రౌడీలు కూడా టీ తాగుతూ కార్తీక్ ను గమనించ సాగారు. వారికి వచ్చిన ఆదేశాలు ఏమిటంటే ఏదో కాకతాళీయంగా జరిగిన గొడవ లేదా ప్రమాదంలా ఉండాలి కార్తీక్ చావు. ఇంతలో అబ్దుల్లా వచ్చాడు. కార్తీక్ అబ్దుల్లా ఇద్దరు మాట్లాడుకుంటూ టీ తాగారు. ఇక ఇంటికి వెళదామని లేచి నిలబడి బయలుదేరారు. వారు వెళ్తున్నారు
అని గమనించి రౌడీలలో ఒకడు టీ కప్పుతో కార్తీక్ ఎదురుగా వెళ్లి కావాలనే గుద్దాడు. టీ కప్పులోని టీ ఒలికిపోయింది. వెంటనే కార్తీక్ 'సారీ చూసుకోలేదు' అన్నాడు, తన తప్పు లేకపోయినా.
"ఏరా కళ్ళు కనపడటం లేదా? మాలాంటి పేదవాళ్లంటే మీకు చులకన రా.. నీలాంటి ఒకనికి బుద్ధి చెబితే మిగతా వాళ్లకు బుద్ధి వస్తుంది "అంటూ లేచి చేతితో దోపుకున్న కత్తిని తీసి కార్తీక్ ను పొడవ పోయాడు. కార్తీక్ వేగంగా పక్కకు జరిగాడు. వీడు కావాలని ఇలా చేస్తున్నాడని అర్థమైంది. వెంటనే చేతితో వాడి చెంపపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు వాడి చేతిలోని కత్తి జారిపోయింది,కళ్ళు బైర్లు కమ్మాయి. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న మిగతా రౌడీలు, ఒరేయ్ మన వాన్ని కొడుతున్నాడు పదండి రా.. వాని అంతు చూద్దాం అంటూ ముందు కొచ్చారు.
ఇదంతా చూసిన అబ్దుల్లాకు కూడా విషయం అర్థమైంది. కార్తీక్ ను కాపాడాలని అతనికి సహాయంగా వెళ్ళాడు. వాళ్లు కార్తీక్ వైపు బలంగా దూసుకొస్తున్నారు.... కార్తీక్,అబ్దుల్లాలు కుర్చీలు తీసుకొని వారి పైకి విసురుతున్నారు. కొన్ని కుర్చీలు తగిలి కొందరు కింద పడిపోయారు. మిగిలిన వాళ్ళతో అబ్దుల్లా, కార్తీక్ లు కలయబడ్డారు.అబ్దుల్లా దొరికిన వారిని దొరికినట్లు కొడుతున్నాడు. కార్తీక్ కూడా వేగంగా వారి పైకి దాడి చేయడం మొదలుపెట్టాడు.
కార్తీక్ దెబ్బ తిన్నవాడు పైకి లేవలేక పోతున్నాడు.. ఐదు నిమిషాల్లో అందరూ పడిపోయారు. ఇంక అక్కడ ఉండకూడదని ఇద్దరూ బయలుదేరారు. బైక్ పై వెళుతుండగా, "కార్తీక్! వాళ్ళు నీకోసమే వచ్చారు. ఇది ఏదో కాకతాళియంగా జరిగిన సంఘటన కాదు. వాళ్ళు ఎవరు? వాళ్ళు కత్తులతో వచ్చారు, నిన్ను చంపడానికి. నీకు వాళ్లకు వైరం ఎలా?" అన్న అబ్దుల్లా ప్రశ్నలకు కార్తీక్ మౌనం వహించాడు.
కొద్దిసేపటి తర్వాత, " సమయం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు కూడా నాతో దూరంగా ఉండు" అన్నాడు. అబ్దుల్లా కోపంతో ఏమీ మాట్లాడలేదు.
దెబ్బలు తిన్న రౌడీలు ఒకరికి ఫోన్ చేశారు. ఫోన్లో 'మీరు చంపమన్న వ్యక్తిని అంత సులభంగా చంపలేము. వాడు కొట్టే దెబ్బలకు మా వాళ్ళు పడిపోయి లేవలేక పోతున్నారు. ఈ పని మా వల్ల కాదు. వేరే వాళ్ళతో ప్రయత్నించండి 'అంటూ పెట్టేశాడు.
తర్వాత రోజు కార్తీక్ యధావిధిగా బయటకు వెళ్లాడు. సిటీ బస్సు ఎక్కాడు. ఎక్కి సీటులో కూర్చున్నాడు. తన పక్కన ఒక బాబు, వాళ్ళ అమ్మ కూర్చున్నారు.
కార్తీక్ ముందు సీట్లో అమ్మాయిలు కూర్చున్నారు. బస్సు అంతా నిండుగా కోలాహలంగా ఉంది.కొందరు కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు బస్సులో నిలబడి మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత కార్తీక్ ముందర కూర్చున్న అమ్మాయి వెనుకకు తిరిగి కార్తీక్ వైపు చూసింది.
కార్తీక్ కూడా చూశాడు కానీ ఆ చూపులో చురుకుదనం, కోపం కనిపిస్తున్నాయి. కానీ ఎందుకో అలా అమ్మాయి చూడడం కార్తీక్ కు ఏదో కొత్తగా.. ఆనందమో, బాదో తెలియని స్థితిలో ఉన్నాడు. ఆ అమ్మాయి ఎందుకు చూసింది? అని ఆలోచించసాగాడు.
మళ్లీ చూస్తే బాగుంటుంది అంటూ ఎదురు చూడసాగాడు. ఆ అమ్మాయి లావుగా గాని, సన్నగా గాని లేదు. మద్యస్థంగా ఉంది. కలర్ కూడా తెలుపు ఎరుపు మిక్స్ అయి ఉంది. వెంట్రుకలు నల్లగా నిగనిగా లాడుతున్నాయి. గాలికి కొన్ని ముంగుర్లు కార్తీక్ ను తాకుతున్నాయి. కార్తీక్ కు ఏదో మాయ లోకంలో ఉన్నట్లు, మత్తుగా..కొత్తగా ఉంది. ఆ అమ్మాయి కళ్ళలో ఏదో ఆకర్షణ దాగి ఉంది.
కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ వెనకకు తిరిగి చూసింది. ఈసారి కోపంతో కళ్ళు, బుగ్గలు ఎరుపేక్కాయి.
"ఎన్నిసార్లు ఓపిక పట్టాలి. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు టచ్ చేస్తావా?"అంటూ చెంపపై బళ్ళున కొట్టింది. కార్తీక్ కాలు కింద భూమి అదిరిపోయింది. తను ఏమీ చేయలేదు కానీ తనపై నింద పడింది. నేను అమాయకుడిని అని చెప్పడానికి నోరు పెగలడం లేదు. బస్సులోని వారు అందరూ వీరి వైపే చూస్తున్నారు.
ఇంతలో కొట్టిన అమ్మాయి స్నేహితురాలు ఆ అమ్మాయిని సముదాయించి దూరంగా తీసుకెళ్తూ "బుద్ధి లేదా? నీకు అక్క చెల్లెలు లేరా? రౌడీ వెధవ, తూ నీ బతుకు నాశనం కాను "అంటూ శాపనార్ధాలు పెడుతూ బస్సులో వేరే చోట కూర్చున్నారు. బస్సులోని వారు కార్తీకుని చితకబాధాలని అనుకున్నారు, కానీ కార్తీక్ జైలు నుంచి వచ్చాడని తెలుసు కాబట్టి మౌనంగా ఉన్నారు. కార్తీక్ ముందు సీటు నుంచి వాళ్లు వెళ్లిపోవడంతో మగవాళ్లు కూర్చున్నారు.
స్టాప్ వచ్చింది. ఆ ఇద్దరమ్మాయిలు దిగి వెళ్ళిపోతూ కార్తీక్ ను చూశారు. కార్తీక్ కూడా ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి వెంటే బస్సు దిగి ఫాలో అవ్వాలని మనసు తహతలాడింది ,కానీ నన్ను చెంప దెబ్బ కొట్టిన అమ్మాయి, పైగా నన్ను ద్వేషిస్తుంది అని బుద్ధి హెచ్చరించేసరికి మౌనంగా బస్సులోనే కూర్చున్నాడు. బస్సు బయలుదేరింది.
కొద్దిసేపటికి కార్తీక్ ముందు వరుసలో కూర్చున్న ఒక వ్యక్తి లేచి, "ఏమయ్యా నీకు బుద్ధుందా? ఇప్పుడే కదా ఒక అమ్మాయి నువ్వు చేసిన వెదవ పనికి చంప దెబ్బ కొట్టింది. బుద్ధి లేదా? పోనీ అమ్మాయి అంటే అదో విషయం. అబ్బాయిని,మగాన్ని నేను. నన్ను ఎందుకు తాకు తున్నావు?" అంటూ అరిచాడు.
బస్సులో ఉన్న అందరితో పాటు కార్తీక్ కూడా షాక్ అయ్యాడు. ఈసారి బలవంతంగా నోరు తెరుసుకొని "నేనేమీ చేయలేదు" అంటుండగా.. కార్తీక్ పక్కన కూర్చున్న పిల్లవాడి తల్లి "బాబు క్షమించాలి. మిమ్మల్ని తాకింది ఈ బాబు కాదు. మా పిల్లవాడు. వాని చేతిలో సెల్లు ఉంది. దానితో గేమ్స్ ఆడుతున్నాడు. అదే చేతిలో చిన్న కర్ర కూడా ఉంది. వాడికి గేమ్స్ ఆడుతూ ముందుకు వెనకకు ఊగుతున్నప్పుడు మా పిల్లవాడు చేతిలోని కర్ర ముందున ఉన్న మీకు తగులుతుంది. మొదట ఆ అమ్మాయి అపార్థం చేసుకుని కొట్టి వెళ్లిపోయాక నేను కూడా గమనించ సాగాను "అంటూ వివరణ ఇచ్చేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్తీక్ కూడా థాంక్స్ చెప్పాడు కానీ ఏం లాభం? ఈ విషయం వినకుండా అమ్మాయి వెళ్ళిపోయింది అని కార్తీక్ బాధపడ్డాడు. ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తే బాగుంటుందని అనుకున్నాడు.
ఎస్పీ గారిని డిఎస్పీ దుర్గాప్రసాద్ విచారణ ఫైల్ తో కలిశాడు. ఎస్పీ గారు కేసు పురోగతి వివరించమని అడిగాడు.
"సార్! మనము అరెస్టు చేసిన వారందరూ చనిపోయారు. విచారణలో నోరు విప్పలేదు.కోర్టులో హాజరు పరిచాక పోలీస్ కస్టడీ తీసుకుందామని ఆశించాం, కానీ వారిని చంపేశారు. యాక్సిడెంట్ చేసిన వాడు మైనర్ వాడికి కూడా ఏమీ తెలియదు. వాడికి ఫోన్ చేసి అకౌంట్ లో 50,000 వేయించి ఈ పని చేశారు. ఆ అకౌంట్లో ఉన్న పేరు అడ్రస్సు అన్ని ఫేక్. సో దట్ ఇస్ ద డెడ్ ఎండ్. ఇక చనిపోయిన వారందరి కాల్ డేటా తీసాం, పరిశీలించాం.వాటిలో సూరికి ఒక్కడికే భుజంగం నుంచి కాల్స్ వచ్చాయి. అందులో కాల్ రికార్డింగ్స్ ను కూడా పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లేవు. జస్ట్ హలో అన్నా.. వస్తున్న... 15 నిమిషాల్లో ఉంటా.. ఎక్కడున్నావు? ఇలాంటివే తప్ప ఏం లేవు. దీని ద్వారా భుజంగం పాత్రను మనం నిరూపించలేం కోర్టులో. సో కేసును క్లోజ్ చేస్తున్నాం సార్ "అంటూ దుర్గాప్రసాద్ చెప్పాడు.
అప్పుడు ఎస్పీ గారు," ఓకే క్లోజ్ ది కేస్" అని పర్మిషన్ ఇచ్చాడు. నార్కోటిక్స్ వాళ్లు కూడా కేసు క్లోజ్ చేశారు అని చెప్పాడు. తర్వాత ఎస్పీ గారు ఆఫ్ ద రికార్డుగా కొన్ని మాటలు చెబుతాను విను.
"ఈ కేస్ గురించి పైనుంచి చాలా ప్రెజర్స్ ఉన్నాయి. బట్ భుజంగం వాళ్ళ నాన్న హరిచంద్ర ప్రసాద్ పాత్ర ఉన్న మనం నిరూపించలేం. నేను గత పది సంవత్సరాలుగా చూస్తున్న. వారు ఎవిడెన్స్ దొరకకుండా చాలా జాగ్రత్తగాప్లాన్ చేస్తారు. ఏదైనా సాలిడ్ ఎవిడెన్స్ దొరికితే మాత్రం ఎంత ప్రెషర్ ఉన్నా ముందుకే వెళ్దాం. ప్రస్తుతానికి కామ్ గా ఉందాం. ఛాన్స్ కోసం వెయిట్ చేద్దామంటూ "ఎస్పీ గారు అసహనం వ్యక్తం చేశారు.
పోలీస్ డిపార్ట్మెంట్ వారు కార్తీక్ అకౌంట్లోకి రివార్డు కింద పది లక్షల రూపాయలు వేశారు. కార్తిక్ ఆ మెసేజ్ చూసి కూడా సంతోషించలేదు. అతని ఆలోచన మొత్తం బస్సులోని అమ్మాయి చుట్టూ తిరుగుతోంది.
కానిస్టేబుల్ సుబ్బారావు కార్తీక్ కోసం వచ్చాడు. "కార్తీక్! నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి "అని ఆహ్వానించాడు.
"ఎందుకు సార్ ఇవన్నీ?" అని కార్తీక్ అనగా..
" లేదు కార్తీక్. నువ్వు మా అమ్మాయిని కాపాడావు. పైగా ఆపరేషన్ లో నేను కూడా ఉన్నందున రివార్డుగా రెండు లక్షల రూపాయలు వేశారు. సంతోషంగా ఉంది. కచ్చితంగా రావాలి " అని చెప్పాడు. కార్తీక్, వెళ్దామా వద్దా అని ఆలోచించి ఇంత అభిమానంగా పిలిచాడు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
కార్తీక్ భోజనానికి వెళుతూ వెళుతూ చెర్రీని కూడా తీసుకొని వెళ్ళాడు. వెళ్లేసరికి ఇల్లంతా అతిధులు. దాదాపు 30 మందికి పైగా ఉన్నారు. కార్తీక్ వెళ్లగానే సుబ్బారావు, అతని భార్య సాదరంగా ఆహ్వానించారు. సుబ్బారావు తన కూతురిని చూపించి, నీకు తెలుసు కదా..నా కూతురు ఈమె పేరు సుజాత 'అని, పద నా కొడుకును పరిచయం చేస్తా అంటూ వేరే రూమ్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక అబ్బాయిని చూశాడు.
ఆ అబ్బాయి చాలా అందంగా, కసరత్తులు చేస్తాడేమో కండలు తిరిగిన దేహంతో హుందాగా ఉన్నాడు. ఆ యువకుడిని చూపించి, " ఇతను ఐపీఎస్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఇతనికి కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాను" అని సుబ్బారావు అనగానే.. కార్తీక్ కు వెంటనే ఇతని పుస్తకాలు నేను కూడా వాడుకోవచ్చు అన్న ఆలోచన రాగానే ఇతనితో స్నేహం పెంచుకోవాలని స్వార్థం కలిగింది.
సుబ్బారావు, " రా సాత్విక్! ఇతను కార్తీక్" అంటూ పరిచయం చేశాడు. ఇద్దరు కరచాలనం చేశారు.
"అప్పుడప్పుడు ఇంట్లో మా నాన్న నీ గురించి చెబుతుంటాడు "అన్నాడు సాత్విక్.
"అవును మీరేం చేస్తుంటారు?" అని అడిగి కార్తీక్ చెప్పబోయేంతలోనే... మీరు పోలీస్ ఇన్ ఫార్మర్ అంట కదా! నన్ను ఫస్ట్ మా నాన్న చేరమన్నాడు. నాకు ఇష్టం లేదు. నేను డైరెక్ట్ గా యూనిఫామ్ వేసుకుంటా" అంటూ డాంబాలు లు పలికాడు.
సుబ్బారావు కార్తీక్ తో, " ఇవాళ మా పెళ్లి రోజు. అందుకే ఈ చిన్న విందు ఏర్పాటు" చేశామన్నాడు తర్వాత కేక్ కటింగ్ చేశారు. ఫోటోలు దిగారు. చాలామంది గిఫ్ట్స్ ఇస్తున్నారు, కార్తీక్ గిఫ్ట్ తీసుకురాలేదు. అతనికి ఇలా గిఫ్ట్ తీసుకురావాలని తెలియదు.
అందరూ కలిసి భోజనాలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో ఒకరు సుబ్బారావు బావ "సాత్విక్ కు పెళ్లి చేసి పప్పన్నం పెడతావ్ అనుకుంటే నీ పెళ్లి రోజు అంటూ బిర్యాని పెడుతున్నావ్." అనగానే అందరూ ఘల్లున నవ్వారు.
" మాకు పెళ్లి చేయాలనే ఉంది. వాడు ఓకే అంటే రేపే పెళ్లి" అన్నాడు సుబ్బారావు. అయితే పిల్ల ను కూడా చూసుకున్నారు అన్నమాట అంటూ నవ్వారు. కొందరు భోజనాలు చేసి బయలుదేరుతున్నారు.. కార్తీక్ కూడా భోజనానికి సిద్ధమవుతుండగా.. సుబ్బారావు సాత్విక్ తో, "ఎక్కడరా అమ్మాయి? వస్తుందా.. లేదా.. ఇంతవరకు రాలేదు. లేట్ అయిపోయింది" అని అడగగా సాత్విక్ ఫోన్ చేసి బయటనే ఉందంట పిలుసుకొస్తాను అంటూ వెళ్ళాడు.
సుబ్బారావు కార్తీక్ తో, "సాత్విక్ ఆ అమ్మాయి ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ఒప్పుకుంటే మా వాడితో పెళ్లి చేస్తాం. ఆ అమ్మాయి చాలా మంచిది. మా ఇంట్లో అందరికీ నచ్చింది" అంటుండగా సాత్విక్ ఆ అమ్మాయిని లోపలికి తీసుకొని వచ్చాడు.
ఆ అమ్మాయిని చూడగానే కార్తీక్ పిచ్చివాడైపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, బస్సులో కార్తీక్ ను చెంప దెబ్బ కొట్టిన అమ్మాయి.