భారతీయ ఋషి పరంపరలో వశిష్ఠ మహర్షి స్థానం అత్యున్నతమైనది. ఆయన కేవలం మహాతపస్వి, బ్రహ్మజ్ఞాని మాత్రమే కాక రాజగురువుగా, తత్త్వవేత్తగా, రాజనీతికోవిదుడిగా, సద్ధర్మబోధకుడిగా విరాజిల్లారు. సప్తర్షులలో ప్రధానుడైన వశిష్ఠుడు ఇక్ష్వాకు సూర్యవంశాలకు కులగురువుగా వ్యవహరించి, తరతరాల పాలకులకు ధర్మమార్గాన్ని ఉపదేశించిన మహనీయుడు. వైవస్వత మన్వంతరంలోని సప్తర్షులలో ఈయన ఒకరుగా సంప్రదాయం కీర్తిస్తోంది.
పురాణాలలో వశిష్ఠుని జన్మవృత్తాంతం అలౌకిక భావనలతో శోభిల్లుతుంది. ఒక సంప్రదాయం ప్రకారం ఈయన బ్రహ్మదేవుని మానసపుత్రుడు. నిమి మహర్షి శాపవశాత్తు తొలినాటి దేహాన్ని విడిచిన పిమ్మట, మిత్రావరుణుల దివ్యతేజస్సు ద్వారా పునర్జన్మ పొందారని కథనం. ఊర్వశిని దర్శించిన వేళ మిత్రావరుణుల తేజస్సు ఒక కుంభంలో నిక్షిప్తమై, దాని నుంచి వశిష్ఠుడు, అగస్త్య మహర్షి ఆవిర్భవించారు. ఈ కారణంగా వీరిద్దరినీ ‘కుంభజులు’ అని వ్యవహరిస్తారు. ఈ జన్మవృత్తాంతం భారతీయ పురాణేతిహాసాల్లోని గంభీరమైన తాత్త్విక ప్రతీకలను ఆవిష్కరిస్తుంది.
వశిష్ఠుని ధర్మపత్ని అరుంధతి పాతివ్రత్యానికి, ధర్మనిష్ఠకు, ఓర్పునకు, జ్ఞానానికి పరాకాష్ఠగా నిలిచింది. అందుకే హిందూ వివాహ సంప్రదాయంలో నవవధూవరులకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించే ఆచారం నిలిచివుంది. వశిష్ఠ–అరుంధతుల దాంపత్య శోభ ఆదర్శ గృహస్థ జీవితానికి మహోన్నత నిదర్శనం. వశిష్ఠుని వంశంలో శక్తి మహర్షి, ఆయన పుత్రుడు పరాశరుడు, ఆ పరాశర మహర్షికి వేదవ్యాసులవారు అవతరించడం భారతీయ జ్ఞానధారలో ఈ వంశం వహించిన అమోఘ పాత్రను చాటుతోంది.
దేవేంద్రుడు వశిష్ఠునికి కామధేను పుత్రిక అయిన శబల లేదా నందిని అనే దివ్యధేనువును సమర్పించాడని పురాణ కథనం. ఆశ్రమానికి విచ్చేసే అభ్యాగతులకు, శిష్యగణానికి సమస్త అవసరాలను తీర్చే దివ్యశక్తి ఆ ధేనువు సొంతం. పవిత్ర సరస్వతీ నదీ తీరంలో వెలసిన వశిష్ఠాశ్రమం ఆధ్యాత్మిక జ్ఞానపీఠంగా విరాజిల్లింది. సహస్రాది సంఖ్యలో విద్యార్థులకు వేదవిద్యతో పాటు అన్నవస్త్రాలను, ఆశ్రయాన్ని కల్పించిన ఉదారతతో ఈయన ‘కులపతి’ అనే ఉన్నత బిరుదాంకితులయ్యారు.
త్రేతాయుగంలో అయోధ్యాధీశుడు దశరథునికి వశిష్ఠులవారే రాజగురువు. శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు ఈయన దివ్యసాన్నిధ్యంలోనే శస్త్ర, శాస్త్ర విద్యలనభ్యసించారు. వశిష్ఠుని విచక్షణ కేవలం శాస్త్రబోధనకే పరిమితం కాక, ప్రశాంత రాజనీతి నిర్వహణలోనూ భాసిల్లింది. విశ్వామిత్ర మహర్షి తన యాగాన్ని రక్షించేందుకు రామలక్ష్మణులను కోరినప్పుడు, దశరథుడు పుత్రప్రేమతో సంకోచించగా, వశిష్ఠుడు జోక్యం చేసుకున్నారు. విశ్వామిత్రుని మహాత్యాగాన్ని, మహిమను రఘురామునికి వివరించి, వారి వెంట పంపడమే రాముని భావి కార్యసాధనకు, లోకకళ్యాణానికి మూలమని మార్గదర్శనం చేశారు. ఆ నిర్ణయమే విశ్వామిత్రుని వద్ద దివ్యాస్త్రాల ప్రాప్తికి, తాటకా సంహారానికి, అహల్యా శాపవిమోచనానికి, చివరకు సీతారామ కళ్యాణానికి దారితీసి లోకకళ్యాణానికి బలమైన పునాది వేసింది.
వశిష్ఠ మహర్షి జీవితంలో ఆయన క్షమాగుణానికి, ధర్మనిష్ఠకు నిదర్శనంగా నిలిచే ఒక మహత్తర సంఘటన ఉంది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదాన్ని పొందే క్రమంలో తీవ్రమైన అహంకారంతో వశిష్ఠుని నూరు మంది పుత్రులను సంహరించాడు. అయినప్పటికీ వశిష్ఠుడు విశ్వామిత్రునిపై ఏమాత్రం క్రోధం పెంచుకోక, శాంత చిత్తంతో క్షమించాడు. ఒక పౌర్ణమి రాత్రి విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమం వెలుపల దాగి ఉండగా, వశిష్ఠుడు తన భార్య అరుంధతితో మాట్లాడుతూ విశ్వామిత్రుని తపోశక్తిని, తేజస్సును హృదయపూర్వకంగా ప్రశంసించాడు. శత్రువు అని భావించిన వ్యక్తి నుండి లభించిన ఈ నిష్కల్మషమైన పొగడ్తను విన్న విశ్వామిత్రునిలోని అహంకారం తక్షణం పటాపంచలైంది. వెంటనే వశిష్ఠుని పాదాలపై పడి క్షమాపణ కోరగా, వశిష్ఠ మహర్షి ఆయన్ను ఆలింగనం చేసుకుని ‘బ్రహ్మర్షి’గా గుర్తించాడు.
వశిష్ఠ–విశ్వామిత్రుల వృత్తాంతం విశిష్టమైన జీవనసందేశాన్ని అందిస్తుంది. నందినిని బలవంతంగా వశం చేసుకోవాలనుకున్న విశ్వామిత్రుని కాంక్షను వశిష్ఠుడు తిరస్కరించారు. నందిని తన దివ్య ప్రభావంతో విశ్వామిత్రుని చతురంగ బలాలను పరాజయం వైపు నడిపించింది. రాజబలం కన్నా బ్రహ్మబలమే సత్యమైనదని తెలుసుకున్న ఈ ఘట్టం విశ్వామిత్రునిలో తీవ్ర ఆత్మపరిశీలనకు కారణమై, తపస్సు ద్వారా బ్రహ్మర్షిత్వాన్ని సాధించే మహత్తర ప్రయాణానికి నాంది పలికింది. విశ్వామిత్రునిలోని అహంకారం సమూలంగా నశించిందని గుర్తించిన అనంతరమే వశిష్ఠుడు ఆయనను ‘బ్రహ్మర్షి’గా సంబోధించి గౌరవించారు. అహంకారాన్ని జయించడమే నిజమైన జ్ఞానమనే దివ్యసత్యాన్ని వీరి వృత్తాంతం వెల్లడిస్తుంది.
వశిష్ఠ మహర్షి ఆధ్యాత్మిక పరంపరలో ‘యోగవాశిష్ఠం’ అద్వితీయమైన జ్ఞాననిధి. ఇందులో శ్రీరామచంద్రునికి ఆత్మజ్ఞానం, వైరాగ్యం, కర్మఫలజ్ఞానం, భక్తి, ముక్తి అనే గంభీరమైన అంశాలను వశిష్ఠుడు ప్రబోధించారు. సంసార మోహంలో మునిగిపోకుండా జగత్తు ఆభాసను గ్రహించి, కర్తవ్యాచరణలో నిష్కామ భావాన్ని కలిగి ఉండాలని ఈ మహత్తర గ్రంథం నొక్కిచేబుతుంది. రాజ్యాన్ని ఏలే పాలకునికి బాహ్య పరాక్రమంతో పాటు అంతరంగిక వివేకము, శాంతి అత్యంత ఆవశ్యకమని ఈ బోధన స్పష్టం చేస్తుంది.
వశిష్ఠ మహర్షి మహోన్నతమైన గురు పరంపరను, తపఃప్రభావాన్ని స్మరిస్తూ ప్రార్థించే దివ్య శ్లోకం ఈ విధంగా అలరిస్తోంది:
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్॥
ఈ శ్లోకం వశిష్ఠుని నుండి ప్రారంభమై శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకమహర్షి వరకు సాగిన పవిత్ర వంశక్రమాన్ని, ఆధ్యాత్మిక ఉజ్జ్వల వారసత్వాన్ని ప్రశంసిస్తుంది. బ్రహ్మజ్ఞాన ప్రదాతగా, లోకహితైషిగా వశిష్ఠుని స్థానం చిరస్మరణీయం. సప్తర్షి స్మరణలో కూడా "కశ్యపోత్రిర్భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమః। జమదగ్నిర్వశిష్ఠశ్చ సప్తైతే రుషయః స్మృతాః॥" అంటూ ఈ మహర్షికి నిత్య పూజనీయ స్థానం కల్పించారు.
వశిష్ఠ మహర్షి జీవన విధానం సమగ్ర ధర్మస్వరూపం. తపస్సుతో ఆత్మశక్తిని, జ్ఞానంతో వివేకాన్ని, ధర్మంతో బాధ్యతను, రాజనీతితో ప్రజాక్షేమాన్ని ఎలా సాధించవచ్చో ఈయన జీవితం ఆచరణాత్మకంగా చూపింది. వశిష్ఠుడు కేవలం ఒక ఆచార్యుడు మాత్రమే కాక, రాజ్యానికి హితవు పలికిన గురువు, సద్ధర్మానికి రక్షకుడు, అక్షరజ్ఞానానికి మహోన్నత ప్రతీక. ఈ మహర్షి నామధేయంతో వెలసిన వశిష్ఠ గోత్రం ఆయన ఆధ్యాత్మిక సంపదకు నిత్యసజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. సత్యం, అహింస, క్షమ అనే ఉత్కృష్ట గుణాలకు వశిష్ఠుని జీవనం ఒక దివ్య ప్రమాణంగా నిలిచి యుగయుగాలకూ మానవాళికి కాంతిరేఖగా భాసిల్లుతోంది.