్ రామ్ మనసులో నవ్వు కొన్నాడు.

శాంతిలాల్, మనోహర్ సింగ్ సామాన్యులు. వారి మానసిక పరిధి ,విషయ పరిజ్ఞానం ధారణాశక్తి,. అవగాహన కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి. ఆ పరిమితులకు తగినట్లే వారి ఆలోచనలు సాగాయి.

వీరందరికీ భిన్నమైనది సాగర్ మానసిక స్థితి. విద్యాధరి తో భర్తగా జీవితం పంచుకున్న సాగర్ ఆమె లో కోమలా దేవిని చూడలేక పోతున్నాడు . తన నుండి ఆమె ను ఏదో అదృశ్య శక్తి దూరం చేస్తున్నట్లు అతడి భావన. ఆ భావన అతడిని కల్లోల పరుస్తోంది. తీవ్ర మానసిక సంగర్షణ తో సాగర్ కదిలి పోయాడు.

విద్యాధరి తేరుకుంది. ఆమె లో కోమలా దేవి ఛాయలు కనిపించటం లేదు. అందరి తో మాములుగా మాట్లాడింది. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా సాగర్ కు కొండంత రిలీఫ్ .

భరత్ రామ్ సూతింగ్ వర్డ్స్ విద్యాధరిని శాంత పరిచాయి. నాటి అనుభవాలు, విశేషాలు, సంఘటనలు వివరించమన్నాడు. అందువల్ల ఆమెకు కొంత మానసిక ఒత్తిడి తప్పదు. కానీ—ఆమె మెంటల్ కమోషన్ కు కారణం తెలుసుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం .

విద్యాధరి కాసేపు మౌనం గా ఉండిపోయింది. మనసును ముసురుకుంటున్న ఆలోచనలు క్రమక్రమంగా ఒక రూపం సంతరించుకుని నాటి సంఘటనల రూపం లో వెలువడసాగాయి.

“ మాది రాజస్థాన్ లో ఓ మారుమూల గ్రామం. అమ్మ,నాన్న,నేను-ముగ్గురమే. పేద కుటుంబం. నాన్న సన్నకారు రైతు. వ్యవసాయం పై సంపాదన చాలక కూలి పనులకు కూడా వెళ్ళేవాడు. సంతోషంగా, తృప్తిగా జీవించాలంటే పేదరికం అడ్డు కాదని , శాపం కాదని మా నాన్న అక్షరాల నిరూపించాడు. పేరుకు తగినట్లే నేనూ చాల చక్కగా ఉండేదాన్ని. అందుకే అంత పేదరికం లో కూడా ఏ లోటు రానీకుండా అమ్మా, నాన్నా చాల అపురూపం గా చూసుకున్నారు. కానీ—నా రూపం మా కుటుంబానికి పెద్ద శాపమైంది. అభినవ కీచకుల నుండి నన్ను కాపాడటం సమస్య అయింది. మా పేదరికాన్ని ఆసరాగా తీసుకొని నా పై కన్నేసిన వారిని నేనూ ధైర్యం గా ఎదుర్కునేదాన్ని. అ ధైర్యం , తెగువ మా నాన్న ద్వారా నాకు సంక్రమించాయి. మా నాన్న ఏ సమస్య నైనా ఆత్మబలం తో ఎదుర్కునేవాడు.....’ విద్యాధరి క్షణం ఆగింది. అందరూ తమ ఉనికినే మరిచి వింటున్నారు. “....ఒకసారి మా ప్రాంతం లో భయంకరమైన కరువు వచ్చింది. ఎక్కడా నీటి బొట్టు కనిపించలేదు. గొంతు తడుపుకోవటమే గగనమైంది. ముఖ్యంగా మాలాంటి పేదవాళ్లకు మనుగడే కష్టం కాగా నీటి ఎద్దడి అంతగా లేని ప్రాంతాలకు వలసపోసాగాం. ....నిప్పులు చెరిగే ఎండలో మజిలీ తెలియని పయనం . ! వడదెబ్బకు ఎందఱో పిట్టల్లా రాలిపోయారు. వారిలో నాన్న కూడా వున్నాడు. .....” బాధతో విద్యాధరి కళ్ళుమూసుకుంది. కళ్ళతడి, చెంపలు తడిశాయి. భరత్ రామ్ ఆమెలో జీవం పోసుకుంటున్న కోమలా దేవిని స్పష్టం గా చూడగలుగు తున్నాడు. ఆమె మనోనేత్రం ముందు కదలుతున్న నా టి సంఘటనల తీవ్రత మొహం పై సింధూర వర్ణమైంది.

ఇంటి పెద్ద అకాల మరణం తో కోమల ఆమె తల్లి దిక్కు లేని వారైనా రు. ఎటు వెళ్ళాలో, ఎలా బతకాలో తెలియటం లేదు. ఆత్మహత్య చేసుకుంటామంటే ధైర్యం చాలటం లేదు. మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు. ఇలాంటి స్థితి లో వారికీ ఓ అరుదైన ఆశ్రయం లభించింది. ఒక గ్రామంలో సంపన్నుల ఇంట్లో తలదాచుకునే అవకాశం . ఆ గ్రామం లో కరువు పరిస్థితు లంతగా లేవు. ఆ ఊరిని కాపాడుతున్న జలాశయం లో నీరు చాలినంత ఉంది. అ నీరే ప్రజలను కాపాడుతుంది.

ఆ గ్రామ పెద్ద విక్రం సింహ కోమలకు, ఆమె తల్లికి ఆశ్రయం ఇచ్చాడు. తరతరాల రాజపుత్రుల శౌర్యానికి , దానగుణానికి అతడొక చక్కటి ప్రతీక. మంచితనం, మానవత్వం విక్రం ఊపిరి. సంప్రదాయం, సదాచారం అయన లోగిలి లో అణువణువునా కనిపిస్తుంటాయి. వారి వంశ మూల పురుషుడు పృథ్వీ రాజ్ చౌహాన్ కాలం లో ఓ సామంత రాజు గా వెలిగాడు. చౌహాన్ రాజ్య పతనం తరువాత కొంతకాలం వారి ప్రాభవం కొనసాగింది. రాను రాను వారి ఉనికి తెరమరుగై ఆనాటి చరిత్ర కు అవశేషం లా ఆ గ్రామం లో ఓ మహల్, వారసులు మిగిలారు.

విక్రం సింహ్. చాలా ఎత్తు మనిషి. కండలు తిరిగిన ఉక్కులాంటి శరీరం. చూపుల్లో గాంభీర్యం, మాటల్లో సంస్కారం, చేతల్లో మెరుపులా మెరిసే మానవత్వం-విలక్షణమైన వ్యక్తిత్వం. ఆ లంకంత లోగిలి లో కోమలాదేవి, ఆమె తల్లి కాస్త ఉపిరి పీల్చుకున్నారు. వారికీ భవిష్యత్తు పై కాస్తంత ఆశ చిగురించింది.

విక్రం సింహ్, అతడి ఇద్దరి తమ్ముళ్లు ఆ గ్రామానికి మకుటం లేని మహారాజులు. ఆ ఊరిలో వారి మాటకు తిరుగు లేదు. ముఖ్యం గాఆ ఊరి ప్రజలకు విక్రమ్ సింహ్ దేవుడు. అతడు కనుసైగ చేస్తే చాలు వారు కారణం అడగకుండా నిప్పుల్లో నైనా దూకుతారు.

విక్రం సింహ్ సామాజిక జీవితం ఎంత ఆదర్శవంతం గా , ఉత్సాహం గా ఉంటుందో అందుకు భిన్నం గా వ్యక్తిగత జీవితం అంత నిస్సారం గా ఉంటుంది.

విక్రం సింహ్ జీవితం లో భార్యా వియోగం ఒక నీలి నీడ . అతడి వైవాహిక జీవితం మరపు రాని కలలా మిగిలి పోయింది. అతడి భార్య పండంటి మగ బిడ్డను కని, దాంపత్య జీవితానికి గుర్తుగా మిగిల్చి , ప్రసవ వేదన కారణం గా తను తప్పు కుంది. అంతే, అతడి జీవితం లో వెన్నెల అంతరించి పోయింది. తిరిగిరాని అర్ధాంగిని క్షణం క్షణం తలుచుకుంటూ తిమిరం తో సమరం సాగిస్తున్నాడు. విక్రం తల్లికి కొడుకు శాపగ్రస్త జీవితం సమాధానం లభించని శేష ప్రశ్న లా మిగిలి పోయింది.

గృహలక్ష్మి లేని ఆ లంకంత ఇంటిలో విక్రం కొడుకు రాహుల్ ఓ పిల్ల తెమ్మెర -ఆశాకిరణం. అతడి ఆటపాటలతో అ లోగిలి కాస్త సందడిగా ఉంటుంది.

రాహుల్- పాలుగారే పసివాడు. – చక్రాల్లా ఉంటాయి కళ్ళు, ఉంగరాల జుట్టు, లేత తమలపాకులా సున్నితంగా ఉంటాడు. ప్రతి చిన్న విషయం వివరంగా తెలుసుకోవాలన్న కుతూహలం అ మెరుపు కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది.

అ ఇంట్లో అడుగు పెట్టిన కొద్ది రోజులలోనే రాహుల్ కోమలాదేవి కి మంచి నేస్తంయ్యాడు. అతడు అడిగే ప్రతి ప్రశ్న కు కోమల తనకు తెలిసినంత వరకు ఓపిగ్గా జవాబులు చెప్పేది.

ఆ ఇద్దరి స్నేహం ఆ ఇంట్లో అందరికి ఆనందం కలిగించింది . కోమలాదేవి రాక తో రాహుల్ చలాకి గా, ఉత్సాహంగా కనిపించసాగాడు. ఈ మార్పు ముఖ్యం గా విక్రం సింహ ను కదిలించింది. తల్లి దూరమై మాతృత్వం లో మధురిమలు ఆస్వాదించలేని రాహుల్ కు కోమలాదేవి ఓ వరం లా అనిపించింది. ఈ కారణం గా విక్రం సింహ కోమల ను ప్రత్యేకమైన శ్రద్ధ తో ఆదరణ గా చూసేవాడు .

అ ఇంటిని ఓ తీరని సమస్య పట్టి పీడిస్తోంది. విక్రం కు మళ్ళీ పెళ్లి చేయాలని అతడి తల్లి ఆరాటం. కానీ- విక్రం సింహ పునర్వివాహానికి సుముఖం గా లేడు. తన భార్య స్థానం లో మరొకరిని ఉహించలేక పోతున్నాడు. పైగా రాహుల్ కు సవతి తల్లి పోరు కలిగించటం ససేమిరా ఇష్టం లేదు. అందుకే తల్లి ప్రశ్నలకు మౌనమే సమాధానం అనుకున్నాడు. పెళ్లి ప్రస్తావన అతడికి తలనొప్పిలా తయారైంది. కానీ- పెద్దవాడి పెళ్లి జరగందే అ ఇంట్లో శుభకార్యం జరగరాదని తల్లి పట్టుదల. ఇలా అభిప్రాయాల కలవని

చిత్రమైన పరిస్థతి లో తల్లీ కొడుకులు కాలాన్ని భారం గా దొర్లిస్తున్నారు.

ఇలాంటి నేపధ్యం లో ఓ అనుకోని సంఘటన జరిగింది. అ సంఘటన విక్రం జీవితాన్ని ఉహించని మలుపు తిప్పింది. ఒకరోజు నీళ్ళు తేవడానికి కోమల ఊరిచెరువు కు వెళ్ళింది. రాహుల్ కూడా సరదాగా ఆమె తో వెళ్ళాడు.

నీలాంటి రేవు ఆడవాళ్ళ నవ్వుల తో , కేరింతల తో సందడిగా ఉంది . కోమల ఎదో ఆలోచిస్తూ చెరువు గట్టునే కాసేపు నిలబడి పోయింది. చేతిలో పాత్ర చేతిలోనే ఉంది. రాహుల్ ను గమనించలేదు .


************************************************

కొనసాగించండి 8లో