The shadow is true - 9 books and stories free download online pdf in Telugu

నీడ నిజం - 9

తల్లి మనోవేదన చూసి కూడా వారు కదలలేదు.మెదలలేదు.తమ వైఖరి మారదన్నట్లు మౌనంగా వుండిపోయారు.

విషయం తెలిసి విక్రమ్ బిగుసుకు పోయాడు.తనంటే ప్రాణం పెట్టే తమ్ముళ్ళే తన నిర్ణయాన్ని హర్షించలేక పోతున్నారు. ఇప్పుడు తనేం చేయాలి ? తమ్ముళ్ళ కోసం తన నిర్ణయాన్ని వెనక్కు తీసికోలేడు. అలాగని తమ్ముళ్ళను ఒప్పించ లేడు. తన అవసరం తనది.వారి ఆలోచనలు,అభ్యంతరాలు వారివి. రెండూ సమాంతర రేఖలు.

తమ్ముళ్ళను పిలిచాడు. తమ ప్రవర్తన కు అన్ని గట్టిగా మందలిస్తాడని వారూహించారు. అన్నకు ఏ సమాధానం చెప్పాలో వారికి అర్ధం కాలేదు. అన్నను ఎదిరించలేరు..ఆయన నిర్ణయాన్ని ఆమోదించలేరు. చిత్రమైన పరిస్దితి.

“...కోమలి తో నా వివాహం మీకు నచ్చలేదు. అందుకు మిమ్మల్ని తప్పు పట్టను. నా కోసం మీరు దిగి రావాల్సిన పని లేదు. మీ అభ్యంతరాలు మీవి.నా సమస్య నాది. మనది రాజవంశం.మన చరిత్ర గొప్పదన్న స్పృహ నాకూ వుంది...ఈ పరగణాన్ని. శాశిస్తూ అందరికీ ఆదర్శంగా వుండే మనం నియమం తప్పటం తప్పని నాకూ తెలుసు..కాని అన్నింటికన్నా, అందరికన్నా నాకు రాహుల్ ముఖ్యం. వాడిని కాదని నేనీ నియమాలకు కట్టుబడ లేను. రాహుల్ కోమలా దేవిలో అమ్మను చూశాడు.ఆమెకు రాహుల్ అంటే సానుభూతి,ప్రేమ.ప్రాణాలకు తెగించి వాడిని కాపాడింది.కేవలం వాడికోసమే ఈ వివాహం చేసికొన్నాను. ".క్షణం ఆగాడు విక్రమ్.అన్న ఇంత ప్రశాంతంగా, ముభావంగా ఉన్నాడంటే ఆయన మనసులో ఏదో గట్టి నిర్ణయమే వుంది.తను ఏం చెబుతాడో అన్న కంగారు వాళ్ళ కళ్ళ ల్లో స్పష్టంగా కనిపిస్తుంది.” నా మీద గౌరవంతో , అభిమానంతో మీరు కోమలను వదినగా అంగీకరించవలసిన అవసరం లేదు.నా కోసం మీ నమ్మకాలు, కట్టుబాట్లు వదులుకోవద్దు.లోకం దృష్టిలో నే కాదు . అందరి దృష్టి లో నేను పద్ధతి. తప్పాను. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి." క్షణం ఆగాడు విక్రమ్. లోకం దృష్టిలో నేను దోషిని.ఈ పరగణాలు, పంచాయితీ కి పెద్దగా వుండలేను....అజయ్! ఈ క్షణం నుండి ఆ బాధ్యత నీది. రేపే గ్రామ సభలో నా నిర్ణయం ప్రకటిస్తాను.ఈ ఊరికి దూరంగా మన పొలంలో తాతగారి వేసవి విడిది కోసం కట్టిన చిన్న

లో గిలిలో నా కుటుంబం తో ప్రశాంత జీవితం గడుపుతాను. అమ్మ బాధ్యత పెద్ద కొడుకుగా నేనే తీసి కోవాలి.కాని మీ పెళ్ళిళ్ళు జరిగేంతవరకు. అమ్మ మీ దగ్గరే వుండాలి.అంత వరకు ఆమె మనసు కష్ట పడకుండా చూసుకోవలసిన బాధ్యత మీది.

విక్రమ్ నిర్ణయం తమ్ముళ్ళకు ఆశనిపాతమైంది.తల్లి కూడా ఈ అనూహ్య పరిణామానికి అవాక్కైంది. కొడుకు తమ్ముళ్ళను మందలిస్తాడనుకుంది.కాని తనే వారి మాటలకు విలువ ఇచ్చి తప్పుకుంటున్నాడు. దీన్ని సంస్కారం అనుకోవాలో,సాధింపు అనుకోవాలో ఆమెకు అర్ధం కాలేదు.

గ్రామ సభలో విక్రమ్ తన స్థానం నుండి తప్పుకుని అజయ్ కు పెద్దరికం కట్టబెట్టటం ఎవరికీ నచ్చలేదు.అజయ్ ఎప్పటికీ విక్రమ్ కాలేడు.అంతటి వాడు సాంఘిక నియమం తప్పి

కోమలను వివాహంచేసుకున్నాడన్న చిరు కోపం ,అసంతృప్తి. గ్రామ పెద్దలను భాధిస్తున్నా అతడి మంచి మనసు, దయాగుణం,, క్రమశిక్షణ, సత్ప్రవర్తన కాదనలేరు. అతడి నాయకత్వం వారికి కావాలి.అతడి అండదండ వారు వదులుకోలేరు .పైగా చేసిన తప్పు( వారి దృష్టిలో) ఒప్పుకొని తనకు తానే శిక్ష వేసుకోవటం; ఊరికి దూరంగా,వెలివేసినట్లు వుండాలనుకోవటం,ఛాందసవాదులను సైతం కదిలించింది. విక్రమ్ నువదులుకునే పరిస్థితి లో వారు లేరు. కోమలి తో వివాహం అతడి వ్యక్తి గత సమస్య. ఈవిషయం లో జోక్యం చేసుకోవటం వారికి సబబు కాదనిపించింది. మంచి తనం ముందు , మానవత్వం ముందు ఎంతటి వారైనా తలవంచాలి... తప్పదు.

పొలం గట్టున ఆ చిన్న లోగిలిలో రేపల్లె కళలు మెరిశాయి. విక్రమ్ సింహ్ కోమలాదేవితో ఆ ఇంట్లో కాపురానికి శ్రీకారం చుట్టాడు.విక్రమ్ వద్దంటున్నా తమ్ముళ్ళు అన్ని గారికి గట్టి భద్రత కల్పించారు..చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలిసిపోయే రక్షణ వలయం విక్రం చుట్టూ వుంది. రాహుల్ కు కొత్త వాతావరణం మొదటి కాస్త ఇబ్బంది కలిగించినా కోమలి అనురాగం,ఆదరణ తో కొద్ది రోజుల లోనే అలవాటు పడిపోయాడు. విక్రమ్ తల్లి ఆ ఇంటికి తరచూ వస్తూ పోతూ కొత్త కోడలి సంరక్షణ లో నెల బాలుడిలా ఎదుగుతున్న మనవడిని చూసి సంబరపడి పోయింది.

విక్రమ్ తమ్ముళ్ళ కు తమ పరిస్థితి అయోమయంగా అనిపించింది. పరువు-ప్రతిష్ట ,వంశగౌరవం అని పాకులాడినందుకు తమకు మిగిలిందేమిటి ? సానుభూతి పవనాలు అన్నను హీరోగా అందనంత ఎత్తులో నిలబెట్టాయి.అతడు చేసిన వర్ణ సంకరం దూది పింజెలా తేలిపోయింది.ఊరి ప్రజల మాటను గౌరవించి అందరికీ దూరంగా వుండటం,తన అధికారం తమ్ముడికి కట్టి బెట్టాలనుకోవటం విక్రమ్ తీసుకున్న అనూహ్య మైన నిర్ణయాలు. ఈ చర్య తో అందరూ అతడిని ,అతడి గుణగణాన్ని అభినందిస్తున్నారు. తామే గ్రామ వాసుల దృష్టిలో పలచనైపోయారు. తల్లి కూడా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం తో ముక్తసరిగా వుంటోంది. అవసరం అనుకుంటే తప్ప పెదవి కదపటం లేదు. వారికి అర్ధం కాని బ్రహ్మ తత్వంఅన్న గారు శిక్ష తమకు విధించుకున్నారా లేక తమను శిక్ష పేరుతో భాధిస్తున్నారా?

అన్నదూరం కావటం తమ్ముళ్ళు తట్టుకోలేక పోయారు. ఆయన చల్లటి నీడలో ఆయన ఆజ్ఞ లను పాటించే తమ్ముళ్ళ లా నిలిచి పోవాలని వారి ఆరాటం. కోమల ఆగమనం తో ఆ ఆశ అడియాస అయింది.అన్న దూరమయ్యాడు.అపనింద మిగిలింది. ఊరి వారు వారిద్దరి నీ వేరుగా చూడసాగారు. అందరిలో కలిసి తిరుగుతున్నా విచిత్రమైన ఒంటరితనం.

ఈ స్థితి వారు తట్టుకోలేకపోయారు.వారికి ఓదార్పు,ఊరట చాలా అవసరమనిపించాయి. వెంటనే మేనమామ ను ఆశ్రయించారు.Like mindedness వారిని విచిత్రం గా కలిపింది.అనునయించాడు.ఆలోచింపజేశాడు.

విక్రమ్ మాటలతో మేనమామ అహం దెబ్బతిన్నది. ఓ కులం తక్కువ దాని కోసం మేనల్లుడు ఇన్నేళ్ళ అనుబంధాన్ని గడ్డిపోచ లా గాలికి వదిలేశాడు.ఇందుకు ఏదో ఒక ప్రతిచర్య చేయందే ఆయన మనసు శాంతించేలా లేదు. ఉపాయం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.అలా మధనపడే సమయంలో చిన్న మేనళ్ళుళ్ళు బేలగా ఆయనను ఆశ్రయించారు.ఈ అనుకోని పరిణామంతో ఆయనకు ఏనుగెక్కినంత సంబరమైంది.ఈ బలం,బలగం చాలు అనుకున్నది సాధించడానికి.

మాటల గారడీ తో, సమయస్ఫూర్తి తో తేజ్ సింహ్ మేనళ్ళుళ్ళ మనసులను విషపూరితం చేశాడు.వారిలో ఆవగింజంత పరిమాణం లో మిగిలివున్న మానవత్వాన్ని పూర్తిగా తుడిచి పెట్టేశాడు.కోమలాదేవి పతనమే వారి లక్ష్య మయింది.

బెదిరించో,భయపెట్టో కోమలను వదిలించుకోవాలని తనది, తమ్ముళ్ళది లక్ష్యం.ఆమెను ఎలాగైనా అన్న గారి నుండి దూరం చేయాలన్నదే వారి ఆలోచన.అందుకు ధనం బలమైన సాధనం అనుకున్నారు.ముందు ప్రాణభయం కలిగించాలి.మనసుకు శాంతి లేకుండా చేసి ఆమెకు డబ్బు ఎర వేయాలి.గతి లేనిది కనుక వచ్చినంత రాల్చుకుని ప్రాణం కాపాడుకోవాలనుకుంటుంది....డబ్బుతో ఉడాయించిన కోమల నైజం తెలుసుకుని అన్నగారికి ఆవిడపై విరక్తి కలుగుతుంది.అంతటితో ఇంటికి పట్టిన నీడలో వదిలిపోతుంది..ఇదీ వారి ప్రణాళిక.

కాని తేజ్ సింహ్ వ్యూహం వేరు.ఆయనకు విక్రమ్ మనసు బాగా తెలుసు. కోమల జీవించి ఉండగా ఆమెను అతడి నుండి ఏ శక్తి వేరు చేయలేదు..ఏ అనుమానపు నీడలు అతడి నమ్మకాన్ని వమ్ము చేయలేవు. వారిద్దరి నీ చావు ఒక్కటే వేరు చేయగలదు.

ఈ ఆలోచన మొదటి దశలో విక్రమ్ తమ్ముళ్ళ కు చాలా విపరీతంగా తోచింది.తమ లక్ష్యం కోసం చేతులు రక్తసిక్తం చేసికోవడం వారికి అసలు నచ్చలేదు.కాని...బాగా ఆలోచించగా అదొక్కటే మార్గం అనిపించింది.కోమలాదేవిని ఈ లోకం నుండి శాశ్వతంగా పైకి పంపడమే ఉత్తమం అనిపించింది.

కానిఆమె చావు చాలా సహజంగా వుండాలి.ఎవరికీ ఏ అనుమానం రాకూడదు.వయసు, అనుభవం పండిన మేనమామ ఇందుకు క్షుద్ర శక్తి ని ఆశ్రయించాలనుకున్నాడు.

ముగ్గురూ ఓ క్షుద్రోపాశకుడిని రహస్యం గా కలిశారు.జరగవలసింది వివరించారు. అతడు చేతబడి తో ఆమెను చంపవచ్చని, ఎవరికీ అనుమానం రాదని హామీ ఇచ్చాడు.ఆ ప్రతిపాదన వా రికి నచ్చింది. క్షుద్ర విద్యలు నేర్చుకోవడం అమానుషం.కేవలం బ్రతుకు దెరువు కోసం ఎవరూ అంత సాహసం చేయరు.అందులో ఎన్నో సాధకబాధకాలు వున్నాయి. ఒక్కొక్క సారి సాధనలో, ప్రయోగం లో చిన్న పొరపాటు సాధకుడి ప్రాణాలనే బలి తీసికొంటుంది. అందుకే అన్నింటికీ తెగించిన వాడే గుండె రాయి చేసుకుని ఈ చీకటి రాజ్యం లో అడుగు పెడతాడు.అన్ని అవరోధాలు దాటి సంపూర్ణంగా క్షుద్ర విద్య ను సొంతం చేసుకున్న వాడు బహు అరుదుగా కనిపిస్తారు. అలా విద్య నేర్చుకున్న ఓ ఔత్సాహికుడిని వీరు కలిశారు.

అతడో యువకుడు.లోకానుభవం అంతగా లేనివాడు.తను నేర్చుకున్న ది వెంటనే ఆచరణలో పెట్టాలన్న ఆలోచన అతడిని పట్టి కుదిపేస్తుంది.అందుకే వెనకా ముందు చూసుకోకుండా , సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా కోమలా దేవి పై ప్రయోగానికి పూనుకున్నాడు. ఎవరు ఏం చేయాలో, ఎవరి పాత్ర ఎంతవరకో అన్న చర్చ జరిగింది. కార్య జయం రంగం సిద్దం అయింది.

ఈ యువకుడు ఒక సారి రైలు ప్రయాణం లో తేజ్ సింహ్ ను కాకతాళీయం గా కలిశాడు..మాటమాట కలిసింది. తేజ్ సింహ్ మాటలు గారడీ కి కరిగి పోయి అతగాడు తన వృత్తి, విలాసం, అనుభవాలు అనుకోకుండా చెప్పాడు. అతడికి మంత్ర విద్యలు తెలుసున్న విషయం విని తేజ్ సింహ కాస్త ఖంగుతిన్నా, తమాయించుకున్నాను. అతడు చెప్పేది ఆసక్తిగా విన్నాడు.అంతే.......ఎవరి మజిలీ లో వారు దిగిపో యారు.

ఆ యువకుడి తో అవసరం వస్తుందని తేజ్ సింహ్ కలలో కూడా అనుకోలేదు. పరిస్థితులు చిత్రవిచిత్ర గతిలో సాగి, ఓ మారణ హోమానికి ఆ యువకుడి సహకారం కావలసివచ్చింది. ఈ పరిణామాన్ని విధి లీల అనాలో, లేక తమ పైశాచికత్వానికి పరాకాష్ట అనాలో విక్రమ్ తమ్ముళ్ళ కు మేనమామ కు అర్థం కాలేదు.

పొలం గట్టున ప్రశాంత వాతావరణం లో విక్రమ్ సింగ్ కొత్త కాపురం ఏ ఒడిదుడుకులు లేకుండా సాగి పోతుంది.

రాహుల్ కోమలా దేవి కొంగు చాటు బిడ్డ అయినాడు. ఆమెను వదిలి ఆ పసివాడు క్షణం కూడా దూరంగా వుండే లేకపోతున్నాడు. రేయింబవళ్లు అమ్మ ధ్యాసే. ! అమ్మ నామస్మరణే !

తన కొడుకు పట్ల కోమలి చూపుతున్న శ్రద్ధ, అంకిత భావం విక్రమ్ ను కదిలించాయి. ఆమెకు భర్త గా తన వంతు బాధ్యత నిర్వహించాలని తహతహలాడాడు. అందుకు రాహుల్ సున్నితమైన అవరోధం... అయినా కొడుకు సంతోషం కోసం ఓర్పుతో కాలం గడుపుతున్నాడు.

******************************************

కొనసాగించండి 10 లో